Thursday 7 August 2014

అనుష్కకు అన్నీ చెప్పేశా!



అనుష్కకు అన్నీ చెప్పేశా!

Published at: 08-08-2014 08:23 AM
హైదరాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఇంటర్నెట్‌లో ‘తియ్యటి వల’ విసిరిన అనుష్కా అగర్వాల్‌ మాయలో పడి సైనిక రహస్యాలు బయటపెట్టానని నాయక్‌ సుబేదార్‌ పతన్‌ కుమార్‌ పొద్దర్‌ అంగీకరించినట్లు తెలిసింది. ‘‘భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివరాలు, బ్రిగేడ్ల కదలికలు, అధికారుల ఫోన్‌ నెంబర్లను అనుష్కకు ఇంటర్నెట్‌ ద్వారా చేరవేశాను’’ అని ఒప్పుకొన్నట్లు సమాచారం. పతన్‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో అతని వాంగ్మూలాన్ని పూర్తిగా ప్రస్తావించారు. దీని ప్రకారం...  పతన్‌కు గత ఏడాది ఫేస్‌బుక్‌లో అనుష్క పరిచయమైంది. తన తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్‌ కమాండర్‌గా రిటైర్‌ అయ్యాడని తెలిపింది. తాను ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నానని, అందులో పని చేయాలని పతన్‌ను కోరింది. ప్రతినెలా జీతం ఇస్తామని కూడా చెప్పింది. ఆ తర్వాత మెల్లమెల్లగా... మిలటరీ కమాండెంట్ల పేర్లు, వారి ఫోన్‌ నెంబర్లు, కదలికలపై సమాచారం కోరేది. తమపై నిఘా వేయకుండా... ‘ప్రాక్సీ’ ఈ-మెయిల్‌ సృష్టించి, దాని ద్వారానే సమాచార వినిమయం జరిగేలా పతన్‌కు శిక్షణ ఇచ్చింది. పతన్‌కు తరచూ నగ్న చిత్రాలు, వీడియోలను పంపుతూ ఆకట్టుకునేది. మొదట ఐదుగురు అధికారుల సమాచారం ఇవ్వగానే మాల్దాలోని పతన్‌కు చెందిన ఎస్‌బీఐ ఖాతాలో రూ.15 వేలు జమచేసింది. ఆ డబ్బుతో పతన్‌ కొత్త దుస్తులు కొనుకుని... వాటితో ఫొటోలు దిగి అనుష్కకు  పంపించాడు. 12 బ్రిగేడ్లు, మిలటరీ స్థావరాలు, సైన్యం ఉపయోగిస్తున్న ఆయుధాలకు సంబంధించిన వివరాలు అనుష్కకు చేరవేశాడు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు చెందిన పలు ప్రాంతాల ఫొటోలు కూడా పంపించాడు. దేశ పశ్చిమ సరిహద్దులో మోహరించిన బలగాల వివరాలూ అనుష్కకు చేరవేశాడు.
పాక్‌ సైన్యం పనేనా?
పతన్‌తో చాటింగ్‌లో మిలటరీ వివరాలు సేకరించింది అసలు మహిళేనా? లేక... రహస్య సమాచారం రాబట్టేందుకు పాక్‌ సైన్యమే ఈ నాటకం ఆడిందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.  సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా మిలటరీ కార్యాలయంలోని కంప్యూటర్‌నే ఉపయోగించాల్సిందిగా అనుష్క పదేపదే పతన్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సహాయంతో కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లోని సమాచారాన్ని సేకరించేందుకే ఇలా చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు.. పతన్‌ చేసిన మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌లో భాగస్వాములైన వారి గుండెల్లో ఇప్పుడు దడ పుడుతోంది. సైన్యంలో తనకు పరిచయమున్న అనేకమందిని పతన్‌ ఈ వ్యాపారంలోకి దించాడు. మరోవైపు... అతను ఆర్మీలోని ఈఎంఈ విభాగానికి చెందినవాడని పోలీసులు చెబుతున్నా,  ఇది నిజం కాదని సైన్యాధికారులు చెబుతున్నారు పతన్‌కుమార్‌ పూర్తిగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కేంద్రంగా ఉండే 151 ఎంసీ/ఎంఎఫ్‌ విభాగానికి చెందిన వాడేనని వారు స్పష్టం చేశారు. కాగా, పతన్‌ నుంచి పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌, ఫోన్‌, సిమ్‌ కార్డులు, డైరీల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పతన్‌ విదేశీ సంస్థ తరఫున గూఢచారిగా వ్యవహరించారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు. పతన్‌ను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్‌ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు.

No comments:

Post a Comment