Sunday 6 October 2013

మోదీకి జగన్ మద్దతు

మోదీకి జగన్ మద్దతు

Published at: 06-10-2013 06:43 AM
 New  0  0 
 
 

బీజేపీని లౌకిక పార్టీగా మార్చండి
మూడుసార్లు గెలిస్తే మంచి పాలకుడే
బీజేపీ ప్రధాని అభ్యర్థిపై ప్రశంసల జల్లు
నీ కొడుకు కోసం మమ్మల్ని బలి చేస్తావా?
అసెంబ్లీ ఏకాభిప్రాయం లేకుండా విభజన దారుణం
సోనియాను నిలదీసిన జగన్
విభజనపై సుప్రీంలో కేసు వేస్తామని వెల్లడి
చంద్రబాబు లేఖ ఇస్తే ఆయన దీక్షకు మద్దతు ఇస్తామని స్పష్టీకరణ
లోటస్‌పౌండ్‌లో ఆమరణ దీక్ష ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 5 : బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీని మార్చాలని, దానిని లౌకికవాద పార్టీగా తీర్చిదిద్దాలని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ద్వారా తాను మంచి పరిపాలకుడిని అని ఆయన నిరూపించుకున్నారని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా లోటస్‌పాండ్‌లోని తన నివాస ప్రాంగణంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ఆయన నిరవధిక నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఆయనతోపాటు ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, జూపూడి ప్రభాకర్‌రావు, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆంగ్ల, తెలుగు మీడియాతో జగన్ మాట్లాడారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు.
"ఒక రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రంలో మూడుసార్లు వరుసగా విజయం సాధించాడనుకోండి. అతడు మంచివాడని అర్థం కాదా? బీజేపీని లౌకికవాద పార్టీగా చేయాలని మోదీని కోరుతున్నాను. మోడీ కనక బీజేపీ వైఖరిని మారిస్తే.. దానిని లౌకికవాద పార్టీగా చేస్తే.. మరింతమంది దానికి మద్దతు ఇస్తారు'' అని వ్యాఖ్యానించారు. తద్వారా, బీజేపీ లౌకికవాద పార్టీ అయితే వైసీపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. "మాకు ముజఫర్‌నగర్లు వద్దు. మాకు మొహబ్బత్ (ప్రేమ) నగర్లు కావాలి'' అని ఆకాంక్షించారు. "నీ కొడుకును ప్రధానిని చేయడం కోసం తెలుగు బిడ్డల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం దారుణం. రాహుల్ సహా పార్లమెంటులోని పార్టీల నేతలు ఎవరూ దీనిని అంగీకరించవద్దు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు కేవలం ఓట్ల కోసం రాష్ట్రాన్ని విభజించడం దారుణం. అలా జరిగితే భవిష్యత్తులో కేవలం ఓట్ల కోసమే రాష్ట్రాలను ముక్కలు చేసేస్తారు'' అని జగన్ భయాందోళనలు వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి వద్ద ఉన్న ఆర్డినెన్స్‌నే వెనక్కి తీసుకున్న యూపీఏకి కేబినెట్ నోట్‌ను ఉపసంహరించుకోవడం పెద్ద సమస్య కాదన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న సంప్రదాయాన్ని కాంగ్రెస్ వదిలేసిందని, నిరంకుశంగా, ఏకపక్షంగా విభజిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానాలు చేసిన రాష్ట్రాలను పట్టించుకోకుండా కేవలం ఆంధ్రప్రదేశ్‌నే విభజించడంలోని ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని కేంద్రానికి చంద్రబాబు లేఖ ఇస్తే ఆయన చేపట్టే నిరాహార దీక్షకు తాము మద్దతిస్తామన్నారు. సమైక్యవాదినని చెప్పుకొంటున్న సీఎం కిరణ్ రాజీనామా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
తెలుగు మీడియాపై వివక్ష
జగన్ తన దీక్షను మొదలు పెట్టిన దగ్గర్నుంచీ ఇంగ్లీషు మీడియాకే ప్రాధాన్యం ఇచ్చారు. తమతో మాట్లాడాలని తెలుగు మీడియా అడిగినా పట్టించుకోకుండా జాతీయ మీడియాతో ఒక్కొక్కరితో ఒక్కోసారి మాట్లాడారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన తెలుగు మీడియా విలేకరులు దీక్షను బహిష్కరించి వెళ్లిపోబోయారు. దీంతో 'అందరితో ఒకేసారి మాట్లాడతా' అంటూ మాట్లాడారు.
- See more at: http://www.andhrajyothy.com/node/7728#sthash.Ms03NBkA.dpuf

No comments:

Post a Comment