Friday 29 May 2015

వడదెబ్బ మృతులకు రాష్ట్ర విపత్తు నిధి

వడదెబ్బ మృతులకు రాష్ట్ర విపత్తు నిధి
  • 10 శాతం మేర వాడుకునేలా నిబంధనల సవరణ
  •  కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 
న్యూఢిల్లీ, మే 29 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై మరణిస్తున్న వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్‌)ని వాడుకోవచ్చునని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ తెలిపారు. ఎన్డీయే ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వడదెబ్బ, పిడుగుపాటు.. ఇలా వివిధ రాషా్ట్రల్లో ప్రాంతీయ విపత్తులుగా పరిగణించే వాటికి కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి సహాయం అందించేలా నిబంధనల్ని సడలిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రాంతీయ విపత్తులకు పరిహారంగా ఎస్‌డీఆర్‌ఎ్‌ఫలోని 10 శాతం నిధుల్ని రాషా్ట్రలు వాడుకోవచ్చునని వివరించారు. ప్రాంతీయ విపత్తుల్లో వెతుకులాట, సహాయక పరికరాలను కొనుగోలు చేసుకునేందుకు కూడా మరో 10 శాతం నిధుల్ని వినియోగించుకోవచ్చునని తెలిపారు. అలాగే, మరో 5 శాతం నిధుల్ని సామర్థ్య పెంపునకు వాడుకోవచ్చునని చెప్పారు. కేంద్రం నోటిఫై చేసిన విపత్తుల్లో లేని వాటిని, ఆయా రాషా్ట్రల్లో తీవ్ర ప్రభావం చూపిన విపత్తు ల్ని ప్రాంతీయ విపత్తులుగా పరిగణించొచ్చునని, ఏటా ఈ నిబంధనల్ని తాము సవరిస్తామని తెలిపారు. అదేవిధంగా వివిధ విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫల ద్వారా ఇచ్చే పరిహారాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచామని చెప్పా రు. ఇంత వరకూ కనీసం 50శాతం పంట నష్టం జరిగితేనే రైతులకు పరిహారం లభించేదని, ఇకపై 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ నష్టం జరిగినప్పుడు కూడా పరిహారం అందిస్తామని తెలిపారు. కేంద్రం నోటిఫై చేసిన 12 విపత్తులతో పాటు పిడుగుపాటు, వడదెబ్బ వంటి ప్రాంతీయ విపత్తుల కారణంగా నష్టపోయిన పంటలకు కూడా ఈ పరిహారాన్ని ఇస్తామన్నారు.

కొనసాగుతున్న గాడ్పులు!

తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ప్రత్యేకించి.. మధ్య భారతంలో పలు రాష్ట్రాల్లో తీవ్రవడగాడ్పుల ప్రభావం తెలంగాణాపై పడింది. ఛత్తీస్ గడ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ద్రోణి కొనసాగుతోంది. దీంతో విదర్భ, ఛత్తీస్ గడ్ , మహారాష్ట్రతోపాటు తెలంగాణ వరకూ వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీచాయి. దీనివల్ల తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు, అక్కడక్కడా తీవ్ర వడగాడ్పులు వీచాయి. శుక్రవారం రామగుండంలో 47, నిజామాబాద్‌లో 45, హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణాపైకి వీచిన గాడ్పులు రాయలసీమలో కొన్ని ప్రాంతాలకూ విస్తరించడంతో.. కర్నూలులో 44 డిగ్రీలు నమోదైంది.

No comments:

Post a Comment