Monday 9 June 2014

ఏపీకి ఏమిచ్చినా మాకూ ఇవ్వాల్సిందే

ఏపీకి ఏమిచ్చినా మాకూ ఇవ్వాల్సిందే

Published at: 09-06-2014 04:26 AM
ఢిల్లీ పర్యటన విజయవంతమైంది
తెలంగాణ అభివృద్ధికి సలహాలు కూడా ఇచ్చాఉ
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబురాలకు మోదీని ఆహ్వానిస్తా
రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
న్యూఢిల్లీ, జూన్ 8 : ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినందున ఈ రెండింటిలో ఏ ఒక్క రాష్ట్రానికి ఏం చేసినా.. రెండో రాష్ట్రానికి కూడా అదే చేయాలని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆంధ్రాకు కల్పించినప్పుడు తెలంగాణకు, తెలంగాణకు కల్పించినప్పుడు ఆంధ్రాకూ కల్పించాల్సిందేనని, లేదంటే ఎవరో ఒకరు నష్టపోతారని అన్నారు. అందుకే ప్రత్యేక హోదా ఇద్దరికీ ఇవ్వాలన్నారు. లేదంటే తెలంగాణలోకి పరిశ్రమలు ఆంధ్రాకు, ఆంధ్రాలో ఉన్నవి తెలంగాణకు తరలిపోయి.. గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు. అందుకే ఏది చేసినా ఇద్దరికీ చేయాలని, సమన్యాయం చేయాలని కోరానని పేర్కొన్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి ప్యాకేజీని కోరలేదని, పునర్విభజన చట్టంలో చేసిన హామీలు అమలు చేయాలని మాత్రమే ప్రధానిని కోరానన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తే తాను చాలా సంతోషిస్తానని, ఇందులో తప్పేమీ లేదని, దీన్ని తాను కూడా స్వాగతిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం పట్ల తమ పార్టీ తటస్థవైఖరి అవలంబిస్తుందని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్ గురించి తప్ప తెలంగాణ కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఏమీ కోరటం లేదని ఒక విలేకరి ప్రస్తావించగా.. ఇది ఆయనకు, ఆయన పార్టీకి సంబంధించిన విషయమన్నారు. తాను మాత్రం తెలంగాణకు ఏమిచ్చినా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వాలని..ఆంధ్రప్రదేశ్‌కు ఏమిచ్చినా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని కోరుతున్నానని చెప్పారు. తాను కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రి, రాష్ట్రపతిల సహాయం కోరేందుకే ఢిల్లీ వచ్చానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు 40 నిమిషాలు మాట్లాడానని, రాష్ట్ర విభజన బిల్లులో తెలంగాణకు ఇచ్చిన చట్టపరమైన హామీలు, రైల్వేకు సంబంధించి తెలంగాణకున్న అవసరాల గురించి వినతి పత్రం సమర్పించానని చెప్పారు.
వీటన్నింటిపైనా తక్షణం చర్యలు చేపట్టాలని కోరానన్నారు. అలాగే, తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు ఇప్పటికే వెనుకబడి ఉన్నాయని ప్రణాళికా సంఘం ప్రకటించిందని, తెలంగాణలో గిరిజనుల జనాభా 12 శాతం, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల జనాభా 85 శాతానికిపైగా ఉన్నదని, రాష్ట్రంలో పేదరికం ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరానని తెలిపారు. తాను కోరిన అంశాలపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. తాను జీవితంలో ప్రధాని కావాలనుకున్నానని, అయిపోయానని, ఇక ఇంత కంటే పెద్ద పదవి తనకు వచ్చేది లేదని, తనకిప్పుడు దేశాభివృద్ధే ప్రధానమని తెలిపారన్నారు. తాను కూడా నిన్నటి వరకూ ముఖ్యమంత్రిగా పని చేశానని, రాష్ట్రాలకు ఎక్కువ స్వేచ్ఛ ఇస్తే దేశం బాగుపడుతుందని నమ్మేవాళ్లలో తానూ ఒకడినని చెప్పినట్లు తెలిపారు. కాబట్టి, పక్షపాత వైఖరి కానీ, మరొకటి కానీ అవలంబించే సమస్యే లేదని స్పష్టం చేసినట్లు చెప్పారు. ఏం అవసరం ఉన్నా తనతో ఫోన్లో మాట్లాడాలని ప్రధాని సూచించారని, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఎలా చూసుకుంటారో తనను కూడా అలాగే చూసుకున్నారని మోదీని కేసీఆర్ పొగిడారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందేందుకు తనకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారని చెప్పారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిని మరిపించేట్లుగా జూన్ 1వ తేదీ అర్ధరాత్రి తెలంగాణలో జరుపుకున్న సంబురాలను తాను చూశానని, ఆ ఆవేశాన్ని కనుక అభివృద్ధిలోకి మరల్చితే.. 25 ఏళ్లలో జరిగే అభివృద్ధి ఐదేళ్లలోనే జరుగుతుందని ప్రధాని తెలిపారన్నారు. తెలంగాణ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. జూలైలో హైదరాబాద్‌లో 164 దేశాల మేయర్ల సదస్సు జరుగనుందని, ఇంతకు ముందే ఖరారైన ఈ సదస్సుకు హాజరు కావాలని రాష్ట్రపతిని ఆహ్వానించానన్నారు. తన ఢిల్లీ పర్యటన విజయవంతం అయ్యిందని కేసీఆర్ వెల్లడించారు.
తక్షణం సివిల్ అధికారుల విభజన ఇరు రాష్ట్రాల్లో పరిపాలన స్తంభించిపోయిందని, ఏ అధికారి ఎటు పోతాడో తెలియకపోతే గందరగోళం తలెత్తుతుందని, అలా కాకుండా సివిల్ సర్వీసు అధికారుల పంపకాలు తక్షణం పూర్తి చేయాలని ప్రధానిని తాను కోరానని కేసీఆర్ చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రానికి చాలా కార్యాలయాలు లేవని తెలిపారు. ఉన్న అధికారులు కూడా ఇక్కడే ఉంటారో పక్క రాష్ట్రానికి వెళ్లిపోతారో తెలియని సందిగ్ధ పరిస్థితి తెలకొందని, అధికారులు మనసుపెట్టి పనిచేయలేకపోతున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల్లో కనీస పరిపాలన ప్రారంభం కావాలంటే అధికారుల విభజన తక్షణం చేయాలని తాను కోరగా, అప్పటికప్పుడు మోదీ ఆయన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
త్వరలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు
జూన్ 1వ తేదీన అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఏర్పాటయ్యిందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రారంభోత్సవ తేదీ ఇంకా కాలేదని, దానికి రావాలని తాను ప్రధాని మోదీని ఆహ్వానించానని కేసీఆర్ చెప్పారు. తేదీ ఖరారు చేసి చెబితే కచ్చితంగా వస్తానని ఆయన హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రారంభోత్సవ తేదీకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే ప్రకటనలు చేస్తానని మోదీ తెలిపారన్నారు. మరో 10-12 రోజుల్లో తాను తేదీ ఖరారు చేసుకుని ప్రధానిని ఆహ్వానించేందుకు ఢిల్లీ వస్తానన్నారు. సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
ఏపీకి సహకరించేందుకు సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు వందశాతం శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేసీఆర్ అన్నారు. ఆయన నాయకత్వంలో అక్కడి ప్రజలకు శుభం జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు భాష మాట్లాడేవారంతా సుహృద్భావాన్ని కొనసాగించాలని, తెలుగు స్ఫూర్తి కొనసాగాలని, ఉభయ రాష్ట్రాలూ మంచి పద్ధతిలో పరస్పరం సహకరించుకుని, సామరస్య వాతావరణంలో పరిష్కారాలు చేసుకుంటే మంచిదని అన్నారు. పొద్దున్న లేస్తే ఇరు రాష్ట్రాలకూ పరస్పర సహకారం కావాలని, అది అందించేందుకు, పుచ్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎంగా పనిచేసిన అనుభవమున్న చంద్రబాబు కూడా ఇంతే సుహృద్బావంతో ఉంటారని కేసీఆర్ ఆకాంక్షించారు.
ఏపీ భవన్ తెలంగాణదే!
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వంద శాతం నిజాం ఆస్తేనని, ఇందులో ప్రశ్నలకు తావే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ హౌస్ అని ఇంటర్నెట్‌లో వెతికినా దీని చరిత్ర మొత్తం వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆస్తి ఎక్కడ ఉన్నా చట్టంలో ఉన్న ప్రకారం పంపిణీ చేయాల్సిందేనన్నారు. అయితే, హైదరాబాద్‌లో ఉన్న నిజాం ఆస్తుల్ని, ఆంధ్రాలో గతంలో కట్టినవి, ప్రపంచ వ్యాప్తంగా నిజాం కట్టించిన అంచనాలకు అందని ఆస్తులు మక్కాలోను, అజ్మీర్‌లోను, సౌదీ అరేబియాలోను ఉన్నాయని వాటిని పంపిణీ చేయటం కుదరదన్నారు. చరిత్రను వక్రీకరించటం కుదరదని, ఎవరి ఆస్తులు వారు తీసుకోవాలే తప్ప ఇతరుల ఆస్తులు కావాలనటం విజ్ఞత కాదని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ భవన్‌లో 180 పోస్టుల వరకూ ఉండేవని, ఇప్పుడు మాత్రం 70-80 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని.. వీరిలో కొందరు ఆంధ్రావాళ్లను తెలంగాణకు, తెలంగాణ వాళ్లను ఆంధ్రాకు కేటాయించారని.. ఇదంతా కాకుండా ఆంధ్రావారిని ఆంధ్రాకు, తెలంగాణ వారిని తెలంగాణకు కేటాయించి, మిగతా వాళ్లకు ఆప్షన్లు ఇవ్వాలని.. అయినప్పటికీ పోస్టులు ఖాళీగా ఉంటాయని, వాటిని ఆయా రాష్ట్రాలే భర్తీ చేసుకుంటాయని తెలిపారు.
శబరి బ్లాక్‌కు కేసీఆర్!
ఇదిలా ఉండగా.. ఏపీ భవన్‌లోని గురజాడ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ పదినిమిషాల ముందే భవన్‌కు చేరుకున్నారు. దీంతో శబరి బ్లాక్‌కు వెళ్లి కొద్దిసేపు వేచి ఉన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఏపీ భవన్‌కు వచ్చిన కేసీఆర్‌కు అధికారులు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు. పోలీసుల నుంచి కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు.
పోలవరంపై ఏకాభిప్రాయం సాధించాలి
నేడు పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తాం

పోలవరం గురించి తాను ప్రధాని మోదీతో దాదాపు 7-8 నిమిషాలు మాట్లాడానని కేసీఆర్ చెప్పారు. ఎవరో తప్పుడు మార్గం చెప్పి తొందర పెట్టారని, తీసుకున్నది చాలా హడావుడి నిర్ణయం, అది సరిగా లేదని, అందుకే తాము ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించామని తాను చెప్పానన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన డ్యూటీ తాను చేయాలని, అది తప్పకుండా చేస్తానని చెప్పానని తెలిపారు. గోదావరి నుంచి ఆంధ్రా ప్రాంతం నీరు తీసుకునేందుకు తాను వ్యతిరేకం కాదని, అయితే ఇందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయని చెప్పారు. అలాంటప్పుడు అనవసరంగా నాలుగు రాష్ట్రాల్లోని 15 లక్షల మంది గిరిజనుల్ని ఎందుకు ముంపుకు గురిచేయాలి? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిసా రాష్ట్రాలకు చెందిన సమస్య ఇదని, ఇప్పటికే ఒడిసా సీఎం నవీన్ పట్నాయర్ పోలవరంపై తొందరపడొద్దని ప్రధానికి చెప్పారన్నారు. తాను కూడా అదే చెప్పానని, ముంపు అవసరం లేని వాటిని కూడా ఇందులో కలుపుతున్నారని, తద్వారా మరిన్ని ఇబ్బందులు వస్తాయని తాను పేర్కొన్నట్లు చెప్పారు.
నాలుగు రాష్ట్రాల్లోనూ మునిగిపోయేది గిరిజనులే .. ముంపు లక్ష్యం గిరిజనులే కాబట్టి, ముంపు సమంజసం కాదని.. నలుగురు ముఖ్యమంత్రులనూ పిలవాలని, కూర్చోబెట్టాల ని, సంధానకర్తగా వ్యవహరించి ఏకాభిప్రాయం సాధించి పోలవరంపై ముందుకెళ్లాలని సూచించానన్నారు. అంతే తప్ప తొందరపాటు పనికిరాదని వివరించానన్నారు. కాగా, పోలవరం ముంపు ఆర్డినెన్స్‌ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపె డుతున్నారని, దీనిపై తమ నిరసన కూడా తెలియజేస్తామని కూడా తాను ప్రధాని మోదీకి చెప్పానని కేసీఆర్ తెలిపారు. కాగా, తెలంగాణ ఏర్పాటు విషయంలో ఏకాభిప్రాయం వద్దని గతంలో డిమాండ్ చేసి.. పోలవరం విషయంలో మాత్రం నాలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించాలని కోరుతున్నందున ఏకాభిప్రాయం విషయంలో మీ వైఖరి మారిందా? అని కేసీఆర్‌ను ప్రశ్నించగా.. తన వైఖరి మారలేదని, మీకే అర్థం కాలేదని విలేకరులకు సమాధానం ఇచ్చారు. అందరితో చర్చించి అందరి ఆమోదం పొందాలనే (కన్‌సెన్సెస్) తాను కోరాను తప్ప ఏకాభిప్రాయం అని ఎన్నడూ చెప్పలేదన్నారు.

No comments:

Post a Comment