Monday 23 June 2014

రోజుకు 850 మంది!

రోజుకు 850 మంది!

Published at: 23-06-2014 04:38 AM
న్యూఢిల్లీ, జూన్ 22: నగరాల్లో జనాభా తగ్గుతోంది! శివారుల్లో జనాభా పెరుగుతోంది! ముంబై, కోల్‌కతా, ఢిల్లీల్లోని కొన్ని ప్రాంతాల్లో జనాభా తగ్గింది! హైదరాబాద్, చెన్నైల్లో జనాభా స్వల్పంగా పెరిగింది! 2001-2011 మధ్య జనాభా లెక్కలు వెల్లడించిన విశేషమిది! ఇటీవలే 2001 మరియు 2011 మధ్య జన గణనకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. దాని ప్రకారం.. ముంబై, కోల్‌కతా, ఢిల్లీలోని న్యూఢిల్లీ, మధ్య ఢిల్లీల్లో జనాభా తగ్గింది. 2001తో పోలిస్తే 2011 నాటికి ముంబై జనాభా ఎనిమిది శాతం తగ్గింది. అదే సమయంలో శివారుల్లో విపరీతంగా పెరిగింది. కోల్‌కతాలో రెండు శాతం తగ్గితే.. శివారుల్లో పది శాతానికి పైగా పెరిగింది. ఢిల్లీలో ఏకంగా 21 శాతం జనాభా తగ్గింది. కానీ, శివారుల్లో పాతిక శాతానికిపైగా పెరిగింది. ఇక బెంగళూరు నగర జనాభా 47 శాతం పెరిగితే.. శివారుల్లో 17 శాతం పెరిగింది. చెన్నై జనాభా కూడా ఇటు నగరంలోనూ శివారుల్లోనూ పెరిగింది. ముంబైలో జనాభా తగ్గితే పుణెలో 30 శాతం పెరిగింఇ. ఇక హైదరాబాద్ జనాభా ఏకంగా 87 శాతం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలోని జనాభా 77,49,334. అదే సమయంలో హైదరాబాద్ నగర జనాభా 68,09,970. అంతేనా.. దేశవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన నాలుగో నగరంగా హైదరాబాద్ రికార్డు సాధించింది. 2001 జనాభా లెక్కలతో పోలిస్తే 2011 నాటికి జనాభా 87 శాతం పెరిగింది. పదేళ్లలో నగరానికి కొత్తగా 31 లక్షల మంది జనాభా వచ్చి చేరారు. అంటే.. సరాసరిన నగరానికి రోజుకు సుమారు 850 మంది వచ్చినట్లు లెక్క! వీరంతా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లే. హైదరాబాద్ నగర జనాభాలో ఇలా వలస వచ్చిన ప్రజల జనాభా 24 శాతం ఉంటుందని అంచనా. నగరాల్లో జీవన వ్యయం మరీ భారీగా పెరిగిపోయిందని, దాంతో ఎక్కువమంది నగరం మధ్యలోకి వెళ్లడానికి ఇష్టపడడం లేదని, వారంతా శివారులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ముంబైకి చెందిన మైగ్రేషన్ అండ్ అర్బన్ స్టడీస్ అధిపతి ఆర్‌బీ భగత్ చెప్పారు.

No comments:

Post a Comment