Monday 30 December 2013

కేసీఆర్‌ది మా ఎజెండా కాదు: మావోయిస్టు

కేసీఆర్‌ది మా ఎజెండా కాదు:కేసీఆర్‌పై మావోయిస్టు పార్టీ ఫైర్

Published at: 28-12-2013 08:10 AM
 5  5  0 
 
 

అయనవన్నీ బూటకపు మాటలు
దళితుడికి సీఎం పదవీ అంతే..
ఆయన అభివృద్ధి నమూనాలో శాటిలైట్ సిటీలే ఉంటాయి
దళారీ బూర్జువావర్గ ప్రతినిథి..వారి కోసమే ఉద్యమంలోకి..
కేసీఆర్‌పై మావోయిస్టు పార్టీ ఫైర్
కొలువులు,నీళ్లు దొరికితేనే పునర్నిర్మాణం పూర్తయినట్టు
అప్పటిదాకా ప్రజలు పోరాడాలి
నీళ్ల విషయంలో రాయలసీమకే కష్టాలు
ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం
బ్రిజేష్ నివేదిక వెనకబడిన ప్రాంతాలకు అనుకూలం
ఆం«ధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి ప్రతాప్ వ్యాఖ్య
హైదరాబాద్, డిసెంబర్ 27 (ఆంధ్రజ్యోతి) : "టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ది మా ఎజెండా కానే కాదు. అధికారంలోకి వచ్చాక మావోయిస్టు అభివృద్ధి నమూనాను అమలు చేస్తానని ఆయన అనడం పచ్చి బూటకం. ఆయన ముమ్మాటికి దళారీ బూర్జువా వర్గ ప్రతినిధి. వారి కోసమే ఆయన పని చేస్తున్నారు'' అంటూ గులాబీ అధిపతిపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ప్రతాప్ నిప్పులు చెరిగారు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామనడం కూడా అందులోభాగమేనని దుయ్యబట్టారు. విభజన వల్ల రాయలసీమ జల కష్టాలు మరింత పెరుగుతాయని, ఆ ప్రాంతంతో కలిసి తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ప్రత్యేక రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని తాము అనుకోవడం లేదన్న ఆయన.. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విధానాల కన్నా, ప్రజల తక్షణ సమస్యలే ప్రముఖ పాత్ర పోషించాయని అంచనా వేశారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, కొలువులు, నిధులు లభించినప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం పూర్తయినట్టని తెగేసిచెప్పారు. అప్పటిదాకా.. పోరాడాల్సిందేనని 'ఆంధ్రజ్యోతి'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ ప్రజలకు ప్రతాప్ పిలుపునిచ్చారు.
తెలంగాణ పునర్నిర్మాణం ఏ ప్రాతిపదికపై జరగాలని మావోయిస్టు పార్టీ ఆలోచిస్తోంది?
తెలంగాణ పునర్నిర్మాణం గురించి మా పార్టీ మొదటి నుంచీ నిర్దిష్టమైన ప్రతిపాదనలు చేస్తున్నది. తెలంగాణ ఉద్యమం బూర్జువా డిమాండే అయినా అందులో వివిధ సెక్షన్లు, వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరేలా పునర్నిర్మాణ ప్రక్రియ సాగాలి. అయితే బూర్జువా వర్గం సహజంగానే తన ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అణగారిన వర్గాల ప్రజల ఆకాంక్షలకు, దళారీ బూర్జువా వర్గ ఆకాంక్షలకు మధ్య సంఘర్షణ ఉంటుంది.అయితే, అయితే బూర్జువాయేతర నాలుగు వర్గాల ప్రయోజనాలే ఇందుకు మౌలిక ప్రాతిపదిక. దానికి మాత్రమే ఈ పార్టీ మద్దతు ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికీ భూ సంస్కరణలే ప్రధాన సమస్య. స్థూలంగా చెప్పాలంటే, కోస్తా ప్రాంతపు బడా బూర్జువా, భూస్వామ్య వర్గాల దోపిడీకి, వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు, నిధులు, నీళ్ల వంటి సమస్యలపై తెలంగాణ ఉద్యమం జరిగింది. కాబట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రజలు వీటిపై పోరాడితేనే పునర్నిర్మాణం జరిగినట్టు. వరంగల్ డిక్లరేషన్ (1997)లోనే ఈ విషయం స్పష్టం చేశాం.
తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు అభివృద్ధి నమూనా అమలు చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు గదా?
అదంతా పచ్చి బూటకం. కేసీఆర్‌ది మా ఎజెండా కానేకాదు. ఆయన తెలంగాణ ప్రాంత దళారీ బూర్జువా వర్గానికి ప్రతినిధి. ఆ వర్గం కోసమే ఆయన ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆయన అభివృద్ధి నమూనాలో హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ సిటీ ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. కోస్తాంధ్ర బూర్జువా వర్గంతో ఆయన మిలాఖత్ అయ్యారు. కాబట్టే, పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదు. ప్రాంత దళారీ బూర్జువా వర్గ ప్రయోజనాలకు అనువైన అభివృద్ధి నమూనాను తయారుచేసే పనిలో ఆయన తనమునకలయి ఉన్నారు. దీన్ని మావోయిస్టు నమూనా అనడం ప్రజలను మోసం చేయడమే. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, భూమి పంచుతానని అనడం కూడా ఇలాంటివే.
తెలంగాణ బూర్జువా వర్గం మీద మీ విశ్లేషణ ఏమిటి?
ఈ వర్గానికి నైజాం కాలంలోనే పునాదులు ఉన్నాయి. అయితే ఇది చాలా బలహీనమైన వర్గం. గ్రామీణ ప్రాంతంలో వెట్టి, బలవంతపు శిస్తు వంటి రూపాల్లో దోచుకున్న సంపదను భూస్వామ్య వర్గం ప్రధానంగా హైదరాబాద్‌లో తమ విలాసాలకు వాడేది. పోగా మిగిలిన మొత్తాన్ని పట్టణాల్లో రంపపు మిల్లులు, గూన పెంకులు వంటి చిన్న తరహా పరిశ్రమల్లో పెట్టేది. 1940ల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల పల్లెల్లో ఉండలేక పట్టణాలకు ఈ వర్గం పారిపోయింది. అప్పటినుంచి పరిశ్రమల నిర్వహణ క్రమం వేగం పుంజుకుంది. కల్లు వ్యాపారం, చక్కెర పరిశ్రమలు, ద్రాక్ష తోటల్లో పెట్టుబడులు పెడుతూ 1980, 90లలో బలమైన ప్రాంతీయ బూర్జువా వర్గంగా సంఘటితమైంది. 2000 తర్వాత తమ ప్రాంతం మీద అధికారానికి ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ క్రమంలో కోస్తా, రాయలసీమ పెట్టుబడిదారులతో ఈ వర్గానికి వైరుధ్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఈ వర్గం నిర్వహిస్తున్న పాత్ర ఇదే. అందులోభాగంగానే ' స్వయం పాలన' అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది.
భవిష్యత్తులో తెలంగాణ-కోస్తా, రాయలసీమ ప్రాంతీయ బూర్జువా వర్గాల మధ్య సంబంధాలు, ఘర్షణలు ఎలా ఉండొచ్చు?
ఈ మూడు ప్రాంతాల దళారీ ప్రాంతీయ బూర్జువా వర్గాలు హైదరాబాద్‌పై పట్టు కోసం కొంత కాలం ఘర్షణ పడే అవకాశం ఉంది. అట్లాగే నీళ్లు విషయంలో కూడా. ఇది కొంత క్లిష్టంగా ఉంటుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రాంతీయ బూర్జువా వర్గం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా తన సామ్రాజ్యవాద అనుకూల స్వభావంతో దోపిడీ విధానాలే అమలు చేస్తుంది. అయితే, సామ్రాజ్యవాదులకు దోచిపెట్టే విషయంలో ఈ మూడు ప్రాంతాల దళారీ బూర్జువాలు ఐక్యమవుతారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చే ప్రగతి వ్యతిరేకమైన తెలంగాణ బూర్జువా వర్గం..కోస్తా ంధ్ర, సామ్రాజ్యవాద పెట్టుబడులతో మిలాఖత్ అవుతుంది.
తెలంగాణ అనుకూల వైఖరితో బీజేపీ బలపడుతున్నది కదా?
ప్రత్యేక తెలంగాణ అనేది బూర్జువా డిమాండ్. కాబట్టి బీజేపీ సైతం ఉద్యమంలో పాల్గొంటున్నది. పార్లమెంట్‌లో బిల్లుకు మద్దతు ఇస్తామని చెబుతున్నది. అయితే ఆ పార్టీ కేంద్రంలో ఉన్నప్పుడు టీడీపీతో సయోధ్య పెట్టు కొని తెలంగాణ డిమాండ్‌ను పదిహేనేళ్లు ఆ పార్టీ దాటవేసింది. అనేక పార్టీలు తలపడుతున్న ఈ తరుణంలో తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా రంగం మీదికి వస్తుందని, అధికారం సాధిస్తుందని అనలేం. అయితే ఇటీవల దాని పునాది పెరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న తెలుగు ప్రజలను ఏ విధంగా విప్లవంలో భాగస్వాములను చేస్తారు?
తెలంగాణ, కోస్తా-రాయలసీమ ప్రజలకు దళారీ బూర్జువా వర్గం, సామ్రాజ్యవాదాలే ప్రధాన శత్రువులు. భూ సంస్కరణలు, నిర్వాసిత సమస్య, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల సమస్యలు, వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాద పెట్టుబడి వల్ల తలెత్తుతున్న సమస్యలు, దళితులకు భూమి, ఆత్మగౌరవం, ఆదివాసుల జల్ జంగల్ జమీన్..సమస్యలపై పోరాడాల్సి ఉంది. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించాలి.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏమంటారు?
ఢిల్లీ, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. ప్రభుత్వంలో అవినీతి, మహిళలకు రక్షణ లేకపోవడం, అధిక ధరలు వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు దీనికి మినహాయింపుగా ఉన్నా ఈ ధోరణి దేశ వ్యాప్తంగా వ్యక్తం కానుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేత మహేంద్రకర్మ మరణం తర్వాత అక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలను ఎలా అంచనా వేస్తున్నారు?
మహేంద్ర కర్మ మరణం తర్వాత బస్తర్‌లో బీజేపీ సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. బస్తర్‌లో ప్రత్యేకంగా ఒక రోజు ఎన్నికలు జరిపారు. భారీగా బలగాలను మోహరించి పోలింగ్ నిర్వహించారు. గతంలో ఒక్క కశ్మీర్‌లోనే ఇంతటి మోహరింపును చూశాం. జనతన సర్కార్ (మావోయిస్టు విప్లవ ప్రభుత్వం) పనిచేస్తున్న గ్రామాల్లో ఎక్కడా ప్రజలు పోలింగ్‌లో పాల్గొనలేదు. కానీ, 75 శాతం పోలింగ్ జరిగిందని సీఎం రమణ్‌సింగ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రమంతటా రిగ్గింగ్ భారీగా జరిగింది. కాబట్టి రమణ్‌సింగ్ అభివృద్ధి పథకాల విజయంగా ఈ ఎన్నికలను మా పార్టీ చూడటం లేదు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణమై..కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు అందితే
కృష్ణా జలాలు రాయలసీమకు అందుతాయనే వాదన ఉంది. ఇది సాధ్యమేనా?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణమైతే రాయలసీమ నీటి సమస్య పరిష్కారమవుతుందని అనుకోవడం చాలా పెద్ద పొరబాటు. రాయలసీమకు అందాల్సిన కృష్ణా నీరు అందకపోవడానికి కోస్తా ప్రాంత పాలకవర్గాలే కారణం. అనేక వంచనలతో, కుట్రలతో రాయలసీమకు నీరు రాకుండా అన్యాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్నందున కృష్ణా జలాల విషయంలో రాయలసీమ, తెలంగాణల మధ్య కూడా పరిష్కారం సాధించాల్సి ఉంది. దీనికి ప్రజాస్వామిక పద్ధతులను పాటించాలి. పోలవరం వల్ల ఖమ్మం తదితర ప్రాంతాల్లో వందలాది ఆదివాసీ గ్రామాలు ముంపునకు గురవుతాయి. వాళ్లను నాశ నం చేసి నిర్మించే పోలవరం వల్ల కృష్ణా డెల్టాకు లాభం తప్ప రాయలసీమకు మేలు జరగదు. పర్యావరణ సమస్య వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరుగుతుంది.
ఆదివాసీ ప్రాంతంలోని వనరులు దోచుకపోవడానికి, తీర ప్రాంతంలో స్థాపిస్తున్న పరిశ్రమలకు నీటి సౌకర్యం కోసం, రవాణా మార్గం కోసం ఈ ప్రాజెక్టును తలపెట్టారు. కేవలం డెల్టా ప్రాంతాల నీటి స్థిరీకరణకే ఆచరణలో ఇది ఉపయోగపడుతుంది. బ్రిజేష్‌కుమార్ నివేదిక..ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు నీటి విషయంలో కొంత అనుకూలంగా ఉంది. బూర్జువా వ్యవస్థలో ఏ కమిషన్ అయినా వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు చేయలేదు. అయితే రాయలసీమకు సంబంధించినంత వరకు బచావత్ ట్రిబ్యునల్ కంటే బ్రిజేష్‌కుమార్ నివేదిక కొంత మేలు చేస్తుంది.
విభజన సందర్భంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనల గురించి ఏమంటారు?
ప్రాంతీయ అసమానతలనేవి పెట్టుబడి సహజ లక్షణం. తెలంగాణ విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని ఇతర ప్రాంతాల ప్రజల్లో ఆందోళన కలగడానికి ఈ దళారీ పెట్టుబడిదారీ అభివృద్ధి విధానాలే కారణం. నీటి పంపకంలో రాయలసీమ ప్రజలకు మొదటి నుంచీ అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ కంటే ఎక్కువగా ఈ ప్రాంతమే ఇబ్బంది పడుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కృష్ణా జలాల్లో సీమకు న్యాయమైన వాటా అందివ్వాలి. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో ప్రజాస్వామిక శక్తులు పుంజుకొని.. తెలంగాణకు మద్దతు ఇస్తూనే సీమ ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ శక్తులే క్రమంగా ప్రత్యేక రాయలసీమ దిశగా ద్రుఢంగా సాగాల్సి ఉంది. ఇలాంటి న్యాయమైన ఉద్యమాలకు మా పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా ఈ ప్రాంతం తీవ్రమైన వెనుకబాటుతనానికి గురైంది. అక్కడి సముద్ర తీర ప్రాంత వనరులతో పాటు అన్ని వనరులనూ కోస్తా ప్రాంత దళారీ వర్గాలు కొల్లగొడుతున్నాయి. భారీగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. దీనిపై మా పార్టీ పోరాడుతున్నది.
- See more at: http://www.andhrajyothy.com/node/47814#sthash.AX9ibiP8.dpuf

No comments:

Post a Comment