Wednesday 20 May 2015

అర్భకుడివి! నీవేం చేయగలవు? వైఎస్ జగన్‌పై టీడీపీ నేతల ముప్పేట దాడి

అర్భకుడివి! నీవేం చేయగలవు?
వైఎస్ జగన్‌పై టీడీపీ నేతల ముప్పేట దాడి

  • బాబును ఎదుర్కోవడం మీ నాన్న వల్లే కాలేదు : జగన్‌పై మంత్రి పల్లె ఫైర్‌
  • అది క్రిమినల్‌ భాష...జగన్‌ మాత్రమే మాట్లాడగలరు : ముద్దు వ్యాఖ్య
  • మతి తప్పినట్లు మాట్లాడుతున్న జగన్‌ : మంత్రి సుజాత
  • జగన్‌కు మతి భ్రమించింది: దేవినేని ఉమా
అనంతపురం/హైదరాబాద్‌/బుట్టాయిగూడెం/విజయవాడ మే 19 (ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి చంద్రబాబును ఎదుర్కోవడం రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలకే కాదు.. మీ నాన్నవైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్ల కూడా కాలేదు. నీవో అర్భకుడివి.. నీవో బచ్చావి ఏం చేయగలవు’ అని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. మం గళవారం అనంతపురంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతు సమస్యల గురించి మాట్లాడే నైతికవిలువలు, అర్హత, హక్కు జగన్‌కు లేదన్నారు. రాష్ర్టా న్ని రైతు ఆత్మహత్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత రాజశేఖర్‌రెడ్డికే దక్కిందన్న విషయాన్ని మరిచి పోవద్దన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన తమ నాయకుడు చంద్రబాబునాయుడును అడ్డదిడ్డంగా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. రాళ్లతో కొట్టేది తమ నేతను కాదని, పేద ప్రజల రక్తాన్ని జలగలాపీల్చి లక్షలాది కోట్ల అవినీతికి పాల్పడిన తమరికే ప్రజలు తగిన బుద్దిచెబుతారన్నారు. అధికారం కోసం అర్రులు చాసే నైజం నీదంటూ జగన్‌పై మండిపడ్డారు. నేను బాగుండాలి... ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదు, నేను సీఎం కావాలనే దుగ్ద తప్ప ప్రజలు కష్టాల గురించి ఆలోచించిన పాపాన జగన్‌ పోలేదన్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు తన కేసులు తప్ప రాష్ర్టానికి కేంద్రం ఇచ్చిన హామీల గురించి కేంద్ర పాలకులను అడిగిన దాఖలాలులేవన్నారు. అటు తెలంగాణ, ఇటు కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసుల్లో ఉచ్చుబిగిస్తారనే భయం జగన్‌లో ఉందని, ఇలాంటి వ్యక్తి ఇచ్చే భరోసాను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
 
 

‘ముఖ్యమంత్రి చంద్రబాబును రాళ్లతో కొట్టండి... చంపండని ప్రతిపక్ష నేత జగన్‌ తన జిల్లాల పర్యటనలో పిలుపులు ఇస్తున్నారు. ప్రభుత్వం చేసే తప్పు లు ఎత్తిచూపి ప్రజల తరపున మాట్లాడటం ప్రతిపక్షం విధి. అంతేగాని కొట్టండి... చంపండని హింసాత్మక పిలుపులు ఇవ్వడం కాదు. అది క్రిమినల్‌ భాష. దానిని జగన్‌ మాత్రమే మాట్లాడగలరు’ అని టీడీపీ అధికార ప్రతినిధి ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాల్లో ఎక్కడైనా స్ధానిక వివాదాలతో ఘర్షణలు జరిగినా, హత్యలు జరిగినా వాటిని ఏకంగా చంద్రబాబే చేయించారని జగన్‌ ఆరోపిస్తున్నారని, చంద్రబాబుకు అటువంటి సంస్కృతి ఏనాడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఇసుక సిండికేట్లు, ఎర్ర చందనం స్మగ్లర్లు, భూ కబ్జాదారులను చంద్రబాబు ప్రభుత్వం వెంటపడి తరుముతోందని, వాళ్లతో రాజీపడ్డారని ఒక్క మాట అనిపించుకోకుండా ఏడాదిపాటు పాలించారని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారని జగన్‌ చేస్తున్న విమర్శల్లో నిజం లేదని, చెప్పినవి చేయడంతోపాటు చెప్పనవి కూడా చేస్తున్న ఘనత ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ‘33 లక్షల కుటుంబాలకు రుణ మాఫీ పూర్తిగా అమలైంది. కొన్ని సాంకేతిక కారణాలతో కొందరికి కాలేదు. వారికి కూడా చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. డ్వాక్రా సంఘాలకు ఉన్న రుణాలపై వడ్డీని చెల్లించడంతోపాటు మూడు విడతలుగా ప్రతి సభ్యురాలికి రూ. పది వేలు చొప్పున ఇస్తున్నాం. పింఛన్లు రూ. రెండు వందల నుంచి రూ. వెయ్యికి పెంచాం. రాష్ట్రం విడిపోయిన రోజుకు రూ. 17 వేల కోట్ల ఆర్ధిక లోటు ఉంది. సోనియా అడ్డగోలు విభజన చేస్తే తన బెయిలు కోసం జగన్‌ ఆమెకు మద్దతు ఇచ్చి విభజన చేయించారు. ఇంత లోటు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం మేర జీతాలు పెంచారు. వారి పదవీ విరమణ వయసు అరవైకి పెంచారు. చంద్రన్న కానుక పేరుతో పేదలకు ఉచితంగా పండగ సరుకులు ఇచ్చారు. ఇవి చేస్తామని చెప్పలేదు. అయినా చేశారు’ అని ఆయన వివరించారు. కొత్తగా నిర్మించబోయేది ప్రభు త్వ రాజధానా లేక ప్రైవేటు రాజధానా అని వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్నల్లో అర్ధం లేదని ముద్దు అభిప్రాయపడ్డారు. వైఎస్‌ ప్రాజెక్టులు నిర్మిస్తే చంద్రబాబు కొళాయి తిప్పుతున్నారన్న జగన్‌ వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు.
 
‘పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. దీనికి నిదర్శనం ప్రతిపక్ష నేత జగన్‌ అనుసరిస్తున్న వ్యవహార శైలి. అధికారం దక్కకపోవడంతో ఆయన మతిస్థిమితం కోల్పోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని భూ గర్భ గనులు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కేఆర్‌ పురం ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకవర్గసమావేశానికి హాజరైన ఆమె విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు మతిమరుపు రోగం వచ్చిందని జగన్‌ అనంతపురం జిల్లాలో రైతుభరోసా యాత్రలో అనడాన్ని తీవ్రంగాఖండిస్తున్నామన్నారు.
 
‘జగన్‌కు మతి భ్రమించింది. అందుకే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు. జైలు భయం, ఈడీ కేసులు వెంటాడుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని దూషిస్తూ రాజద్రోహ నేరానికి పాల్పడుతున్నాడు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుంటే చూడలేక బోడి దీక్షలు చేస్తున్నాడ’ని మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడారు. జగన్‌ అసాధ్యమన్న రుణమాఫీని సుసాధ్యంచేసి చూపి రూ. 8వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసి రుణవిమోచన చేశారన్నారు. 24 గంటలు విద్యుత్తునిస్తున్నామన్నారు. ఉద్యోగస్థుల రిటైర్‌మెంట్‌ వయస్సును 58 నుంచి 60కి, ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను కల్పించామని చెప్పారు. అటువంటి ’చంద్రబాబును సెక్యూరిటీ లేకుంటే కొడతామంటున్నారు. మీకంత దమ్ముందా అని మండిపడ్డారు.

No comments:

Post a Comment