Thursday 7 August 2014

మా పోటీ సింగపూర్‌, అమెరికాతోనే.. ‘కోతల’ తెలంగాణతో కాదు!

మా పోటీ సింగపూర్‌, అమెరికాతోనే.. ‘కోతల’ తెలంగాణతో కాదు!

Published at: 08-08-2014 07:54 AM
కేసీఆర్‌ సవాల్‌కు లోకేశ్‌  ప్రతిస్పందన
నూజివీడు ఆగస్టు 7 : అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ పోటీపడేది అమెరికా, సింగపూర్‌తోనే గానీ, తెలంగాణతోకాదని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌ పోటీపడాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌కు ఆయన అదేస్థాయిలో స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను బాధ్యతలు స్వీకరించిన నాటినుంచే వ్యవసాయానికి నిరంతరాయంగా 7 గంటల విద్యుత్‌, నివాస గృహాలకు కోతలు లేని విద్యుత్‌ను అందిస్తున్నారు. దీనికి భిన్నంగా తెలంగాణలో ముఖ్యనగరం హైదరాబాద్‌లో సైతం విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిలో ఎవరితో ఎవరు పోటీపడాలనేది ఈ ఒక్క అంశం చూస్తే తేలిపోతుంది’’ అని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు మండలం మొర్సపూడిలో రినాన్‌ సోలార్‌, శ్రీలక్ష్మి వెంకటేశ్వర గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. విద్యుత్‌కోతలు లేని రాష్ర్టాన్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతున్నదని, అందులోభాగంగానే సోలార్‌ విద్యుత్‌ను ప్రోత్సహిస్తోందని చెప్పారు. త్వరలో అనంతపురం జిల్లాలో వెయ్యి మెగా వాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.  రుణ మాఫీ విషయంలో సందేహాలకు తావు లేదని వివరించారు. ‘‘రుణమాఫీపై అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం తీసుకున్నాం. అయినా హామీని నెరవేర్చి తీరుతాం. దీనికోసం చంద్రన్న పూర్తిస్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపడుతున్నారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్‌, చింతమనేని ప్రభాకర్‌, జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకారసంఘం అధ్యక్షుడు మోటూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment