Saturday 9 August 2014

అమెరికా చికెన్‌ లెగ్స్‌ వస్తే అంతే..

అమెరికా చికెన్‌ లెగ్స్‌ వస్తే అంతే..

Published at: 07-08-2014 07:32 AM
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అమెరికా నుంచి చికెన్‌ లెగ్స్‌ భారత్‌కు వస్తే ఇక్కడి పరిశ్రమ ఘోరంగా దెబ్బతింటుందని, ఫలితంగా దీనిపై ఆధారపడిన లక్షలాది మంది రైతులు రోడ్డున పడతారని పౌల్ర్టీ పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొన్ని ప్రయోజనాల కోసం ప్రభుత్వం లక్షలాది మంది జీవితాలను పణంగా పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. ఇప్పటికే పౌల్ర్టీ పరిశ్రమ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ఇప్పుడు అమె రికా చికెన్‌ లెగ్స్‌ను భారత్‌లోకి అనుమతించాలన్న తాజా ప్రయత్నా లు తమను మరింత  ఆందోళనకు గురి చేస్తోందని పౌల్ర్టీ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. అక్కడి మార్కెట్లో ఎలాంటి విలువ లేని చికెన్‌ లెగ్స్‌ను భారత్‌కు ఎగుమతి చేసి చేతులు దులుపుకోవాలని అమెరికా భావిస్తోందని, ఇలాంటి చర్యవల్ల భారత్‌లోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. బుధవారంనాడిక్కడ తెలంగాణ పౌల్ర్టీ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ డి సుధాకర్‌, పౌల్ర్టీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ (పిబిఎ) ప్రెసిడెంట్‌ జి రంజిత్‌ రెడ్డి, నెక్‌ వైస్‌ చైర్మన్‌ కెవిఎస్‌ సుబ్బరాజు, వెంకటేశ్వరా హ్యాచరీస్‌ గ్రూప్‌ జిఎం బాల సుబ్రమణ్యం, పిబిఎ వైస్‌ ప్రెసిడెంట్‌ వి హర్షవర్ధన్‌ రెడ్డి ఇతర ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా చికెన్‌ లెగ్స్‌ను మన మార్కెట్లోకి అనుమతించాలన్న యోచనలో ఎంత మాత్రం న్యాయంలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో నెలలు, ఏళ్ల తరబడి చికెన్‌ లెగ్స్‌ను నిల్వ చేసి ఉంచుతున్నారని, దాన్ని ఎలాగైనా భారత్‌ వంటి దేశాలకు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారని చెప్పారు. అమెరికా చికెన్‌ లెగ్స్‌ను దిగుమతి చేసుకున్న శ్రీలంక, ఫిలిప్పీన్స్‌, రష్యా వంటి మార్కెట్లు ఘోర పరిస్థితులను ఎదుర్కొన్నాయని, వాటి నుంచి మన కేంద్ర ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. కొన్ని బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం దేశీ పౌల్ర్టీని నాశనం చేసే ఎత్తుగడలు వేస్తున్నట్టుగా ఆరోపించారు.
యాంటి బయాటిక్స్‌పై అసత్య ప్రచారం..
దేశీయ బ్రాయిలర్‌ కోళ్లలో మోతాదుకు మించి యాంటి బయాటిక్స్‌ వాడుతున్నారని, మాంసంలో వాటి అవశేషాలు ఉన్నాయని వచ్చిన వార్తలను పౌల్ర్టీ రంగ ప్రతినిధులు ఖండించారు. ఇలాంటి వాటిని వాడేంత సామర్థ్యం తమకు లేదన్నారు. కోళ్లలో వ్యాధుల నివారణకు కొన్ని రకాల వ్యాక్సిన్లను వాడుతున్నామే తప్పా యాంటి బయాటిక్స్‌ వాడకం అంతగా లేదన్నారు. యాంటి బయాటిక్స్‌  వాడకం వల్ల కోళ్ల ఉత్పత్తి వ్యయం మరింతగా పెరుగుతుందని, అందుకే వాటి జోలికి వెళ్లడం లేదని రంజిత్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం కిలో కోడి  ఉత్పత్తి వ్యయం 70 రూపాయల వరకు ఉంటే... ఫారం వద్ద విక్రయ ధర 58 రూపాయలుందని, గుడ్డును ఉత్పత్తి వ్యయంకన్నా తక్కువకే విక్రయిస్తున్నామన్నారు. తెలంగాణలో నెలకు 4 కోట్ల కిలోల చికెన్‌ ఉత్పత్తి అయితే ఇతర మార్కెట్లకు 30 లక్షల కిలోలు ఎగుమతి అవుతోందని సుబ్రమణ్యం చెప్పారు.

No comments:

Post a Comment