Monday 28 October 2013

వారసత్వ రాజకీయాలు వదిలేస్తే.... రాకుమారుడనను

వారసత్వ రాజకీయాలు వదిలేస్తే.... రాకుమారుడనను

Published at: 28-10-2013 06:41 AM
 New  0  0 
 
 

అమ్మాకొడుకులే కాంగ్రెస్ సారథులు
వాళ్లవి కుటుంబ ప్రాధాన్య రాజకీయాలు
నితీశ్ కపటి.. వంచకుడు
అలాంటి వాడ్ని ఏమి చేసినా పాపం లేదు
పాట్నా గాంధీ మైదానంలో చెలరేగిన మోదీ
పాట్నా, అక్టోబర్ 27: కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్య రాజకీయాలను వదిలేస్తే తాను రాహుల్ గాంధీని రాకుమారుడు (షెహజాదా) అని సంబోధించడం మానివేస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల నిబంధనావళి కారణంగా ఆగుతున్నామని, లేదంటే రాహుల్‌ని ఎద్దేవా చేస్తున్న మోదీ నోరు రెండు నిమిషాల్లో మూయించేవాళ్లమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో.. మోదీ దీటుగా స్పందించారు. కుటుంబ రాజకీయాలకు తెర పడనంతకాలమూ పదే పదే అదే మాట అని తీరతానని తేల్చి చెప్పారు. 'మొదట కుటుంబం' అనే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నదని దుయ్యబట్టారు. ఆ పార్టీలో నంబర్ - 1 సోనియా అయితే, నంబర్-2 రాహుల్ అని ఎద్దేవా చేశారు. వంశపారంపర్య రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలే దేశ ప్రజాస్వామ్యానికి శత్రువులంటూ.. కాంగ్రెస్ పార్టీతో పాటు బద్ధ ప్రత్యర్థిగా మారిన నిన్నటి స్నేహితుడు నితీశ్‌కుమార్‌నూ తూర్పారబట్టారు. బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానం వేదికగా నిప్పులు చెరిగారు. జేడీయూతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపినంత కాలం, ముఖ్యంగా గత మూడేళ్లలో ఒక్కసారి కూడా మోదీ బీహార్‌కు రాలేదు. ముఖ్యంగా నితీశ్ అభ్యంతరాలే దీనికి కారణం. నితీశ్‌తో బంధం పటాపంచలైన దరిమిలా రాష్ట్ర బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ఆదివారం 'హూంకార్ సదస్సు'లో మోదీ పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ, నితీశ్‌లే లక్ష్యంగా మోదీ చెలరేగిపోయారు.
" ఆయన (నితీశ్) నిన్న జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియాలకు, ఇప్పుడు బీజేపీకీ వెన్నుపోటు పొడిచారు. బీహార్ ప్రజలను వంచించారు'' అని మండిపడ్డారు. కపట రాజకీయ నేతగా నితీశ్‌ను ఆయన వర్ణించారు. "ప్రధానమంత్రి ఏడాదికి రెండుసార్లు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విందు ఇస్తుంటారు. అలాంటి ఒక విందు సమయంలో నేను, నితీశ్ ఒక దగ్గరే కూర్చున్నాం. అందరం తింటున్నా నితీశ్ ముద్ద ముట్టలేదు. నేను మొదట కొంత కలవరపడ్డాను. ఆ తరువాత కారణం తెలిసిపోయింది. ' ఇక్కడ కెమేరాలు లేవు. నిరభ్యంతరంగా మీరు భోజనం చేయొచ్చు' అని నితీశ్‌కు చెప్పాను. ఇలాంటి వంచన నేతలను సహించరాదు'' అని తూర్పారబట్టారు. హిందూ-ముస్లింలు పరస్పర ఘర్షణలు వీడి, దారిద్య్రానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. భోజ్‌పూరీ,మైథేలి భాషల్లో మోదీ తన ప్రసంగం ఆరంభించారు. ప్రసంగం ఆసాంతం బీహార్ చరిత్రను, ప్రజల సంప్రదాయాలను కొనియాడారు. బీహారీ యాదవులకు, గుజరాత్‌లోని ద్వారకతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.
ఇంకా ఆయన ఏమి అన్నారంటే..
- కొద్ది మందిని (నితీశ్)ని మినహాయిస్తే బీహారీలు అవకాశవాదులు కానేకాదు. దేశానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బీహార్ వైపు చూస్తుంది. మా పార్టీ సిద్ధాంతాలను బీహారీలు గ్రహించాలని కోరుతున్నాను. బీహార్ ముఖ్యమంత్రి మా రాష్ట్రం వస్తే గొప్పగా ఆదరిస్తాం. అతిథులను గౌరవించే సంస్కృతి నాది.
- బీహార్‌లో రెండు పర్యాయాలు జేడీయూకి వచ్చినన్ని సీట్లే మా పార్టీకీ వచ్చాయి. ముఖ్యమంత్రి పదవిని తీసుకునే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని మా భాగస్వాములకే వదిలేశాం. జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఏమైనా మేలు జరిగినట్టయితే.. ప్రభుత్వంలోని మా పార్టీ మంత్రుల ఘనత అది.
- నన్ను బీహార్‌కు రానీయకపోయినా బాధపడలేదు. దాన్నో అంశంగా మార్చవద్దు అని ఇక్కడి మా పార్టీ నేతలకు చెప్పేవాడిని. బీహార్‌కు చెందిన వీర జవాన్లు పాక్ చేతుల్లో అమరులయ్యారు. కానీ, మన మంత్రిగారు.. మరింతమంది సైన్యంలో చేరి, అమరత్వాన్ని పొందాలని సెలవిస్తున్నారు. ఈ అవమానాన్ని సహించగలరా?
- గతంలో నేను రైళ్లలో టీలు అమ్మేవాడిని. భారతదేశంలోని రైళ్ల పరిస్థితి రైల్వే మంత్రి కన్నా నాకే బాగా తెలుసు.
- ఇంకా ఎంత 200 రోజులు. మీరు చూపిస్తున్న ప్రేమకు వడ్డీ కలిపి మరీ తిరిగి చెల్లించుకుంటాను.
- 'ముందు దేశం' అనేది నా మతం. అభివృద్ధి నా మంత్రం. చాణక్యుడు నాకు ఆదర్శం.
- ముస్లింల గురించి మాట్లాడేవారికి నేను చెప్పేదల్లా..అభివృద్ధే అన్ని సమస్యలకూ పరిష్కారం అని. గుజరాత్ ముస్లింలతో పోల్చితే బీహారీ ముస్లింలు బాగా వెనకబడ్డారు. హిందూ, ముస్లింలు కలిసికట్టుగా దేశాభివృద్ధికి పాటుపడాల్సిన సమయం ఆసన్నమైంది.
మౌన ప్రధానిని ప్రశ్నించేదెలా ?
బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో అవసరమైతే సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. " మన ప్రధాని అసలు మాట్లాడనే లేరు. అలాంటప్పుడు ఆయనను సీబీఐ ఎలా ప్రశ్నించాలి?'' అని ప్రశ్నించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/15292#sthash.S9QA5517.dpuf

No comments:

Post a Comment