Thursday 7 August 2014

మేం సిద్ధం

మేం సిద్ధం

Published at: 08-08-2014 03:40 AM
ఏ ప్రాంత విద్యార్థులెవరో మీరు లెక్క తేల్చండి
ఫీజులు చెల్లించేందుకు మేం సిద్ధం
టి-సర్కారుకు చంద్రబాబు సూచన
ఏపీ విద్యార్థుల ఫీజులు చెల్లిస్తాం
తెలంగాణ, ఏపీ వారెవరో తేల్చాలిగా!
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్దు
భారం ఎక్కువైనా 58ు ఇస్తామన్నాం
అయినా కేసీఆర్‌ వ్యంగ్య విమర్శలు
ఏపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
విజయవాడ, ఆగస్టు 7 : ‘మీ పిల్లల ఫీజులు మీరు కట్టుకోండి! మా పిల్లలవి మేం కట్టుకుంటాం’ అని చెబుతున్న తెలంగాణ సర్కారుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల లెక్క తేలిస్తే... వారి ఫీజులు చెల్లించేందుకు తాము సిద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను చదివించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ‘తెలంగాణ పిల్లలెవరో, ఆంధ్రా పిల్లలెవరో తేల్చాలి కదా!’ అని ప్రశ్నించారు. గురువారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఏపీ విద్యార్థులకు అన్యాయం జరగనివ్వబోమన్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన  ఫీజు రూ. 250 కోట్లు ఉన్నా, రూ. 300 కోట్లు ఉన్నా చెల్లించి తీరుతామన్నారు. అయితే, దీనిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. ‘‘విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉభయ రాష్ట్రాల్లోని ఫీజులో జనాభా ప్రాతిపదికన 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ భరించాలని నేను ప్రతిపాదించాను. దీనివల్ల అదనంగా రూ.300 కోట్ల భారం పడుతుందని ప్రధాన కార్యదర్శి కృష్ణారావు చెప్పారు. అయినా సరే, అందరూ మన పిల్లలే కదా అనుకున్నాం. అదనపు భారమైనా భరిద్దామనుకున్నాం. అయినప్పటికీ కేసీఆర్‌ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ‘సింగపూర్‌లాగా లక్షన్నర కోట్లతో రాజధాని కట్టుకుంటామంటున్నారు. వాళ్ల ఫీజులు వాళ్లు కట్టుకోలేరా? అని అంటున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మొదట మనందరం భారతీయులమని, ఆ తర్వాతే రాష్ట్రాలు వస్తాయని అన్నారు. ‘‘రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎంసెట్‌ జరిగింది. ఇప్పుడు కౌన్సెలింగ్‌ కూడా ఉమ్మడిగానే జరగాలి. కానీ... తెలంగాణ ప్రభుత్వం టీ-విద్యార్థులకే ఫీజు చెల్లిస్తామంటూ మెలికపెట్టి, లక్షలాది విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటోంది. స్థానికత పేరుతో దీన్ని ఆలస్యం చేస్తోంది’’ అని విమర్శించారు. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 10లో ఉన్న సంస్థలపై రెండు ప్రభుత్వాలు కూర్చుని ఎమ్‌వోయూ చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. కొన్ని సంస్థలను రెండు షెడ్యూళ్లలోనూ చేర్చలేదని, అవి ఉమ్మడిగా ఉంటాయని చెప్పారు. వీటిపై విభేదాలు వస్తే కేంద్రం జోక్యంతో పరిష్కరించుకోవాలన్నారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. అయినప్పటికీ.. ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తాం’’ అని బాబు తెలిపారు.
లెక్కతేలిస్తే బాబును కోరతాం: పెద్దిరెడ్డి
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారో కేసీఆర్‌ ప్రభుత్వం లెక్క తేల్చి చెబితే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయమని ఏపీ సీఎం చంద్రబాబును కోరతామని టీడీపీ నేత పెద్దిరెడ్డి అన్నారు. దామాషా ప్రకారం 58 శాతం ఫీజులు చెల్లించడానికి ఏపీ ముందుకువస్తే, కేసీఆర్‌ దానినీ వక్రీకరిస్తున్నారన్నారు. స్థానికతకు 1956 ప్రాతిపదిక అంటున్న కేసీఆర్‌.. 70 లక్షల మంది స్థానికేతరులని చెప్పదల్చుకున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు బాధ్యతగల సీఎంగా ఇతర రాషా్ట్రల సహకారం తీసుకోవాలనే ఉద్దేశం లేదని విమర్శించారు. సంస్థల పేర్లు మార్చటానికి, సంబురాలు చేసుకోవడానికి చాలా సమయం ఉందని.. ముందు సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. పంటలు ఎండిపోతున్నాయని, రైతులను ఏవిధంగా ఆదుకొంటారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదనపు విద్యుత్‌ కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళితే సహకరిస్తామన్నారు. కరీంనగర్‌ను లండన్‌ చేసే ముందు ఇక్కడి రైతులు గల్ఫ్‌కు వలస పోకుండా చూడాలని ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment