Sunday 21 December 2014

మతమార్పిడులు వద్దా!

మతమార్పిడులు వద్దా!

చట్టం చేద్దాం రండి
లౌకిక పార్టీలు మద్దతి వ్వాలి : అమిత్‌షా

చెన్నై, డిసెంబర్‌ 20(ఆంధ్రజ్యోతి) : ‘దేశంలో మతమార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. లౌకిక ముసుగులో ఉన్న పార్టీలు దమ్ముంటే పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలి’ అంటూ బీజేపీ చీఫ్‌ అమిత్‌షా డిమాండ్‌ చేశారు. కొచ్చిన్‌లో రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అనంతరం చెన్నైలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఆయన చెన్నైలో పర్యటించనున్నారు. ఈ దేశంలో బలవంతపు మతమార్పిడులను వ్యతిరేకించే ఏకైక పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను మతప్రాతిపదికన విడగొట్టే ప్రయత్నాలు చేస్తుందన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శలపై.. తమ ప్రభుత్వం అలా వ్యవహరించదని స్పష్టం చేశారు. పదేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన దానికన్నా 6 నెలల్లో ఎన్డీయే సర్కార్‌ చేసిందే ఎక్కువని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేరళలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం.. మతమార్పిడుల అంశంపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే మతమార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని డిమాండ్‌ చేశారు. ‘మతమార్పిడులు మీకు ఆమోద యోగ్యంకానప్పుడు, దానికి వ్యతిరేకంగా చట్టం చేయాలి’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ప్రతిపక్షాలను కోరారు.

No comments:

Post a Comment