Saturday 23 November 2013

సీఎం చెప్పినా ప్రొరోగ్ చేయకపోవండం తప్పు

సీఎం చెప్పినా ప్రొరోగ్ చేయకపోవండం తప్పు :కర్ణాటక గవర్నర్

Published at: 23-11-2013 07:58 AM
 4  4  0 
 
 

సభ నడకపై గవర్నర్‌కు విచక్షణాధికారం
రాజ్యంగం ప్రకారం ఆయనదే తుది నిర్ణయం

న్యూఢిల్లీ, నవంబర్ 22  : "రాష్ట్ర శాసనసభను సమావేశపరిచే అధికారం గానీ, ప్రొరోగ్ చేసే అధికారం గానీ స్పీకర్‌కు ఏమాత్రం లేదు. ఈ అధికారం గవర్నర్‌ది, రాష్ట్ర మంత్రిమండలిది మాత్రమే''నని కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ న్యాయ సలహాదారు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వికాస్ భన్సోడే అన్నారు. ఈ విషయం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ కూడా చెప్పారని వివరించారు. కర్ణాటక రాజ్‌భవన్ నుంచి ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధికి శుక్రవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పీకర్ పని ప్రభుత్వం సూచించిన విధంగా సభా కార్యక్రమాలను నిర్వహించడం, సభను నడపడం తప్ప మరేమీ కాదని చెప్పారు. సభను ప్రోరోగ్ చేయాలని ముఖ్యమంత్రి కోరినప్పటికీ దానిపై తాత్సారం చేస్తున్న స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీరు సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.సభను సమావేశపరిచే అధికారం స్పీకర్‌కు లేదని, గవర్నర్‌కు ఉన్నదని లోక్‌సభ స్పీకర్ వర్సెస్ రాజారామ్ పాల్ కేసులో సుప్రీంకోర్టు 2007లో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదని, ఆయన శాసనసభా పక్ష నాయకుడని, మొత్తం కేబినెట్‌కు ఆయన బాధ్యుడని, సభను ఎప్పుడు సమావేశపరచాలో ఆయనే నిర్ణయించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మొత్తం కేబినెట్ రాజీనామా చేయాల్సి వస్తుందని గుర్తు చేశారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ మంత్రిమండలి సలహా ప్రకారం సభ ను సమావేశపరచడం కానీ, ప్రొరోగ్ చేయడం కానీ చేస్తారని చెప్పుకొచ్చారు. మంత్రిమండలి సభ విశ్వాసాన్ని చూరగొన్నంతకాలం సభను సమావేశపరచడంపై, ప్రొరోగ్ చేయడంపై మంత్రిమండలి సలహాను గవర్నర్ పాటించాల్సి ఉంటుందని సర్కారియా కమిషన్ కూడా చెప్పిందని గుర్తుచేశారు. సభకూ, సభకూ మధ్య ఆరునెలల సమయం మించకుండా మాత్రమే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సాధారణంగా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయడంలో గవర్నర్ చేయాల్సింది ఏమీ ఉండదని, కానీ ఈ విషయంలో ఆయనకు విచక్షణాధికారాలు ఉన్నాయని వికాస్ చెప్పారు. ముఖ్యమంత్రి మెజారిటీ కోల్పోయినప్పుడు ఆయన అసెంబ్లీని సమావేశపరచకపోతే లేక ఉద్దేశపూర్వకంగా తన ఆదేశాలను పాటించడానికి నిరాకరిస్తే గవర్నర్ తన విచక్షణాధికారాల్ని ఉపయోగిస్తారని చెప్పారు. సాధారణ సందర్భాల్లో సభను ప్రొరోగ్ చేయడం కూడా ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ చేస్తారని, అయితే తనంతట తాను సభను ప్రొరోగ్ చేసే విచక్షణాధికారాలు గవర్నర్‌కు రాజ్యాంగం ఇచ్చిందని చెప్పారు. రాజ్యాంగంలోని 174(2)(ఎ) ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు గవర్నర్ సభను ప్రొరోగ్ చేయవచ్చునని, అంతమాత్రాన ముఖ్యమంత్రి అభ్యర్థనను ఆయన పాటించాలని ఎక్కడా లేదని ఆయన చెప్పారు.
 
- See more at: http://ec2-54-201-101-202.us-west-2.compute.amazonaws.com/node/32422#sthash.cAsVU9nQ.dpuf

No comments:

Post a Comment