Monday 22 June 2015

‘ట్యాప్‌’ విప్పండి.. ఎవరు చెబితే ట్యాప్ చేశారు

‘ట్యాప్‌’ విప్పండి.. ఎవరు చెబితే ట్యాప్ చేశారు
సర్వీస్ ప్రొవైడర్లను 11 గంటలపాటు ప్రశ్నించిన ఏపీ సిట్

  • సర్వీస్‌ ప్రొవైడర్లపై సిట్‌ ప్రశ్నల వర్షం
  • తొలిరోజు 11గంటలు సాగిన విచారణ
  • విజయవాడకు వచ్చిన యూనినార్‌, వొడాఫోన్‌, డొకొమో, రిలయన్స్‌, ఐడియా ప్రతినిధులు
  • నేడు మరికొందరి వంతు
విజయవాడ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఫోన్ల ట్యాపింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. టెలిఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం విజయవాడ భవానీపురం పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా 9 సర్వీస్‌ ప్రొవైడర్లకు సిట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం యూనినార్‌, వొడాఫోన్‌, డొకొమో, రిలయన్స్‌, ఐడియా కంపెనీల ప్రతినిధులు భవానీపురం స్టేషన్‌కు వచ్చారు. వీరిని ‘సిట్‌’ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం 11.30 గంటలకు మొదలైన విచారణ ప్రక్రియ శుక్రవారం రాత్రి 10.30 గంటలదాకా సాగింది. ‘‘అనుమతులు లేకుండానే ఫోన్ల ట్యాపింగ్‌ జరిగిందని మాకు నిర్ధారణ అయ్యింది. మీరు విచారణకు పూర్తిగా సహకరించాలి’’ అని కోరినట్లు సమాచారం. ‘‘ఏపీకి చెందిన ముఖ్యుల ఫోన్లను ట్యాప్‌ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశారు? ట్యాపింగ్‌ చేయాలని ఎవరైనా ఆదేశించి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి’’ అని వారిని కోరినట్లు తెలిసింది. ఆయా ఫోన్లను ఎప్పటి నుంచి ట్యాప్‌ చేస్తున్నారు? డేటాను ఎవరికి అందజేశారు? ప్రొవైడర్ల వద్ద ఎంత డేటా ఉందనే వివరాలపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. ముందు అనధికారికంగా ట్యాపింగ్‌ కొనసాగించి, ఆ తర్వాత దరఖాస్తు ఇచ్చారా? లేక, అధికారికంగా దరఖాస్తు ఇచ్చిన తర్వాతే ట్యాపింగ్‌ జరిగిందా? అని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ట్యాపింగ్‌ చేసిన కాల్స్‌ డేటా మొత్తం తమకు అందజేయాలని సిట్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయా కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని డిలిట్‌ చేయకుండా భద్రపరచాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. కొందరు సర్వీస్‌ ప్రొవైడర్లు కాల్‌డేటాను కొంతమేరకు సిట్‌ అధికారులకు సమర్పించారని... ఇతర వివరాలు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు... ఈ అంశంపై ఏపీ డీజీపీ రాముడు సిట్‌ అధికారులతో సమీక్షించారు. ‘‘ట్యాపింగ్‌కు సంబంధించి అధికారికంగా లేఖలు అందిన వాటిలో ఉన్న నెంబర్ల డేటా డిలీట్‌ చేయవద్దని ప్రొవైడర్లకు చెప్పాం. మంగళవారం మరికొందరు సర్వీస్‌ ప్రొవైడర్లు విజయవాడలో విచారణకు హాజరవుతారు. వారిని కూడా ప్రశ్నించి... బుధవారానికి పూర్తి సమాచారం అందిస్తాం’’ అని సిట్‌ అధికారులు డీజీపీకి వివరించినట్లు తెలిసింది.
ఇలా విచారణ...
సోమవారం ఉదయం 11 గంటలకు యునినార్‌, వొడాఫోన్‌ నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఆరుగురు ప్రతినిధులు భవానీపురం పోలీసు స్టేషన్‌కు వచ్చారు. 11.30 గంటలకు సిట్‌ అధికారులు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌, కాకినాడ ఏఎస్పీ దామోదర్‌, ఏఎస్పీ నరసింహారావు, బెజవాడ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సీఐ కాశీ విశ్వనాథ్‌ అక్కడికి చేరుకున్నారు. మొదట యునినార్‌ప్రతినిధులను నాలుగు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత వొడాఫోన్‌ ప్రతినిధుల విచారణ రాత్రి 7 గంటలదాకా సాగింది. ఆ తర్వాత డొకొమో, రిలయన్స్‌, ఐడియా ప్రతినిధుల విచారచణజరిగింది. వీరు రాత్రి 10.30 గంటలవరకు కు బయటికి వచ్చారు. 
 
సర్వీస్‌ ప్రొవైడర్లను మేమూ ప్రశ్నిస్తాం
మత్తయ్య కేసులో ఏపీ సీఐడీ పిటిషన్‌
ట్యాపింగ్‌ కేసులో సిట్‌ విచారణ ఎదుర్కొంటున్న సర్వీస్‌ ప్రొవైడర్లను తాము కూడా ప్రశ్నించాల్సి ఉందని ఏపీ సీఐడీ పేర్కొంది. జెరూసలెం మత్తయ్య కేసులో నెట్‌వర్క్‌ ప్రొవైడర్లను విచారించేందుకు తమకు అనుమతివ్వాలని సోమవారం సీఐడీ అధికారులు విజయవాడ కోర్టులో పిటిషన్‌ వేసినట్లు తెలిసింది.
తెలంగాణలో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య... విజయవాడలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదైంది. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఏపీ సర్కారు సీఐడీకి అప్పగించింది. ‘‘మత్తయ్యను, ఆయన కుటుంబ సభ్యులను ఫోన్‌లో బెదిరించింది ఎవరు? మత్తయ్య ఫోన్‌ కూడా ట్యాపింగ్‌కు గురైందా? అనే వివరాలను రాబట్టేందుకు సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్లను ప్రశ్నించాల్సి ఉంది. ఇందుకు అనుమతి ఇవ్వండి’’ అని సీఐడీ అధికారులు కోరారు.

No comments:

Post a Comment