Monday 7 October 2013

హస్తినాలో చంద్రబాబు దీక్ష

హస్తినాలో చంద్రబాబు దీక్ష 

కాంగ్రెస్ కళ్లు తెరిపిస్తా .. సీమాంద్రులకు న్యాయం జరిపిస్తా!: చంద్రబాబు

Published at: 08-10-2013 06:21 AM
 1  1  0 
 
 

చంద్రబాబు ప్రతిన
ఏపీ భవన్లో నిరాహారా దీక్షకు శ్రీకారం
ఓట్లు, సీట్ల కోసం కాగ్రెస్ అనైతిక రాజకీయం
రాష్ట్ర విభజన వ్యవహారం రహస్యమా? ఆపార్టీ సొంతమా ?
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరిపించి, సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిపిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రతినబూనారు. సమాజాన్ని, ప్రజలను పణంగా పెట్టి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తనది పవిత్ర యుద్ధమని, నిజాయితీతో ప్రజల కోసమే తాను ఈ యుద్ధం చేస్తున్నానని చెప్పారు. ఒక ప్రాంతానికి న్యాయం చేసేటప్పుడు మరో ప్రాంతానికి అన్యాయం చేయరాదని, సీమాంధ్రకు న్యాయం చేయాలని, సీమాం«ద్రుల సమస్యలు వినాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్లో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ వెళ్లడానికి ముందు హైదరాబాద్‌లో సోమవారం ఉదయం ఆయన ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు. దివంగత నేత ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. తర్వాత ట్యాంక్ బండ్‌పై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాను ఉదయం నుంచే దీక్షలో ఉన్నానని, తనది ధర్మ పోరాటమని, కేంద్రం న్యాయం చేసేంత వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. అనంతరం ఢిల్లీ వచ్చిన బాబు నేరుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఏపీ భవన్‌కు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఏపీ భవన్‌లోని బహిరంగ సమావేశ వేదికపై కూర్చుని దీక్షను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు దీక్షకు జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ మద్దతు ప్రకటించారు. దీక్షా శిబిరానికి వచ్చి ఆయన్ను పరామర్శించారు.
చంద్రబాబుకు, సీమాంధ్ర ప్రజలకు సానుభూతిని తెలుపుతున్నానని, పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "గత 70 రోజులుగా సీమాంధ్ర రగులుతోంది. రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు సమస్యను మేం కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. పార్లమెంటులో ప్రస్తావించాం. నేను స్వయంగా ఢిల్లీ వచ్చి రాష్ట్రపతిని, జాతీయ పార్టీల నాయకులను కలిశాను. అయినా కేంద్రం స్పందించలేదు. ఇరు ప్రాంతాల జేఏసీలను ఢిల్లీకి పిలిపించి చర్చించలేదు. కాంగ్రెస్ పూర్తిగా రాజకీయాలు చేస్తోంది. రాజకీయాల్లో సరికొత్త అంకానికి తెరలేపింది. సమస్యలకు పరిష్కారాలను కనుగొనటం పోయి మరిన్ని సమస్యలను సృష్టిస్తోంది. ఇరు వర్గాలను సమన్వయ పర్చాల్సింది పోయి అనైతికంగా వ్యవహరించింది. సీమాంధ్రలోని సామాన్యులు ప్రభుత్వంపైన, రాజకీయ పార్టీలపైన విశ్వాసం కోల్పోయారు. అక్కడ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి'' అని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితికి అంతా బాధ్యులేనన్నారు.
రాష్ట్ర విభజనతో రాజకీయ లబ్ధి పొందాలని భావించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చే సానుకూల ఓట్లను టీఆర్ఎస్‌ను కలుపుకుని సొంతం చేసుకోవాలని, సీమాంధ్రలో వచ్చే వ్యతిరేక ఓట్లను జగన్‌కు పడేలా చేసి ఎన్నికల తర్వాత వైసీపీని కలుపుకోవాలని కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన వేదికపై నుంచే టీఆర్ఎస్‌ను విలీనం చేసుకుంటామని దిగ్విజయ్ ప్రకటించగా.. జగన్‌తో పొత్తు పెట్టుకుంటామని దిగ్విజయ్, పీసీ చాకో, వీరప్ప మొయిలీ బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. సీమాంధ్రలో జగన్ పార్టీకి ఓట్లు పెరిగేలా ప్రచారం చేసుకుని, సీట్లు గెలుపొందిన తర్వాత కాంగ్రెస్‌లో కలపాలన్నదే వారి మధ్య జరిగిన ఒప్పందమని చెప్పారు. సమాజాన్ని, ప్రజలను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సమస్యల్ని పరిష్కరించేందుకు పార్టీలన్నీ ఐక్యంగా పనిచేయాల్సి ఉందని, కానీ, సొంత ప్రయోజనాల కోసం, ఎక్కువ సీట్లు, ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ పని చేస్తోందని విమర్శించారు. ఇందుకు ఎవరినైనా పణంగా పెట్టేందుకు వెనుకాడటం లేదని విమర్శించారు.
వాస్తవాలు పగ తీర్చుకుంటాయి
ఒక గ్రామంలో ఒక కుటుంబ విభజన సమస్య వస్తే గ్రామ పెద్దలు అందరినీ పిలిచి, అందరి సమక్షంలో ఇరు వర్గాలతోనూ మాట్లాడి సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తారని, కానీ కాంగ్రెస్ మాత్రం ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించిందని చంద్రబాబు విమర్శించారు. పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు, ప్రజలకు న్యాయం చేసేందుకు తామున్నామన్న హామీ ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏడాదిపాటు ఇరు ప్రాంతాల నాయకులతో మాట్లాడి పరిస్థితుల్ని చక్కదిద్దారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఇరు ప్రాంతాల నాయకులతోనూ చర్చించి, పెద్దమనుషుల ఒప్పందం కుదిర్చి పరిస్థితులు చక్కదిద్దారు. 1972లో జై ఆంధ్రా ఉద్యమం జరిగినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్రానికి వెళ్లి ప్రజలను ఓదార్చి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రధానమంత్రి కానీ ఇప్పుడు ఎందుకు ఆ విధంగా స్పందించలేకపోతున్నారు!? రాష్ట్ర విభజన ఏమైనా రహస్య విషయమా? ఇదేదో జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అయినట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన విషయం అయినట్లు హోం మంత్రి షిండే తెలంగాణ నోట్ వ్యవహారాన్ని చివరి నిమిషం వరకూ రహస్యంగా ఎందుకు ఉంచారు!? తెలంగాణ అంశం కేబినెట్ అజెండాలో లేదని చెప్పి, చివరి నిమిషంలో ఎందుకు ఆమోదం పొందారు?'' అని నిలదీశారు. శ్రీకృష్ణ కమిటీలోని ఐదో సిఫార్సును కేంద్రం అమలు చేస్తోందని, అయితే దాని అమలుకు ఏం చేయాలో కూడా కమిటీ సూచించిందని తెలిపారు. "అసలైన విజయం అంటే అంతా సమానంగా విజయం సాధించటం. ఎవరికీ ఓటమి లేకపోవటం. ఇప్పుడు కూడా అలాంటి విజయమే కావాలి. లేదంటే అది నాశనానికే దారితీస్తుంది'' అని ఐరాసలో నెహ్రూ చెప్పారంటూ శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా పేర్కొంది. 'మూర్ఖంగా వాస్తవాలను మర్చిపోతే.. తర్వాత అవి పగ తీర్చుకుంటాయి' అని పటేల్ చెప్పిన మాటల్ని కూడా కమిటీ ప్రస్తావించింది'' అని వివరించారు.
నన్ను దొంగదెబ్బ తీయాలనే..
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని దొంగదెబ్బ తీయాలని కాంగ్రెస్ భావిస్తోందని, పంచాయితీ ఎన్నికల్లో గెలుపొందిన తమను రాజకీయంగా ఎదుర్కొనలేకే రాష్ట్రాన్ని విభజించిందని విమర్శించారు. గతంలో పంజాబ్, జమ్మూ కశ్మీర్, అసోంల్లోనూ కాంగ్రెస్ ఇదే తరహా రాజకీయాలు చేసిందని, అందుకు తగిన మూల్యాన్ని కూడా చెల్లించిందని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు తనను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలపై దెబ్బకొట్టిందని విమర్శించారు. సమస్య ఢిల్లీ నుంచే ప్రారంభమైందని, దానిని పరిష్కరించాల్సింది కూడా ఢిల్లీయే కాబట్టే ఢిల్లీలోనే నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. తన స్థాయి నాయకుడు ఢిల్లీలో దీక్ష చేసిన ఘటన ఇటీవల ఎన్నడూ జరగలేదని, కాంగ్రెస్ రాజకీయ క్రీడను దేశానికి చాటిచెప్పాలనే దీక్ష చేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ నీతిమాలిన, పద్ధతి లేని రాజకీయం చేస్తోందని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉన్నప్పుడే ఎందుకు రాష్ట్రాన్ని విభజిస్తోందని, కేవలం రాజకీయాల కోసం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా సరిగా చేయకుండా సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు. ఎన్నికల తర్వాత మరొక పార్టీ వస్తే ఈ ప్రక్రియ ఏమవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ కనక తాను చేయలేనని చేతులు ఎత్తేస్తే సంవత్సరంలోగా సమస్యను తాను పరిష్కరిస్తానని సవాల్ విసిరారు.
ఆంధ్రా భవనే ఎందుకంటే..
చంద్రబాబు తన దీక్షను జంతర్‌మంతర్‌లో చేపట్టాలని తొలుత భావించారు. కానీ, అన్నా హజారే దీక్ష తర్వాత జంతర్‌మంతర్‌లో ఒక్క రోజుకు మించి ఎక్కువ రోజులు దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వటం లేదు. పైగా అదేరోజు సాయంత్రానికల్లా దీక్షను విరమించాలని ఆదేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ భవన్‌ను ఎంచుకోవటమే ఉత్తమమని పార్టీ వర్గాలు భావించాయి. కేంద్రంలో నాలుగు కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించిందని, అప్పుడు కీలక సమావేశాలన్నీ ఏపీ భవన్ కేంద్రంగానే జరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు.
- See more at: http://www.andhrajyothy.com/node/8537#sthash.tXcCdcQy.dpuf
Published at: 07-10-2013 15:48 PM

 2  2  0 

 



న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ అనైతికంగా వ్యవహరిస్తోందని, ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో ఏపీ భవన్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన అనంతరం నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం 8-30 గంటల నుంచి దీక్షలో ఉన్నానని తెలిపారు. ఢిల్లీ నుంచే సమస్య వచ్చింది కాబట్టి, పరిష్కారం కూడా ఇక్కడి నుంచే రావాలని, అందుకే ఇక్కడే దీక్ష చేయదలిచానని తెలిపారు.
సీమాంధ్రలో 70 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా, కేంద్రం ఇంతవరకు స్పందించలేదని, పైగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. కళ్లు మూసుకున్న కాంగ్రెస్ ఇకనైనా కళ్లు తెరచి సీమాంధ్రకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య వచ్చినప్పుడు అందరితో చర్చించి పరిష్కరించలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారం పోకుండా స్వార్థం కోసం సొంత నిర్ణయం తీసుకుని ఈరోజున ఆ పార్టీని భూస్థాపితం చేసే పరిస్థితి తీసుకువచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారించిన తీరువల్ల రాజకీయ పార్టీల, ప్రజాప్రతినిధులపై ప్రజలు నమ్మకం కోల్పోయారని  చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని రాష్ట్రాన్ని కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగా చూస్తుందన్నారు. సీమాంధ్రలో పరిస్థితులు రోజు రోజుకూ దిగజారుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ సమస్యకు పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేస్తోందన్నారు.
 ఓట్లు, సీట్ల కోసం ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని  చంద్రబాబు అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నారు.  చిన్న ఊరులో వచ్చిన సమస్య పరిష్కారానికి సైతం నియమ, నిబంధలను పాటిస్తారని, ఇరుప్రాంతాల జేఏసీ నేతలను పిలిచి చర్చలు జరపాలని తాము చెప్పామన్నారు. సొంత పార్టీ నేతలను బలిపెట్టి రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం రోజే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్లో విలీనం అవుతుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. అంతకు ముందు చంద్రబాబు రాజ్ఘాట్లో గాంధీజీకి నివాళులు అర్పించారు.
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏడాది పాటు చర్చలు జరిగాయని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సందర్శించారని, ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్ పట్టించుకోవడంలేదని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన రహస్య వ్యవహారం కాదుకదా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌ను విలీనం చేసుకుంటాం, వైసీపీతో పొత్తు పెట్టుకుంటామన్న మాటలు దేనికి సంకేతమని బాబు ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలను బలిపెట్టి రెండు ప్రాంతాల్లో ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ చూస్తోందని, ఢిల్లీ పెద్దలు రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
కేంద్రంలో మూడు కాంగ్రెసేతర ప్రభుత్వాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందని చంద్రబాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆడుతున్న పొలిటికల్ గేమ్‌ను ఎండగట్టేందుకే దీక్ష చేస్తున్నానని, న్యాయం, థర్మం కోసం ఇక్కడకు వచ్చానని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలు తనకు సమానమేనని అన్నారు. తాను చేస్తున్న దీక్షకు అందరూ సహకరించాలని చంద్రబాబు కోరారు. తెలుగు ప్రజలతో ఆడుకునే హక్కు కాంగ్రెస్‌కు, కేంద్రానికి లేదని ఆయన అన్నారు
- See more at: http://www.andhrajyothy.com/node/8265#sthash.sYg92vnJ.dpuf

No comments:

Post a Comment