Monday 11 August 2014

హిట్లర్‌.. కేసీఆర్‌

హిట్లర్‌.. కేసీఆర్‌

Published at: 12-08-2014 08:24 AM
.    అప్పుడన్నీ తెలుసని..     ఇప్పుడెందుకు అభ్యంతరం?
.    ఒవైసీ బ్రదర్స్‌ ఆడించినట్లు ఆడుతున్నారు
.   19న సర్వేతో ప్రజలకు నష్టం: ఎన్వీఎస్‌ఎస్‌
హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణనంతా తన సామ్రాజ్యంగా భావించి, ఆయన, ఆయన కుటుంబం చెప్పినట్లే సాగాలంటూ నియంత హిట్లర్‌ను మరిపిస్తున్నారని, తుగ్లక్‌ను మురిపిస్తున్నారని బీజేఎల్పీ ఉప నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బిల్లులోని ప్రతి అంశం తనకు తెలుసు అని, అన్ని విషయాలను తనకు చెప్పాకే బిల్లును ప్రవేశపెట్టారంటూ అన్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు గవర్నర్‌కు శాంతి భద్రతల అధికారాలను అప్పగిస్తే... ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారని నిలదీశారు. ఆ రోజు ఒక మాట చెప్పి, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని ఫాసిస్టు అంటున్నారని ధ్వజమెత్తారు. మోదీకి కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌కు అఽధికారాలు ఇస్తే... జంట నగరాల్లో తమ పెత్తనం పోతుందేమోనన్న భయంతో ఎంఐఎం నేతలు, ఒవైసీ బ్రదర్స్‌ చెప్పినట్లు కేసీఆర్‌ ఆడుతున్నారని ఆరోపించారు. ఇదివరకు అసదుద్దీన్‌ ఒవైసీ చెబితేనే... ప్రభుత్వ లోగోలో చార్మినార్‌ను ముద్రించారని అన్నారు. గవర్నర్‌కు అధికారాలపై బీజేపీ వైఖరి ఏమిటని ప్రశ్నించగా... యూనివర్సిటీలకు గవర్నరే చాన్స్‌లర్‌గా ఉంటారని, కానీ మంత్రిమండలి సూచనల మేరకే యూనివర్సిటీల్లో నియామకాలు జరుగుతాయని చెప్పారు. గవర్నర్‌కు అధికారాల అంశంపై అనవసరంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, ఇదంతా చట్టంలో ఉన్న అంశమేనని స్పష్టం చేశారు. ఈ నెల 19న నిర్వమించే సకల జన సర్వేతో ప్రజలకు తీవ్ర నష్టమని, రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాల్లో కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎంసెట్‌ అడ్మిషన్ల ప్రక్రియను
ఇకనైనా పూర్తి చేయండి: కిషన్‌రెడ్డి
సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అనవసర భేషజాలకు పోకుండా ఇకనైనా ఎంసెట్‌     అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని     బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హితవు పలికారు. విభజన చట్టంలోని అంశాలకు లోబడి ప్రక్రియను పూర్తి చేయాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పును తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. ఆయా అంశాలపై విభజన సందర్భంలో స్పందించకుండా ఇప్పుడు రాజకీయం చేయడం తగదన్నారు. ఈ పర్యాయం అడ్మిషన్లను పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఈ ఏడాది ఫాస్ట్‌ పేరుతో జాప్యం చేయకుండా విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేయాలన్నారు. కాగా,  కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంజూరు చేసిన 552 బస్సులకు సంబంధించి  రాష్ట్ర వాటా నిధులను విడుదల చేయాలని కిషన్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు సోమవారం లేఖ రాశారు

No comments:

Post a Comment