Saturday 23 November 2013

ప్రోరోగ్‌పై ఆగని రగడ

ప్రోరోగ్‌పై ఆగని రగడ

Published at: 23-11-2013 08:32 AM
 New  0  0 
 
 

ప్రొరోగ్‌ను అడ్డుకునేందుకు శ్రీధర్‌బాబు వ్యూహం
పైలును తనవద్దే పెట్టుకోవాలని నిర్ణయం
కిరణ్‌పై టీ-మంత్రుల గుస్సా
హైదరాబాద్ నవంబర్ 22:ప్రొరోగ్ రగడ రగులుతూనే ఉంది. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు రానున్న కీలక తరుణంలో... అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకునేందుకే సీఎం కిరణ్ ప్రొరోగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని టీ-నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభను ప్రొరోగ్ చేస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకున్నా... శాసనసభా వ్యవహారాల మంత్రిగా తన అధికారాలను ఉపయోగించుకుని దీనిని అడ్డుకోవాలని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నిర్ణయించుకున్నారు. అధికార వర్గాలు తెలిపిన ప్రకారం... శాసనసభను స్పీకర్ ప్రొరోగ్ చేస్తే, దానిని శాసనమండలి చైర్మన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఆయన కూడా మండలిని ప్రొరోగ్ చేసిన తర్వాత... సంబంధిత ఫైలు శాసనసభా వ్యవహారాల మంత్రి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాల్సి ఉంటుంది. దీంతో... ఫైలు తన వద్దకు రాగానేదానిని పెండింగ్‌లో ఉంచడమో, కేబినెట్‌లో చర్చించాలని ప్రతిపాదించడమో చేస్తానని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు 'ఆంధ్రజ్యోతి'కి స్పష్టం చేశారు. ప్రొరోగ్ ఫైలు తన వద్దకు రావాల్సిందేనని తెలిపారు.
అయితే, ప్రొరోగ్‌పై కేబినెట్ అభిప్రాయం తీసుకోవాలని మంత్రి సిఫారసు చేసినంత మాత్రాన, దానిని ముఖ్యమంత్రి ఆమోదించాలనే లేదు. ఫైలును కనీసం ఆరుగురు మంత్రులకు పంపించి... వారితో సానుకూలంగా సంతకాలు తీసుకుంటే అదే కేబినెట్ అభిప్రాయమవుతుంది. సహజంగానే ముఖ్యమంత్రి ప్రొరోగ్‌కు అనుకూలంగా ఉన్న ఆరుగురు మంత్రులకే ఫైలు పంపే అవకాశముంది. అందువల్ల... శ్రీధర్‌బాబు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సాధ్యమైనంత కాలం తన వద్దనే ఫైలు ఉంచుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రొరోగ్ శుక్రవారం ఉదయం మంత్రి పొన్నాల లక్ష్మయ్య దీనిపై తెలంగాణకు చెందిన తన సహచర మంత్రులతో చర్చలు జరిపారు. శాసనసభను ప్రొరోగ్ చేయవద్దంటూ శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి విన్నవించాలని వీరు నిర్ణయించుకున్నారు. ఉదయం 11 గంటలకు గవర్నర్ నరసింహన్ మంత్రులకు అప్పాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు. అయితే, శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రొరోగ్ అంశంపై వచ్చిన వివరణ నేపథ్యంలో గవర్నర్‌తో భేటీని వాయిదా వేసుకున్నారు. మరోవైపు... వివాదంపై మాట్లాడేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ సుముఖత చూపడం లేదు. వాస్తవానికి గురువారం ఈ అంశంపై ఆయన దాదాపు నాలుగు గంటలపాటు సమీక్షించారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయం కూడా ఈ వ్యవహారంపై స్పందించేందుకు ముందుకు రావడం లేదు. మండలి చైర్మన్ ఎ.చక్రపాణి వివరణ కోరేందుకు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇదే సమయంలో మాజీ మంత్రి పి.శంకర్‌రావు సభను ప్రొరోగ్ చేయవద్దంటూ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను కోరారు.
- See more at: http://ec2-54-201-101-202.us-west-2.compute.amazonaws.com/node/32504#sthash.CcycRY5B.dpuf

No comments:

Post a Comment