Thursday 21 May 2015

భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి.. ఏడుగురిని చంపేసింది..!

భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి.. ఏడుగురిని చంపేసింది..!
ఇంటికి నిప్పంటించి పారిపోయిన గ‌ృహిణి.. మదురై పోలీసుల అదుపులో నిందితురాలు
చెన్నై, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికే.. విభేదాలు రావటంతో.. విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భర్త వేరే పెళ్లికి సిద్ధమవుతుండటాన్ని జీర్ణించుకోలేని భార్య.. ఆయన కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టింది. తమిళనాడులోని మదురై జిల్లా.. కుమారపురానికి చెందిన కన్నన్‌(28), పాండేశ్వరి(25) కు మూడేన్నరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివిధ కారణాలతో.. వీరు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. కన్నన్‌ చెన్నైలో పనిచేస్తుండగా.. పాండేశ్వరి స్థానికంగానే ఉంటోంది. వీరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు గ్రామపెద్దలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంగళవారం కూడా రెండు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు. అయినా ఫలితం కనిపించటం లేదు. భర్త తన అక్క కూతురును పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పాండేశ్వరికి తెలిసింది. దీంతో బుధవారం వేకువజామున.. 2 గంటల ప్రాంతంలో కన్నన్‌ కుటుంబం నివశిస్తున్న ఇంటికెళ్లి బయటనుంచి గడియపెట్టింది. ఇంటిపైన, లోపల.. పెట్రోల్‌, కిరోసిన్‌ గుమ్మరించి నిప్పంటించి పారిపోయింది. ఈ ఘటనలో.. కన్నన్‌, అతని తండ్రి వేలు(60), తల్లి పేచియమ్మాళ్‌(50), అక్క సుగంధి(35), ఆమె కుమార్తె సంగీత(17), కుమారులు వినీత్‌ (14), సంగీత్‌(12) సజీవదహనమయ్యారు. పాండేశ్వరిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

No comments:

Post a Comment