Sunday 15 December 2013

పోలవరానికి కొత్త డిజైన్!

పోలవరానికి కొత్త డిజైన్!

Published at: 08-12-2013 07:11 AM

 New  0  0 

  



ప్రత్యామ్నాయ నమూనా పరిశీలించే అవకాశం
తెలంగాణ సహకారంతోనే ప్రాజెక్టు పూర్తి
రెండు రాష్ట్రాలూ సహకరించుకోవాలి
కష్టమే అయినా హీరాకుడ్ తరహాలో నిర్మిస్తాం
సరిహద్దులు మార్చొద్ధనే తెలంగాణలో భద్రాచలం
అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నించాం
జీవోఎం సభ్యుడు జైరా రమేశ్ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 7 : రాజకీయపరమైన సమస్యలు, కారణాలను దృష్టిలో ఉంచుకునే 'రాయల తెలంగాణ'పై వెనక్కి తగ్గినట్లు కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ చెప్పారు. విధి విధానాల్లో ఉన్న 11 అంశాలపై జీవోఎం ఒక్కొక్కదానిపై 20 పేజీల సిఫారసులు చేసిందని వెల్లడించారు. తమ సిఫారసులన్నింటినీ ముసాయిదా బిల్లులో చేర్చారన్నారు. గతంలో మాదిరి న్యాయ శాఖ కాకుండా జీవోఎం స్వయంగా బిల్లును తయారు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నీ బిల్లులో చేర్చామని... దీన్నిబట్టి తామెంత సీరియస్‌గా వ్యవహరించామో తెలుస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును అమలు చేసే ముందు దాని డిజైన్‌పై పునరాలోచిస్తామని... తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే పోలవరం అమలు అవుతుందని తెలిపారు. పార్లమెంటులో బిల్లును ఆమోదించే వరకూ ఇంకా అనేక మార్పులు జరిగే అవకాశాలున్నాయని చెప్పారు. జీవోఎం నివేదిక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన జైరాం శనివారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమైన అంశాలపై ఆయన ఏం చెప్పారంటే...
రాయల - తెలంగాణ
పది జిల్లాల తెలంగాణ, పన్నెండు జిల్లాల తెలంగాణపై చర్చించాం. మాకు అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన 1546 గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు వచ్చాయి. దీనిపై నాలుగు రోజులు సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఈ రెండు జిల్లాలను తెలంగాణలో చేర్చడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. నష్టాలూ ఉన్నాయి. ప్రధానంగా జల వనరులకు సంబంధించిన ప్రయోజనాలు ఉన్నప్పటికీ... రాజకీయంగా కొత్త సమస్యలు తలెత్తుతాయని గ్రహించాం. చివరకు పది జిల్లాల తెలంగాణనే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాం.
371(డి) కొనసాగింపు ఎందుకంటే
371(డి) రెండు రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలున్నాయి. జోనల్ వ్యవస్థ కొనసాగుతుంది. ఇందుకు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. సింగరేణిలో ప్రస్తుతం 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది. విభజన తర్వాత అది తెలంగాణ రాష్ట్రానికి చెందుతుంది. ఆస్తులు, అప్పుల విషయంలో కొన్నింటిని జనాభా ప్రాతిపదికగా, మరికొన్నింటిని ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి చెందేవిగా నిర్ధారించాం. చమురు, సహజవాయువు కేంద్రం బాధ్యత. గ్యాస్, చమురు ఏప్రాంతంలో కనుక్కుంటే ఆ ప్రాంతానికి రాయల్టీ వస్తుంది.
అన్నీ వస్తాయి...
వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, పెట్రోలియం రిఫైనరీ, ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, ఐఐఐటి, సెంట్రల్, వ్యవసాయ యూనివర్సిటీలు, రెండు ప్రాంతాల్లో గిరిజన యూనివర్సిటీలు, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్, ఐఐటీ, ఐఐఎం వంటి జాతీయ ప్రాధాన్యమున్న సంస్థలనన్నిటినీ భారత ప్రభుత్వం నెలకొల్పుతుందని బిల్లులోనే పేర్కొన్నాం. వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. నిజానికి... ప్యాకేజీ గురించి బిల్లులో ప్రస్తావించరాదని న్యాయ శాఖ చెప్పినా మేం వినలేదు. ప్రభుత్వ సీరియస్‌నెస్‌ను తెలిపేందుకే అలా చేశాం. విశాఖ, విజయవాడ విమానాశ్రయాలను ఆధునీకరిస్తున్నాం. దుగరాజపట్నం రేవును కూడా బిల్లులో చేర్చామన్నారు. తెలంగాణలో 4500 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటును ఎన్టీపీసీ ఏర్పాటు చేస్తుంది. రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్యాకేజీ ప్రకటిస్తాం. దీనిపై ఇప్పటికే ప్రధానికి సిఫారసు చేశాను. రాయలసీమ జిల్లాల్లోనూ ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తాం. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కల్పిస్తామన్నారు. నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్ వరకు ఎందరో రాయలసీమకు చెందినవారు ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ ఇంకా ప్యాకేజీ కావాలని కోరాల్సిన పరిస్థితి ఉండటం దురదృష్టకరం.
జల వనరులు...
జలవనరుల సమస్యపై 50 గంటలకు పైగా కసరత్తు చేశా ను. ముఖ్యమంత్రులతో కూ డిన ఉన్నతస్థాయి మండలి, గోదావరి, కృష్ణా నదులకు రెండు బోర్డులను ఏర్పాటు చేశాం. మండలి లేదా ట్రిబ్యునల్స్ జల వనరులు కేటాయిస్తాయి. జలవనరుల విషయంలో వివాదాలు రేగకుండా ఉండేందుకు బోర్డులకు చైర్మన్లు, సభ్యకార్యదర్శులను కేంద్రమే నియమిస్తుంది. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాజెక్టుల వారీగా నీటిపంపిణీ చేయాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కోరతాం. అన్ని జల వివాదాలు ఒకే రాత్రిలో పరిష్కారం కావు. అయితే, ఈ బోర్డులు మేం ఆశించినట్లుగా పనిచేస్తే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.
పోలవరం...మార్పులు!
నేను పర్యావరణ మంత్రి కాకమునుపే పోలవరానికి అనుమతులు వచ్చాయి. అప్పటికి గ్రామసభలు నిర్వహించలేదు. ఈ అంశం సుప్రీంకోర్టు ముందుంది. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రస్తుత రూపంలోని పోలవరం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాకు కూడా వ్యక్తిగత అభ్యంతరాలు ఉన్నప్పటికీ.... ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, కేంద్రమే చేపట్టేలా జీవోఎంలో నిర్ణయించాం. పోలవరం వల్ల తెలంగాణకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. అయితే... తెలంగాణ ప్రభుత్వంపైనే పోలవరం ప్రాజెక్టు అమలు ఆధారపడి ఉంది. ఈ రెండు రాష్ట్రాలు సహకరించుకోవాల్సి ఉంది. అంత సులువు కాకపోయినా... కేంద్రం హీరాకుడ్ తరహాలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంది. రెండు ప్రాంతాల ప్రజలను సమైక్యం చేయకపోతే విభజన బాధాకరంగా ఉంటుంది. కానీ... పార్టీలు, నాయకులు 'ప్రమాదకర ప్రకటన'లు చేస్తే ప్రజల్లో బిల్లు విశ్వాసం కల్పించలేదు. దురదృష్టవశాత్తు కొందరు నేతల ప్రకటనలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పార్టీలు అగ్నికి ఆజ్యంపోయరాదు.
యూటీ ఎందుకు వద్దంటే...
మొదట హైదరాబాద్‌పై సుదీర్ఘంగా చర్చించాం. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని, దానికి రాష్ట్ర హోదా కల్పించాలని సీమాంధ్ర నేతలు కోరారు. కానీ... సీడబ్ల్యూసీ తీర్మానం, కేబినెట్ నోట్‌లో హైదరాబాద్ పది సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని నిర్ణయించారు. ఇక... ఉమ్మడి రాజధాని పరిధిపైనా చాలా ప్రతిపాదనలు వచ్చాయి. అన్నీ పరిశీలించి జీహెచ్ఎంసీని ఉమ్మడి రాజధానిగా నిర్ణయించాం. ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రతకు సంబంధించిన అన్ని విషయాలపై గవర్నర్‌కు అంతిమ బాధ్యత ఉంటుంది. పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారు. గవర్నర్ తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించినప్పటికీ... అంతిమ నిర్ణయం ఆయనదేనని చెప్పారు. ఇది అరుణాచల్ ప్రదేశ్‌కు 371(హెచ్) నమూనా లాంటిదని చెప్పారు.
భద్రాచలం తెలంగాణకే..
1959 వరకు భద్రాచలం తూర్పు గోదావరిలోనే ఉందని, 134 గ్రామాలు పోలవరం క్రింద మునిగిపోతాయని... ముంపు ప్రాంతం ఒకే రాష్ట్రంలో ఉంటే పోలవరం చేపట్టడం సులభమవుతుందని ప్రతిపాదనలు వచ్చాయి. భద్రాచలంపై దాదాపు 5 రోజులు చర్చించాం. చివరికి... ప్రస్తుత సరిహద్దులను మారిస్తే ఇతర ప్రాంతాలపై ప్రభావం పడుతుందనే అంచనాకు వచ్చాం. భద్రాచలం రాజమండ్రికి చాలా దూరంలో ఉంది. చారిత్రక వాస్తవాలు, పోలవరం వంటి కారణాలు ఉన్నప్పటికీ పరిపాలనా సౌలభ్యానికి ప్రాధాన్యమిచ్చాం. పాల్వంచ డివిజన్‌లోనూ 34 గ్రామాలు ముంపునకు గురవుతాయి. అందువల్ల ముంపును ప్రాతిపదికగా తీసుకోలేదన్నారు. సీమాంధ్రులు భద్రాచలం విషయంలో అసంతృప్తిగా ఉన్నారని తెలుసు. కానీ, అన్ని ప్రాంతాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
- See more at: http://www.andhrajyothy.com/node/39239#sthash.eyLIIMsW.dpuf

No comments:

Post a Comment