Friday 15 August 2014

పాకిస్థాన్‌ అల్లకల్లోలం


పాకిస్థాన్‌ అల్లకల్లోలం

Published at: 16-08-2014 04:35 AM
సైన్యం చేతిలో పాక్‌ రాజధాని
రాజధానివైపు దూసుకొస్తున్న ర్యాలీలు
ఇమ్రాన్‌ కారుపై దాడి..
 వైమానిక స్థావరాలపై విరుచుకుపడిన తాలిబన్లు
ఇస్లామాబాద్‌, ఆగస్టు 15 : పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ ప్రభుత్వ వ్యతిరేక నిరసన ర్యాలీలతో హోరెత్తుతోంది. మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ నాయకత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ (పీటీఐ) ‘స్వేచ్ఛా ర్యాలీ’ పేరుతో, ప్రముఖ మత గురువు తాహిరుల్‌ ఖాద్రి ‘విప్లవ ర్యాలీ’ పేరుతో ఇస్లామాబాద్‌ ముట్టడికి పిలుపు ఇచ్చారు. దీంతో వేల సంఖ్యలో పీటీఐ కార్యకర్తలు, ఖాద్రి అనుచరులు లాహోర్‌ నుంచి ర్యాలీగా ఇస్లామాబాద్‌ బయలు దేరారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌ నగరాన్ని సైన్యానికి అప్పగించింది. నగరం చుట్టు పక్కల కూడా భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించింది. రిగ్గింగ్‌తో గెలిచిన ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను అంగీకరించే వరకు ఇస్లామాబాద్‌ వీడే ప్రసక్తే లేదని పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. దీంతో పాక్‌ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే సమయంలో ప్రముఖ మత గురువు తాహిరుల్‌ ఖాద్రి విప్లవ ర్యాలీ పేరుతో మరో ర్యాలీ చేపట్టడంతో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పీటీఐ కార్యకర్తలు, ఖాద్రి అనుచరులు ఇస్లామాబాద్‌ చేరకుండా అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ భద్రతా దళాల్ని మోహరించారు.
ఇమ్రాన్‌ఖాన్‌పై దాడి  
ఇస్లామాబాద్‌ వస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ వాహనంపై పంజాబ్‌లోని గుజ్రన్‌వాలా సిటీలో శుక్రవారం అధికార పీఎంఎల్‌ -ఎన్‌ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అధికార పార్టీ కార్యకర్తలు తనను హతమార్చేందుకు తన వాహనంపై కాల్పులు కూడా జరిపారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. ఈ దాడిలో ఎనిమిది వుమంది తమ కార్యకర్తలు గాయపడ్డారన్నారు. పీఎంఎల్‌ - ఎన్‌ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది. పీటీఐ కార్యకర్తలే దారి పొడవునా తమ ఆఫీసులపై దాడులు చేస్తున్నారని ఆరోపించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం పీఎంఎల్‌ - కార్యకర్తలు తన కారుపై దాడి చేస్తున్న వీడియోని మీడియాకు చూపించారు.
పాక్‌ సుప్రీం కోర్టు ఆదేశాలు
ర్యాలీలు, నిరసన ప్రఽదర్శనలు హోరెత్తుతున్న సమయంలో పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి పెద్ద ఊరట కలిగిస్తునాయి. ప్రస్తుతం ఉన్న పౌర ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఎవరూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు పాల్పడవద్దని ఆదేశాల జారీ చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే దేశ ద్రోహం అవుతుందని తెలిపింది. దేశ ద్రోహానికి పాల్పడితే పాక్‌ చట్టాల ప్రకారం ఉరి శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. విపక్షాల రాజధాని ముట్టడి నేపథ్యంలో పాక్‌ సైన్యం మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పాక్‌ సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం.
రెండు వైమానిక స్థావరాలపై దాడి  
ఇమ్రాన్‌ ఖాన్‌, ఖాద్రీల ర్యాలీలతో  పాక్‌ రాజధాని సతమతమవుతుంటే ......బెలూచిస్థాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బెలూచిస్థాన్‌ రాజధాని క్వెట్టాలోని రెండు వైమానిక స్థావరాలపై ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండడంతో దాడికి తెగబడిన పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. తామే ఈ దాడి చేసినట్టు తెహ్రీక్‌ తాలిబాన్‌ పాకిస్థాన్‌ (టీటీపీ) ప్రకటించింది. వజీరిస్థాన్‌లో అమాయకుల్ని సైన్యం హతమార్చడానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు తెలిపింది. వజీరిస్థాన్‌లో పాక్‌ సైన్యం ఇప్పటికైనా దాడులు ఆపకపోతే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించింది.

No comments:

Post a Comment