Tuesday 4 February 2014

రాష్ట్రపతి మెడపై కత్తి పెడతారా!?

రాష్ట్రపతి మెడపై కత్తి పెడతారా!?

Published at: 05-02-2014 04:11 AM
 New  0  0 
 
 

కేంద్రంపై సీఎం వర్గం మండిపాటు
బిల్లు రాష్ట్రపతికి కూడా చేరలేదు...
రాజ్యసభలో పెడతామంటూ ప్రకటనా?
ఇది ఘోరం...అప్రజాస్వామికం
సీమాంధ్ర నేతలతో సీఎం భేటీలో ఆగ్రహ
న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయం
15వ తేదీ తర్వాత మళ్లీ ఢిల్లీకి వద్దాం
4 రోజులపాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ భేటీలు : కిరణ్
(హైదరాబాద్) 'రాష్ట్ర విభజన బిల్లును ఈనెల పదో తేదీన రాజ్యసభలో ప్రవేశపెడతాం' అన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే వ్యాఖ్యలపై సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు. రాష్ట్రపతి మెడ మీద కత్తి పెట్టి కేంద్రం నడిపిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ భవన్లో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తాజా పరిణామాలను చర్చించారు. ప్రధానంగా షిండే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ముందుగా కేంద్ర కేబినెట్ చర్చించాలి.
కేబినెట్ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి వెళ్లాలి. రాష్ట్రపతి దానిని క్షుణ్ణంగా పరిశీలించాలి. బిల్లును ఆమోదించాలి. పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పటి వరకు అది రాష్ట్రపతి పరిధిలోని అంశం. రాష్ట్రపతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టుకోవచ్చు. కానీ, ఇవేవీ జరగకుండానే పదో తేదీన రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పడం ఘోరం. రాష్ట్రపతి మెడ మీద కత్తి పెట్టి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం. తెలంగాణ విషయంలో కేంద్రం హరీబరీకి నిదర్శనం. ఈ వైఖరి అప్రజాస్వామికం'' అని మండిపడ్డారు. రాష్ట్రపతి నుంచి బిల్లు రాకుండానే షిండే ఎలా ప్రకటన చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, కేంద్రం తీరుపై మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చేరిన బిల్లు కట్టలకు అతికించిన గమ్ తడి కూడా ఆరక ముందే దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్ర హోం మంత్రి నిర్ణయించడం ఏమిటని ఆయన మండిపడ్డారు.
మంగళవారం ఆయన ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తొందరపాటును ప్రదర్శిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రానికి అంత తొందర ఏమొచ్చిందని ప్రశ్నించారు. బిల్లు కనీసం రాష్ట్రపతికి కూడా చేరకుండానే పదో తేదీన రాజ్యసభలో ప్రవేశపెడతామంటూ షిండే ప్రకటించడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే, కేంద్రానికి రాజ్యాంగ వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం లేదని అనిపిస్తోందని తప్పుబట్టారు. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగ నియమాలను కేంద్రం విస్మరిస్తోందని, అందువల్ల న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధం కావాలని సీఎంతో జరిగిన సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలపైనా చర్చ జరిగింది. ఢిల్లీకి మళ్లీ రావాల్సి ఉన్నందున బడ్జెట్ సమావేశాలను ఈనెల 8 నుంచి 13 వరకూ (మధ్యలో ఆదివారం వస్తోన్నందున), లేదంటే 10 నుంచి 14 వరకూ నిర్వహించాలని.. అయితే తుది నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో తీసుకుందామని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు సీఎం కిరణ్ వివరించారు. అవసరమైతే ఈనెల 15న మళ్లీ అందరమూ ఢిల్లీకి రావాలని చెప్పారు.
- See more at: http://www.andhrajyothy.com/node/62166#sthash.B95v6rkx.dpuf

No comments:

Post a Comment