Tuesday 19 August 2014

విజయవాడపై నారాయణ తొందరపాటు - KE

ఆంధ్ర రాజధాని : మంత్రుల మధ్య విభేదాలు విజయవాడపై నారాయణ తొందరపాటు వల్లే భూముల ధరలకు రెక్కలొచ్చాయి : కేఈ

Published at: 19-08-2014 12:18 PM
హైదరాబాద్, ఆగష్టు 19 : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఏపీ మంత్రుల మధ్య విభేదాలు తలెత్తాయి. విజయవాడే రాజధాని అని మంత్రి నారాయణ తొందరబడి మాట్లాడాల్సి అవసరం ఏముందని అసెంబ్లీ లాబీలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆయన ప్రకటన వల్లే భూములు ధరలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ తాత్కాలిక రాజ«ధాని అని మాత్రమే చెప్పామని వెల్లడించారు. అక్కడ ధరలు పెరిగితే వేరే చోటుకు తరలిపోయే అవకాశం ఉందన్నారు. విజయవాడ చాలా ఇరుకైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వద్దని తాను అనలేదని, అయితే విజయవాడే రాజధాని కావాలని మంత్రి నారాయణ పదేపదే ఎందుకు ప్రకటన చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇదే సమయంలో జిల్లాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను మంత్రి కేఈ కృష్ణమూర్తి వివరించారు. విజయవాడలో ప్రభుత్వ భూములు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయని, మొత్తం 500 ఎకరాలలోపే భూమి అందుబాటులో ఉందన్నారు. కర్నూలుకు 10 కిలోమీటర్ల పరిధిలో 5వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఇతర ఏ జిల్లా కేంద్రంలోనూ ఇంత భూమి అందుబాటులో లేదని ఆయన తెలిపారు. కర్నూలును రాజధాని చేయాలని తాను అడగటం లేదని, జిల్లాకు సీఎం ఇచ్చిన వరాలలో 50 శాతం నెరవేర్చినా తాను చరిత్రలో మిగిలిపోతానని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు.

No comments:

Post a Comment