Tuesday 5 August 2014

21వ శతాబ్దంలో పెట్టుబడి

21వ శతాబ్దంలో పెట్టుబడి

రచన: థామస్ పికెట్టీ
ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్ పుస్తకాల విక్రయ సంస్థ అమెజాన్.కామ్‌లో క్రైమ్ కథలు, పిల్లల పుస్తకాలు, శృంగార నవలలే ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కాని అమెజాన్.కామ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాల్పనికేతర విభాగంలోని ఒక పుస్తకం కాల్పనిక సాహిత్యం కంటే మించిన ప్రజాదరణను పొంది సంచలనం రేకెత్తించింది. ఆ పుస్తకం పేరు 'కేపిటల్ ఇన్ ది ట్వంటీ-ఫస్ట్ సెంచరీ' (21వ శతాబ్దంలో పెట్టుబడి) . 700 పేజీలున్న ఈ పుస్తకం పెట్టుబడిదారీ విధానంపై తీవ్ర విమర్శ చేస్తున్నప్పటికీ అమెరికాలో అది అతి పెద్ద హిట్ సాధించింది.
అమెజాన్.కామ్ లోనే కాదు వాషింగ్టన్ నగరంలోని స్వేచ్ఛా మార్కెట్లలో కూడా ఈ పుస్తకం అమ్మకాల విషయంలో అన్ని రికార్డులను అధిగమించింది. అమెజాన్.కామ్ గ్రంధవిక్రయ సంస్థవద్ద అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఆరవస్థానం పొందిన ఈ పుస్తకం ఆ వెబ్ సైట్‌లో అత్యథికంగా అమ్ముడుపోయిన వంద పుస్తకాల్లో ఒకటిగా గత 73 రోజులుగా సుస్థిర స్థానం సాధించిందంటే ఈ పెట్టుబడిదారీ వ్యతిరేక పుస్తకం సత్తా ఏమిటో తెలుస్తుంది.
ఈ  పుస్తక రచయిత ఒక ఫ్రెంచ్ ఆర్థికవేత్త. తన పేరు థామస్ పికెట్టీ (43 ఏళ్లు). ఈ పుస్తకం ఇంగ్లీష్ ఎడిషన్ వెలువడిందే ఆలస్యమన్నట్లుగా ఇతడు అమెరికన్ మేధావులు, వామపక్ష అనుకూల రాజకీయవేత్తల దృష్టిలో కొత్త హీరోగా నిలిచిపోయాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, అమెరికా ప్రభుత్వ ఆర్థిక మంత్రి ల్యూ... ఇలా ఎవరు సమావేశం నిర్వహించినా దాంట్లో ఇప్పుడు థామస్ ఒక ముఖ్య వక్తగా వెలిగిపోతున్నాడంటే పెట్టుబడిదారీ ప్రపంచ శిఖరాగ్ర దేశంలో ఇతడి పుస్తకం కలిగించిన ప్రభావమేంటో తెలుస్తుంది.
ఇంతకూ థామస్ పికెట్టీ ఏం చేశాడు. కాస్తంత సమయం కేటాయించుకుని సామాజిక వ్యత్యాసాలపై పుస్తకం రాసిపడేశాడు. ఇతడెన్నుకున్న అంశం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే ఇటీవలి దశాబ్దాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలోనే సంపన్నులకు, పేదలకు మధ్య ఆంతరం బాగా పెరిగిపోయింది.
ఈ ఆంతరాన్ని పూడ్చడం ఎలా అనే అంశంపైనే అమెరికా అధ్యక్షుడు ఒబామా బరాక్ తన రీ-ఎలెక్షన్ కేంపెయిన్‌లో ఎక్కువ సమయం మాట్లాడారు, సంపన్నులపై అధికపన్ను విధించడం, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయాన్ని అందించడం, ఆర్థిక అన్యాయంపై ప్రభుత్వం పోరాటం చేయడం ద్వారా సమాజంలోని అంతరాన్ని తొలగిస్తానని ఒబామానే చెప్పాల్సి వచ్చింది.
సామాజిక అంతరాలను అధిగమించడం ఎలా?
ఇది అమెరికాలో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్‌ అయింది. పారిస్ లోని తన చిన్న అపార్ట్‌మెంటులో కూర్చుని పెట్టుబడిపై రచన మొదలెట్టిన థామస్ అతి త్వరలోనే దాన్ని అమెరికన్ల లివింగ్ రూమ్‌లలోకి చేరవేయగలిగాడు. దీనికి చిన్న ఉదాహరణ ఏమిటంటే, సంక్షేమ రాజ్యం గురించి ప్రబోధించే నోబెల్ ప్రైజ్ గ్రహీతలైన సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు పాల్ క్రూగ్‌మెన్, జోసెఫ్ స్టిగ్లిట్జ్‌లు సైతం ఈ పుస్తకాన్ని ప్రశంసించడంలో పరస్పరం పోటీ పడ్డారు. ప్రస్తుతం న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్‌గా ఉంటున్న క్రూగ్‌మెన్ , కేపిటల్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ పుస్తకాన్ని అసాధారణమైనదిగా వర్ణించాడు. ఈ సంవత్సరంలోనే కాదు ఈ దశాబ్దంలోనే అత్యంత ప్రముఖమైన ఆర్థిక గ్రంథంగా ప్రశంసలతో ముంచెత్తారు.
పిత్రార్జితమైన లేదా వంశపారంపర్యమైన పెట్టుబడిదారీ విధానం (పేట్రిమోనియల్ కేపిటలిజం) లోకి ప్రపంచం మళ్లీ వెనక్కు వెళ్లిపోతోందంటూ ఈ పుస్తకంలో థామస్ పికెట్టీ చేసిన శక్తివంతమైన వాదనను క్రూగ్‌మెన్ ఆకాశానికెత్తేశారు. ఆర్థిక వ్యవస్థలో అత్యధిక భాగం వారసత్వ రూపంలో పోగుపడుతున్న సంపద ఆధీనంలోకి వెళ్లిపోయినప్పుడు మాత్రమే ఈ పారంపర్య పెట్టుబడిదారీ విధానం ఉనికిలోకి వస్తుందని చరిత్ర చెబుతోంది. దీనికి ఉదాహరణగా ప్రస్తుతం అమెరికా సంపన్నులలో పదింటికి ఆరుగురు  సంపదను సృష్టించడం ద్వారా కాకుండా తమవద్ద పోగుపడిన సంపదను వారసత్వంగా పొందారని క్రూగ్మెన్ పేర్కొన్నారు.
అయితే పికెట్టీ ప్రతిపాదించిన థీసెస్ కొత్తదేమీ కాదు. సమాజంలోని అత్యున్నత వర్గాల చేతిలో సంపద కేంద్రీకృతమైపోయిందని, సంపన్నులు  అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే సంపద గుట్టలుగా పేరుకుపోయి ఉందని పికెట్టీ తన పుస్తకంలో ప్రతిపాదించాడు. అయితే దీన్ని ఆషామాషీగా తీసుకోవడం కాకుండా, తన వాదనలను చార్టులు, గ్రాఫ్‌లతో శక్తివంతంగా నిర్మించాడు.
ఎందుకంటే చారిత్రకంగా కూడా వాస్తవ ఆర్థిక పురోగతి కంటే కూడా పెట్టుబడిపై రాబడి అత్యధికంగా ఉంటూవచ్చింది. ఆదాయం కంటే  సంపదలు వేగంగా పెరుగుతాయి. దాంతో సాధారణ ప్రజలు ప్రపంచంలోని ఒక శాతం సంపన్నులతో పోలిస్తే ఎంతో వెనక్కి, వెనకెనక్కే పోతుంటారన్నది నిరూపిత సత్యమైంది.
ఈ సత్యాన్ని, వాస్తవాన్ని ఏ ఒక్కరికంటే మిన్నగా ప్రపంచం ముందు ప్రకటించిన ఘనత ఒకే ఒక్కడికి చెందుతుంది. అతడే కారల్‌మార్క్స్. 1867లో మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ ఈ విషయాన్ని అత్యంత స్పష్టంగా ప్రకటించింది. పెట్టుబడిదారీ విధానంలో సంపన్నులు మరింత సంపన్నులవుతుంటారని ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేశాడు మార్క్స్. దాస్ కాపిటల్ ప్రచురించబడిన 150 సంవత్సరాల తర్వాత నేటి ప్రపంచాన్ని పరికిస్తే, ఏటా లక్షలాది, కోట్లాది డాలర్లను సంపాదిస్తున్న ఫైనాన్షియల్ మేనేజర్లు పుట్టుకొస్తున్న వైనం బయటపడుతుంది.
ఆనాడు మార్క్స్ రాసిన ఆ వాస్తవాన్ని థామస్ పికెట్టీ తన కాపిటల్ ఇన్ ట్వంటీపస్ట్ సెంచురీ పుస్తకం ద్వారా మరోసారి ప్రతిపాదించాడు. ససాక్ష్యంగా అతడు ప్రతిపాదించిన విషయాలు అమెరికన్లను ఇప్పుడు నివ్వెరపరుస్తున్నాయి. ఇంగ్లీషులో వెలువడక ముందు ఫ్రెంచ్ భాషలో ముద్రించబడిన ఈ పుస్తకం రచయితకు పెద్దగా పేరు తేలేకపోయింది. సృజనాత్మక చింతనపై కొత్త వెలుగులు ప్రసరిస్తున్నట్లు ఇప్పుడు చాలామంది భావిస్తున్న ఈ పుస్తకం ఫ్రెంచ్ మూలంలో అంతగా ఆసక్తిని కలిగించకపోవడం విశేషం. కాగా ఎక్కడైతే ఈ పుస్తకం అవసరం ఎక్కువగా ఉందో అక్కడే అంటే ఆ ఆంగ్ల భాషా ప్రపంచంలోనే ఇది ఎక్కువగా సంచలనం రేకెత్తించడం గమనార్హం.
పికెట్టీ ఏం చెప్పారు?
పెట్టుబడి సంచయనాన్ని, పంపిణీని నిర్దేశిస్తున్న చోదక శక్తులేమిటి? సుదీర్ఘకాలంగా మానవ సమాజంలో ఏర్పడుతూ వస్తున్న అసమానతలు, సంపదల మేట, ఆర్థికాభివృద్ధి అవకాశాలు అనే అంశాలు రాజకీయ అర్థశాస్త్రానికి గుండెకాయ లాంటివి. కాని వీటికి సంతృప్తికరమైన సమాధానం కనుగొనడం కష్టంగా ఉంది. తగినంత డేటా, స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు లేకపోవడమే దీనికి కారణం, కాపిటల్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచురీ పుస్తకంలో థామస్ పికెట్టీ ఈ లోటును పూరించారు. 18 వ శతాబ్ది మొదలుకుని నేటి వరకు దాదాపు 20 దేశాలకు సంబంధించిన విశిష్టమైన డేటాను, గణాంక సమాచారాన్ని ఆయన విశ్లేషించారు. కీలకమైన ఆర్థిక, సామాజిక చిత్రణల గుట్టు బయటపెట్టడానికి ప్రయత్నించారు. పికెట్టి కనుగొన్న అంశాలు మొత్తం చర్చను పరివర్తనకు గురిచేసి సంపద, అసమానతలకు సబంధించిన నూతన తరం ఆలోచలకు కొత్త అజెండాను ఏర్పర్చగలుగుతోంది.
ఆధునిక ఆర్థికాభివృద్ధి, విజ్ఞాన విస్తరణ అనేవి కారల్ మార్క్స్ నాడు ఊహించినంత భారీ స్థాయిలో అసమానతలు ఏర్పడకుండా అడ్డుకుంటున్నాయని పికెట్టీ ఆధార సహితంగా చూపించారు. కాని రెండో ప్రవంచ యుద్ధం తరవాత దశాబ్దాలుగా సమాజం ఆశించినంతగా పెట్టుబడి, అసమానతలకు సంబంధించిన లోతైన చట్రాలను మనం పెద్దగా సవరించలేకపోయాం. మార్చలేకపోయాం. ఆర్థికాభివృద్ధి రేటును అధిగమించి, పెట్టుబడిపై రాబడులు అధికంగా వస్తున్న ధోరణే అసమానతలకు అసలైన కారణం, ప్రపంచవ్యాప్తంగా అశాంతిని, అలజడిని రేకెత్తినస్తున్న తీవ్ర అసమానతలకు ఇదే కారణం. అభివృద్ధి ఏమాత్రం లేకున్నా పెట్టుబడిపై రాబడులు పెరిగిపోవడం.
మరోమాటలో చెప్పాలంటే ఉన్నవారి చెంతే సంపదలు మేటపడటం, లేనివారు మరిత దారిద్ర్యంలోకి కూరుకుపోవడం. అయితే దేవుడి చర్యల బట్టి ఆర్థిక వ్యవస్థ ధోరణులు ఏర్పడవు. గతంలో కూడా ప్రమాదకరమైన అసమానతలను రాజకీయ కార్యాచరణే నిరోధించగలిగింది. అలాంటి కార్యాచరణ మరోసారి అసమానతలకు చెక్ పెడుతుందని పికెట్టీ చెప్పారు.
సమాజం పట్ల అసాధారణమైన ఆకాంక్షతో, ఒరిజినాలిటీతో, అత్యంత నిశితత్వంతో థామస్ పికెట్టీ రాసిన ప్రామాణికమైన 'కాపిటల్ ఇన్ ట్వంటీఫస్ట్ సెంచరీ' పుస్తకం ఆర్థిక చరిత్రపై మన అవగాహనను మరింత పెంచుతోంది. నేటి గుణపాఠాలతో మనలను సంఘర్షణకు గురిచేస్తోంది. ఇదే ఈ పుస్తకం గొప్పదనం.
అయితే థామస్ పికెట్టి పుస్తకం వివాదాలకు అతీతం కాదు. ప్రత్యేకించి ఆ పుస్తకంలోని చివరి భాగం సామాజిక అంతరాలను తొలగించడానికి కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోతున్న, పేరుకుపోయిన సంపదలపై భారీగా పన్నులు విధించాలని, సంపదల మేటను కరిగించాలని పికెట్టీ ప్రతిపాదించారు. ఈ ఒక్క ప్రతిపాదనతో, పికెట్టీపై స్వేచ్చా మార్కెట్ ఆర్థికవేత్తలు విరుచుకుపడ్డారు. సైన్సును భావజాలంతో (ఐడియాలజీ) ముడిపెడుతున్నాడంటూ నిందలకు దిగారు. స్వేచ్ఛా మార్కెట్ నిచ్చెన మెట్లు ఎక్కుతూ కింద ఉన్న జనాలను తొక్కుకుంటూ పోయే పెట్టుబడిదారీ సమర్థకులకు ఆ మాత్రం ఆగ్రహం రావడం సహజమే మరి. అంతమాత్రాన '21వ శతాబ్దంలో పెట్టుబడి' అనే ఈ మనకాలపు వుస్తకం విలువ తగ్గబోదు.

ప్రతులకు
Amezon.com
Capital in the Twenty-First Century

No comments:

Post a Comment