Wednesday 25 June 2014

22 వేల ఎకరాలు హాంఫట్

22 వేల ఎకరాలు హాంఫట్

Published at: 26-06-2014 08:05 AM
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా)
ఎకరం కోట్లలో పలికే బంగారంలాంటి భూమి. పదెకరాలో.. వందెకరాలో కాదు 22వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి కబ్జాదారుల పాలైంది. హైదరాబాద్ చుట్టు పక్కల రంగారెడ్డి జిల్లాలో విస్తరించి, కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకున్న ఈ భూములను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గురుకుల్ భూములపై చర్యలకు దిగిన సర్కార్ ఇతర ప్రాంతాల్లో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపైనా ఆరా మొదలు పెట్టింది. ఈమేరకు ప్రభుత్వ భూముల తాజా స్థితిపై సర్కార్ రంగారెడ్డిజిల్లా అధికారయంత్రాంగం నుంచి నివేదిక కోరింది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న భూముల వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. తాజా నివేదిక ప్రకారం రంగారెడ్డిజిల్లాలో 22,169 ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఇందులో వ్యవసాయయోగ్యమైన భూములు 17,939 ఎకరాలు ఉండగా వ్యవసాయేతర భూములు 4230 ఎకరాలు ఉన్నట్లు తేల్చారు. వ్యవసాయేతర భూముల్లో చాల వరకు నిర్మాణాలు జరిగిపోయాయి. వీటి విలు ఎంత లేదన్నా రూ.50వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇదిలా ఉంటే జిల్లాలో మొత్తం 5,35,679 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో 1,66,697 ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేశారు. ఈ అసైన్డ్ భూముల్లో కూడా ఎక్కువ శాతం భూములు చేతులు మారాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఇప్పటి వరకు 39,448 ఎకరాలు పంపిణీ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం 8070 ఎకరాలు కేటాయించారు. రోడ్లు విస్తరణ, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుతో పాటు ప్రజల సామూహిక ప్రయోజనాల కోసం 1,85,904 ఎకరాలు కేటాయించారు. ఇవన్నీపోను ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,08,454 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఇందులో వ్యవసాయ యోగ్యమైన భూమి 7876 ఎకరాలు ఖాళీగా ఉండగా 92,848 ఎకరాలు కొండలు, గుట్టలతో ఉన్న భూములున్నాయి. ఇవి వ్యవసాయానికి పనికిరావని తేల్చారు. అలాగే కోర్టు కేసులు, ఇతరత్ర సరిహద్దు వివాదాల్లో మరో 7730 ఎకరాలు ఉన్నాయి.
13 వేల ఎకరాలు వెనక్కి!
పరిశ్రమల స్థాపన కోసం గతంలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములు అనేక చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. ఇలాంటి వాటిని వెనక్కి తీసుకుంటామని ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఇలాంటి భూముల వివరాలను కూడా అధికారులు సేకరించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన 13,067 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. వివిధ సందర్భాల్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 39,443 ఎకరాల భూములను వివిధ సంస్థలకు కేటాయించగా ఇందులో 26352 ఎకరాలు మాత్రమే వినియోగంలో ఉన్నట్లు తేల్చారు. మిగతా 13067 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఇందులో 5750 ఎకరాల భూమిని వెనక్కి తీసుకునేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మరో 7317 ఎకరాల భూమికి సంబంధించి నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
తూప్రాన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి) : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని ఆటోమోటీవ్‌పార్కు భూముల్లో రైతులు దున్నకాలు చేస్తున్నారు. ఎంఎల్ఆర్ కార్ల కంపెనీ స్థాపనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ప్రభుత్వం.. మండలంలోని 750 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి 2007 మార్చి 30న అప్పగించింది. ఈ భూమిలో ఏపీఐఐసీ ఆటోమోటీవ్ పార్కును ఏర్పాటు చేయగా, ఏడేళ్లు గడిచినా కార్ల కంపెనీ జాడే లేదు. పరిహారమొక్కటే అందినప్పటికీ, ఉపాధి చూపలేదు. వచ్చిన కొద్ది కంపెనీల్లోనూ ఉపాధియే లేకుండా పోయింది. ఓపిక నశించిన రైతులు కంపెనీల ఏర్పాటు లేకుండా పడావుగా ఉన్న భూముల్లో దున్నకాలు చేస్తున్నారు. ప్రస్తుతం ముప్పిరెడ్డిపల్లి శివారులోని సుమారు 20 ఎకరాల్లో దున్నకాలు చేసిన రైతులు.. వర్షాలు కురిస్తే పూర్తిస్థాయిలో దున్నకాలు చేయనున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment