Wednesday 20 August 2014

పిచ్చిగా చేస్తే అణచివేస్తా

పిచ్చిగా చేస్తే అణచివేస్తా

Published at: 20-08-2014 05:52 AM
శాంతిభద్రతలపై నా వైఖరి అదే
వాళ్లొస్తే జనం ఊళ్లలోనూ ఉండగలిగేవారు కాదు!
ఎంత గొప్పవాళ్లైనా ఉపేక్షించను
హత్యా రాజకీయాలు చేసినవాళ్ల నోట నీతులా?
రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందన్న జ్ఞానముందా?
అసెంబ్లీలో వైసీపీ నేతల తీరుపై బాబు ఫైర్‌
హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏటీఎంల్లో దొంగ నోట్లు పెట్టినవాళ్లు, దొంగ నోట్లు చెలామణీ చేయించినవాళ్లు, మద్యం సెకండ్స్‌ విక్రయించిన వాళ్లు, ఎర్ర చందనం స్మగ్లర్లు, ఇసుక, భూముల దందాలు, హత్యా రాజకీయాలు నడిపినవాళ్లతో నిండిన పార్టీ వైసీపీ. ఆ పార్టీ నేతలు కూడా అసెంబ్లీలో నిలబడి హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం..దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. వైసీపీ గెలిస్తే ప్రజలు ఊళ్లలో కూడా ఉండగలిగేవాళ్లు కారు. వాళ్లను చూసి భయపడిపోయే మమ్మల్ని గెలిపించారు. ఆ పార్టీ చెప్పినట్లు చేయడానికి మేం ఇక్కడకు రాలేదు. ఈ విషయం ఆ పార్టీ నేతలు గుర్తుంచుకొంటే మంచిది’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత తన చాంబర్‌ వద్ద ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీకి మొదటిసారి వచ్చిన వాళ్లు కూడా సభా సంప్రదాయాలు, పద్ధతులు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా మంత్రి వద్దకు వచ్చి ఆయన మాట్లాడుతుంటే ముఖానికి అడ్డుగా ప్లకార్డు పెట్టడం దీనికి పరాకాష్ట అని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం వచ్చి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. ఇంకా పూర్తిగా సర్దుకోను కూడా సర్దుకోలేదు. అధికారుల విభజన పూర్తి కాలేదు. ఆదాయం ఎంత వస్తుందో తెలియదు. కేంద్రం ఏం ఇస్తుందో స్పష్టత లేదు. ఈ బాధల్లో మేం ఉంటే ప్రజా సమస్యలను గాలికి వదిలి వైసీపీ తన సొంత ఎజెండాను సభపై రుద్దాలని చూస్తోంది. నేను 30 ఏళ్లుగా సభలో ఉన్నాను. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. రెండుసార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను.
మొదటిసారి సభకు వచ్చినవాళ్లు శాసించినట్లుగా మేం నడవాలా?’’ అని ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చేది చొక్కాలు పట్టుకోవడానికి, మీసాలు తిప్పడానికి కాదనేది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ‘‘మా ఎమ్మెల్యే పరిటాల రవిని చంపినప్పుడు సభలో నన్ను మాట్లాడనీయను కూడా మాట్లాడనీయలేదు. నా వరకూ నేను శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉండగా తీవ్రవాదులు, ఫ్యాక్షనిస్టులు, రౌడీల విషయంలో కఠినంగా వ్యవహరించాను. ఇప్పుడైనా అంతే. ఎంత గొప్పవాళ్లయినా శాంతి భద్రతల విషయంలో ఊరుకొనేది లేదు. వాళ్ల హయాంలో జైళ్లలో ఉన్నవారిని కూడా చంపారు. మళ్ళీ అలాంటి పరిస్థితి తేవాలా?’’ అని నిలదీశారు  పిచ్చపిచ్చగా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ‘‘శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తా. కాంగ్రెస్‌ హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ విపరీతంగా పెరిగిపోయింది. అదుపు చేసే క్రమంలో పది మంది ఫారెస్టు అధికారులు ప్రాణాలు కోల్పోయారు’’ అని గుర్తు చేశారు. ప్రభుత్వం బలహీనంగా ఉందని ప్రజలు అనుకొనే పరిస్థితి తెచ్చుకోబోమని చెప్పారు. ‘‘రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఏపీకి ఇంకా మంచి ప్యాకేజి ఇచ్చి ఉండాల్సిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మేం పనిచేస్తుంటే వీళ్లు చేస్తున్నదేమిటి? నా ఓపికని అలుసుగా తీసుకొంటే ఫలితం అనుభవిస్తారు’’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు
నేడు రెండుసార్లు కేబినెట్‌ భేటీ
హైదరాబాద్‌, ఆగస్ట్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌  మంత్రివర్గం బుధవారం  రెండుసార్లు సమావేశం కానుంది. ఒకే రోజు రెండుసార్లు కేబినెట్‌ భేటీ కావటం చాలా అరుదు. బడ్జెట్‌ ఆమోదం కోసం ఉదయం 8 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మరో దఫా సమావేశం జరగనుంది. ప్రతి పది రోజులకోసారి నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశాల్లో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు.

No comments:

Post a Comment