Saturday 27 December 2014

హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ అక్కినేని చలవే

హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ అక్కినేని చలవే

 హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ 100 రెట్లు విస్తరించాలి
రామోజీ ఫిలింసిటీ చూశా.. బ్రహ్మాండం: కేసీఆర్‌
వ్యక్తిత్వం, కర్తృత్వం, మిత్రత్వం కలిసిన
నేతృత్వం అక్కినేనిది: వెంకయ్య
అక్కినేనితో ఎన్నో అపురూప క్షణాలు: అమితాబ్‌
కేసీఆర్‌ నేతృత్వంలో బంగారు తెలంగాణ: నాగార్జున

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ 100 రెట్లు విస్తరించాలి. ఈ విషయమై త్వరలో సినిమా ప్రముఖులతో మాట్లాడతాం. చిత్ర పరిశ్రమకు ఎలాంటి రాయితీలు ఇవ్వాలి వంటి విషయాల ను వారితో చర్చిస్తాం. మంచి పద్ధతుల్లో సినిమా విరాజిల్లడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏటా ఇచ్చే.. అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు శనివారం సాయంత్రం ప్రదానం చేశా రు. కేసీఆర్‌ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారం జ్ఞాపికను, రూ.5 లక్షల చెక్కును బిగ్‌బీ అందుకున్నారు. కేంద్రమంత్రి వెం కయ్యనాయుడు ఆయనకు శాలువా కప్పి, ప్రశంసాపత్రాన్ని అందించారు. కాగా.. ‘‘అమితాబ్‌ నటించిన ‘అభిమాన్‌’ సినిమాను నేను 50 సార్లకుపైగా చూశాను. ఆయన లెజండరీ ఆర్టిస్టు. ఆయన పాత్రల్లో నటించరు. జీవిస్తారు. ఆయనకు నా చేతుల మీద అవార్డు ఇస్తానని ఎప్పుడూ అనుకోలేదు’’ అని కేసీఆర్‌ తన ప్రసం గంలో బిగ్‌బీని కొనియాడారు. తెలుగు పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంలో కీలక పాత్ర పోషించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని ప్రశంసించారు. ‘‘మొన్నమొన్నటిదాకా హైదరాబాద్‌కి తరలివచ్చిన చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు బాగా స్థిరపడింది. ముంబై కన్నా ఇక్కడే ఎక్కువ సినిమాలను తెరకెక్కిస్తారని తెలిసింది. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీని చూశాను. ఏడాదికి 200 పైచిలుకు చిత్రాల షూటింగ్‌ అక్కడ జరుగుతుందని తెలిసింది’’ అని అన్నారు. ఇక.. తెలుగు సినిమాకు నిఘంటువు అక్కినేని అని వెంకయ్యనాయుడు కొనియాడారు. ‘‘నటుడు అనేవాడు తాను కదలకుండా ఎదుటివారి మనసుల్లో కదలికలను పుట్టించాలి. అలాంటి గొప్ప నటులు అక్కినేని నాగేశ్వరరావు, అమితాబ్‌. వ్యక్తిత్వం, కర్తృత్వం, మిత్రత్వం కలిసిన నేతృత్వం అక్కినేనిది. ఆదర్శం, సిద్ధాంతం కన్నా వ్యక్తిత్వం మిన్న అని చాటిన వ్యక్తి అమితాబ్‌. అక్కినేని పురస్కారాన్ని అమితాబ్‌కు అందజేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఆ తర్వాత పురస్కార స్వీకర్త అమితాబ్‌ మాట్లాడారు. ‘‘అక్కినేని అవార్డును అం దుకోవడం మహదానందంగా ఉంది. ఆయనతో ఎన్నో అపు రూప క్షణాలను గడిపాను. ఏఎన్నార్‌ చాలా నిరాడంబరుడు. సమాజం ఆదరించడం వల్లనే ఈ స్థానంలో ఉన్నామని.. కాబట్టి సమాజానికి చేతనైనంత సాయాన్ని తిరిగి చేయాలని నమ్మే వ్యక్తి ఆయన. నేను కూడా అదే నమ్మాను’’ అన్నారు. అలాగే, వేదికపై ఉన్న కేసీఆర్‌ను ఉద్దేశించి.. ‘‘నా ఫేస్‌, నా వర్క్‌ ద్వారా మీకు ఉపయోగపడతానని ఎప్పుడైనా భావిస్తే తప్పక సంప్రదించండి’’ అని వ్యాఖ్యానించారు. తర్వాత నాగార్జున మాట్లాడారు. ‘‘అక్కినేని అవార్డు ప్రదానోత్సవాన్ని కొనసాగించాలని మా నాన్నగారు మా దగ్గర మాట తీసుకున్నారు. ఆయన చివరిదశలో దాదాపు 30 రోజులు అమితాబ్‌ సినిమాలను చూస్తూ గడిపారు. నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు అమితాబ్‌ సినిమాలను చూడమన్నారు.
మా అబ్బాయిలు సినిమాల్లోకి వస్తామన్నపుడూ మా నాన్నగారు అమితాబ్‌ చిత్రాలనే చూడమన్నారు. నాన్నగారు నటించిన చివరి చిత్రం ‘మనం’లో అమితాబ్‌ నటించడం ఆనందంగా ఉంది’’ అని నాగార్జున అన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమేనని పేర్కొన్నారు. అక్కినేనితో తనకు ఐదు దశాబ్దాల అనుబంధం ఉందని, అక్కినేని, అమితాబ్‌ ఇద్దరూ స్ఫూర్తిని పంచినవారేనని ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు చిరంజీవి, కె.రాఘవేంద్రరావు, ఆదిశేషగిరిరావు, డి.సురేష్‌బాబు, వి.వి.వినాయక్‌, రానా, సమంత, అక్కినేని వెంకట్‌, అమల, నాగసుశీల, సుమంత్‌, సుశాంత్‌, నాగచైతన్య, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment