Tuesday 17 June 2014

ఆంధ్రాకు 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు

ఆంధ్రాకు 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు

Published at: 16-06-2014 04:30 AM
సీఎం చంద్రబాబు నిర్ణయం... విజయవాడ, విశాఖల్లో కొత్తవి
13
జిల్లాల్లోనూ దిగేందుకు రన్‌వేలు
4
వేల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా
అటవీ భూములను డీ నోటిఫై చేయించాలని సూచన
సాధ్యాసాధ్యాలపై నివేదికలు తయారు చేయాలని ఆదేశం
హైదరాబాద్, జూన్ 15: సీమాంధ్రలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో జరిగిన ఒక అధికారిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు టి.ఎస్. రావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కార్యదర్శి కృష్ణ కిశోర్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు అజయ్ ప్రకాశ్ సాహ్ని, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. వాటిలో విజయవాడ, విశాఖపట్నంలో కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించాలని.. తిరుపతిలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ విమానాలు దిగటానికి 9వేల మీటర్ల పొడవు రన్‌వే అవసరం అవుతుందని, ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి 4 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని ఈ సమావేశంలో తేల్చారు. భవిష్యత్‌లో భూసేకరణ మరీ కష్టమవుతుందని.. ఇప్పుడే అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన భూమిని సేకరించడం మంచిదని అధికారులు సూచించారు.

కృష్ణా జిల్లాలో నూజివీడు నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు సుమారు 30 వేల ఎకరాల అటవీ భూమి ఉందని, దానిని డీ నోటిఫై చేయించి ఆ భూములు అంతర్జాతీయ విమానాశ్రయానికి కేటాయిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా వచ్చింది. ఏవైనా జాతీయ అంతర్జాతీయ విద్యాసంస్థలు, రాదల్చుకున్నా వాటికి కూడా అక్కడే భూకేటాయింపు జరిగితే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేక రకాల అనుమతులు అవసరం ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకుని స్థల ఎంపిక చేయాలని, అలాగే వాటి నిర్మాణానికి సంబంధించి సాధ్యాసా«ధ్యాలపై నివేదికలు తయారు చేయించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. కేంద్ర విమానయాన మంత్రిగా టీడీపీ ఎంపీనే ఉన్నందువల్ల వీటికి సంబంధించిన నిర్ణయాలు, పరిశీలనలు త్వరగా జరిగేలా చూడాలని ఆయన చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు ఆంధ్ర్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు విమాన సౌకర్యాలు కల్పించాలని, ప్రతిజిల్లాలో విమానాలు దిగటానికి అనువైన రన్‌వేల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఏదైనా జిల్లాలో పాత రన్‌వేలు ఉండి ఉంటే వాటి సమాచారం తెప్పించాలని లేని పక్షంలో రన్ వేల నిర్మాణం ఎక్కడ చేపట్టాలి? దానికి భూలభ్యత ఏమిటి అనే సమాచారం సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

No comments:

Post a Comment