Monday 23 June 2014

పీపీఏలు రద్దయితే తెలంగాణకు నష్టం తాత్కాలికమే

పీపీఏలు రద్దయితే తెలంగాణకు నష్టం తాత్కాలికమే

Published at: 23-06-2014 04:50 AM
దీర్ఘకాలంలో ఏపీకే అధిక నష్టం
ఆంధ్రజ్యోతితో విద్యుత్తు జేఏసీ నేత రఘు
హైదరాబాద్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): విద్యుత్ పీపీఏల ఒప్పందాలను ఏకపక్షంగా ఉపసంహరించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన సరికాదని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నేత కంచర్ల రఘు పేర్కొన్నారు. ఒప్పందాలు రద్దయితే జరిగే పరిణామాలపై రఘు 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధితో మాట్లాడారు. ఏ కారణాలతోనైనా విద్యుత్తు పీపీఏల రద్దయితే తెలంగాణకు తాత్కాలికంగా ఇబ్బందులు కలిగే మాట వాస్తవమేనన్నారు. అయితే దీర్ఘకాలంలో (రెండు, మూడేళ్ల తర్వాత) ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోతుందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల విద్యుదుత్పత్తి ఖర్చు తక్కువని, పీపీఏలు రద్దయితే తక్కువ ధరకు ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును ఆంధ్రప్రదేశ్‌తో పంచుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. ఖరీదైన విద్యుత్తు ప్రాజెక్టులు సీమాంధ్రకు గుదిబండలుగా మారుతాయన్నారు. 'ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది. ఈ సమయంలో రెండు సంవత్సరాల పాటు తెలంగాణ కొన్ని సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలతో విద్యుత్తు లైన్ల అనుసంధానం రెండేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆపై తెలంగాణకు సమస్యలు ఉండవు. తాత్కాలికంగానూ కొరతను అధిగమించే అవకాశాలున్నాయి' అని రఘు వివరించారు.
అన్నీ జనాభా ప్రాతిపదికనే పంచలేదు
విభజన చట్టంలో అన్ని పంపకాలూ జనాభా ప్రాతిపదికనే జరిగాయనడం తప్పు అన్నారు. రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్లు, ఉమ్మడి ఆస్తులు- అప్పులు మాత్రమే జనాభా ప్రాతిపదికన జరిగాయని, మిగతా అంశాల్లో భిన్న ప్రాతిపదికలను విభజన చట్టంలో పేర్కొన్నారన్నారు. ఉదాహరణకు నదీ జలాల విషయంలో జనాభా, నదీ పరీవాహక ప్రాంతం ఆధారంగా పంపకాలు జరగలేదన్నారు. అలా జరిగితే 69 శాతం నదీ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 36 శాతం వాటా మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. బొగ్గు కేటాయింపుల్లో తెలంగాణ ప్రాజెక్టులకు కొరత ఉన్నప్పటికీ, సింగరేణి బొగ్గును కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ఏటా 3.88 మిలియన్ టన్నుల సరఫరా కొనసాగుతుందని చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలా భిన్న ప్రాతిపదికలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారని చంద్రబాబునాయుడు పేర్కొనడమంటే వాస్తవాలను వక్రీకరించడమేనని విమర్శించారు. నదీ జలాలు, బొగ్గు విషయంలో గతంలోని ఒప్పందాలు కొనసాగించిన విధంగానే విద్యుత్తు విషయంలో కేంద్రం అదే ప్రాతిపదికను అనుసరించిందన్నారు.
ఒప్పందాలకు చట్టబద్ధత లేదనడం తప్పు
పీపీఏల రద్దుకు గల చట్టబద్ధతను ఒకసారి విశ్లేషించుకోవాల్సి అవసరం ఉందన్నారు. 'ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ) ఆమోదం లేనిదే ఏ ఒప్పందానికి కూడా చట్టబద్ధత ఉండదన్న మాట వాస్తవమే. అలాగే కమిషన్ ఆమోదం లేనిదే ఏ ఒప్పందం కూడా అమలులోకి రాకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2009, 2010లలో చేసిన ప్రతిపాదనల ఆధారంగానే ఇన్ని సంవత్సరాలుగా విద్యుత్తు కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. పీపీఏలపై కమిషన్ ఆమోదముద్ర వేయకున్నా, ఈ పీపీఏలనే ప్రాతిపదికగా కమిషన్‌తో సహా అన్ని పక్షాలూ ఆమోదించారు. వినియోగం ఆధారంగా విద్యుత్తు పంపకాలు ఉండాలని నిర్దేశిస్తూ గత ప్రభుత్వాలు అనేక ఉత్తర్వులను జారీ చేశాయి. అవి అమలు కూడా అయ్యాయి. కమిషన్ పర్యవేక్షణలో ఇన్ని సంవత్సరాలూ అమలైన ఒప్పందాలకు సహజంగానే చట్టబద్ధత వస్తుంది. అందుకే ఈ ఒప్పందాలకు చట్టబద్ధత లేదనడం కూడా తప్పు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ముందుకు వచ్చినప్పుడు ఈ సాంకేతిక అంశాన్ని లేవనెత్తినా ఎవరూ పట్టించుకోలేదు. సీమాంధ్ర నష్టపోతుందంటూ ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఈ విషయాన్ని అప్పుడు గాలికొదిలారు' అని ధ్వజమెత్తారు.
మేమూ దూకుడుగా స్పందిస్తే..
విద్యుత్తు పీపీఏలను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే తెలంగాణకు విద్యుత్తు సరఫరా ఆపేయాలన్న ప్రయత్నంతో తెలంగాణపై యుద్ధం ప్రకటించినట్లయింది. తెలంగాణ కూడా ఇదే విధంగా స్పందించాలని అనుకుంటే విభజన బిల్లులో తెలంగాణకు అనుకూలమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. అద్దాల మేడలో ఉన్న వారు ఇతరులపై రాళ్లు వేయడం సరి కాదని రఘు హితవు పలికారు. విభజనలో అనేక అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. ప్రతీ రాష్ట్రం తమ తమ ప్రయోజనాలను కాపాడుకోవాలనుకోవడం తప్పు కాదు. అయితే సున్నితమైన అంశాలను చర్చల ద్వారానే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. తెలుగు ప్రజలంతా ఒక్కటే అని మాట్లాడుతున్న వారికి ఇది మరింత అవసరమని రఘు పేర్కొన్నారు.

No comments:

Post a Comment