Monday 24 February 2014

త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రులు


త్వరలో ఇద్దరు ముఖ్యమంత్రులు

Published at: 23-02-2014 03:09 AM
 New  0  0 
 
 

కిరణ్ వల్లే విద్వేష భావాలు హెచ్చరిల్లాయి..ఇప్పటికైనా ఆయన రాజీనామా సంతోషకరం
తెలంగాణ చారిత్రక వాస్తవం..రాజకీయ, సామాజిక కారణాలతోనే విభజన
సీమాంధ్రకు సాధ్యమైనంత న్యాయం చేశాం..కాలం అన్ని గాయాలను మాన్పుతుంది
గతాన్ని మర్చిపోవాలి..భవిష్యత్తును నిర్మించుకోవాలి..ఐదేళ్లలోనే అత్యంత అభివృద్ధి చెందుతుంది
చిరంజీవి ప్రసంగం అసంతృప్తి కలిగించింది..ఉత్తరప్రదేశ్ ఐదు ముక్కలు చేయాల్సిందే
'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక ఇంటర్వ్యూలో జీవోఎం కీలక సభ్యుడు జైరాం రమేశ్
(హైదరాబాద్ , ఫిబ్రవరి 22):తెలుగు మాట్లాడే ఇద్దరు ముఖ్యమంత్రులు త్వరలోనే వస్తారని జీవోఎం కీలక సభ్యుడు, కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డి కారణంగానే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో విద్వేష భావాలు పెచ్చరిల్లాయని, ముఖ్యమంత్రిగా ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను కలిసికట్టుగా ఉంచడానికి బదులు విడదీసేందుకు వీలుగా ఆయన ఆజ్యం పోశారని ధ్వజమెత్తారు. ఆయన కారణంగానే రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమైందని, ఇప్పటికైనా కిరణ్ రాజీనామా చేసినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ చారిత్రక వాస్తవమని, ఇకనైనా ఇరు ప్రాంతాల ప్రజలు విద్వేషాలను మరచి, సోదరులుగా తమ తమ రాష్ట్రాలను బలోపేతం చేసుకోవాలని కోరారు. సీమాంధ్ర ప్రజలు కష్టజీవులు, కృషివళులు, యాజమాన్య స్ఫూర్తి కలవారని, ఐదేళ్లలోనే సీమాంధ్ర దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతలది వన్ పాయింట్ ఎజెండా అని, హైదరాబాద్‌ను యూటీ చేయాలి లేదా సమైక్యంగా ఉంచాలని పట్టుబట్టారని విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో శనివారం 'ఆంధ్రజ్యోతి'కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
విభజన తర్వాత ఊపిరి పీల్చుకున్నారా? ఇక ఇప్పుడు జరిగేదేమిటి?
రాష్ట్ర విభజనకు ఉభయ సభలూ ఆమోదించిన తర్వాత నిజంగానే నేను ఊపిరి పీల్చుకున్నాను. కానీ, ఇక్కడితోనే అంతా పూర్తయినట్లు కాదు. నిజమైన పని ఇప్పుడు మొదలవుతుంది. రాజకీయ, చారిత్రక కారణాలతోనే తెలంగాణ డిమాండ్ వచ్చింది. అయినా, విభజన చేయాల్సి రావడం మనందరికీ బాధాకరమైన నిర్ణయం. తెలుగు ప్రజలంతా ఒకటే. వారు విడిపోవాల్సి వచ్చింది కనక ఇప్పుడు కావాల్సింది పరస్పర సహకారం. సంఘర్షణలు కాదు. జరిగింది మరిచిపోయి పరస్పర చర్చలు, అవగాహన, సోదర భావాల్ని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. సోదరులుగా కలిసి మెలసి ఉండాలి. సమస్యల్ని రాజకీయంగా పరిష్కరించుకోవాలి. బిల్లు, చట్టం సంగతి అటుంచి రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి. ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న వాస్తవికతను గుర్తించాలి. త్వరలో తెలుగు మాట్లాడే ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తారు. అయినా, తెలుగు ప్రజలంతా ఒకటే. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది.
కొందరు మిమ్మల్ని రాముడుగా, మరికొందరు రావణుడిగా భావిస్తున్నారు. ఇద్దరికీ మీరు రాముడిగా ఎందుకు కనిపించడం లేదు?
సీమాంధ్రకు చెందిన నా మిత్రులు నన్ను రావణుడిగా భావిస్తున్నారు. వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేశానని అనుకుంటున్నారు. కానీ, విశేషం ఏమిటంటే.. రాష్ట్ర విభజన బిల్లు నన్ను సీమాంధ్రకు చెందిన రాజ్యసభ సభ్యుడిగా గుర్తించింది. తెలంగాణకు చెందిన వాడిని కాదు. కానీ, నా ఎంపీ స్థానిక ప్రాంత నిధుల్లో రూ.30 కోట్లను నేను తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లోనే ఖర్చు చేశాను. ఎక్కువగా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లోని గిరిజన ప్రాంతాలకు కేటాయించాను. కానీ, గత ఏడాదిగా సీమాంధ్రలోని గిరిజన ప్రాంతాలకూ నిధులు ఖర్చు చేస్తున్నాను.
సీమాంధ్రకు ఎంతో నష్టం జరిగిందని ఆ ప్రాంత నేతలు అంటున్నారు.
అది నిజం కాదు. సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నాం. విజయనగరం, శ్రీకాకుళంలతో కూడిన ఉత్తర కోస్తాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇచ్చాం. సీమాంధ్రలో కేంద్రం భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్, హార్టీకల్చర్, గిరిజన యూనివర్సిటీ, ఉక్కు కర్మాగారం, రిఫైనరీ, పారిశ్రామిక కారిడార్స్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు తదితరాలన్నీ సీమాంధ్రలో వస్తున్నాయి. ఆరు సూత్రాల పథకంలో భాగంగా సీమాంధ్రను ప్రధాని ఐదేళ్లపాటు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా ప్రకటించారు. ప్రణాళికా సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నారు. సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు పూర్తి చిత్తశుద్ధితో కృషి చేశాం.
హైదరాబాద్ లేకపోవడం వల్ల సీమాంధ్రకు జరిగే నష్టం మాటేమిటి?
హైదరాబాద్ లేకపోవడం ద్వారా సీమాంధ్రకు జరిగే ఎలాంటి నష్టాన్నైనా పూరిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. దానిపై అధ్యయనం చేయాలని ఇప్పటికే 14వ కమిషన్‌ను కోరారు. సీమాంధ్రకు జరిగే ఎలాంటి నష్టాన్నైనా కేంద్రం గ్రాంట్ రూపంలో భరిస్తుంది. ఐదేళ్లపాటు కేంద్రం నుంచి లభించే సాయంలో 90 శాతం గ్రాంటే. దాన్ని మళ్లీ చెల్లించనవసరం లేదు. వడ్డీ భారం కూడా తగ్గిపోతుంది.
సీమాంధ్ర కోల్పోయింది ఏమీ లేదా?
సీమాంధ్ర ప్రజలు కష్టజీవులు. కృషీవలురు. రైతు బిడ్డలు, యాజమాన్య స్ఫూర్తి ఉన్నవారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, భారీ ప్రాజెక్టులు అమలు చేస్తున్న వారిలో సీమాంధ్ర కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు. మేకపాటి, రాయపాటి లగడపాటి, కావూరి వీరంతా సీమాంధ్రకు చెందిన వారే. ఛత్తీస్‌గఢ్, ఒడిసాల్లో గ్రామీణ రహదార్లను నిర్మిస్తున్న నెల్లూరుకు చెందిన సీమాంధ్ర కాంట్రాక్టర్లను చూశాను. అందువల్ల సీమాంధ్ర బలమైన రాష్ట్రంగా ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వారు శక్తిమంతులు, విద్యావంతులు, సమర్థులు. ఐదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుతంది.
బీజేపీ ఒత్తిడితోనే రాజ్యసభలో సీమాంధ్రకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందా?
లోక్‌సభలో చర్చ జరగనందువల్ల ప్రభుత్వం తరఫున సీమాంధ్రకు ఎలాంటి హామీలు ఇవ్వలేకపోయాం. రాజ్యసభలో చెప్పగలిగాం. అంతేకానీ, బీజేపీ ఒత్తిడితో మేం దిగి రాలేదు. నిజానికి వెంకయ్య నాయుడు చెప్పినవన్నీ బిల్లులోనే ఉన్నాయి. రాహుల్ గాంధీ ప్రత్యక్ష జోక్యం వల్లే సీమాంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక కేటగిరీ కల్పించాం. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు రాహుల్‌ను కలుసుకున్న తర్వాతే ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రకటించాలని నిర్ణయించాం. ఇవన్నీ మేం బీజేపీతోనూ చర్చించాం. జైట్లీ, సుష్మలతో కలిసి పని చేశాం. వెంకయ్య ఇంటికి రాత్రి 11 గంటలకు కూడా వెళ్లి చర్చించిన సందర్భాలున్నాయి. భూసేకరణ బిల్లును కూడా కలిసి ఆమోదించాం. తెలంగాణ బిల్లుపై కూడా అదే విధంగా పనిచేశాం.
బిల్లు లోపభూయిష్టమని విమర్శలు వచ్చాయి కదా?
ఈ బిల్లు లోపభూయిష్టమైనది కాదు. జైట్లీకి రాజ్యసభలో కపిల్ సిబల్ సమాధానం చెప్పారు. ఆర్టికల్ 3, 4 కిందే గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలిచ్చాం. ఈ విషయంలో సుప్రీం కోర్టు నాలుగు కేసుల్లో తీర్పు ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో రాజ్యాంగం ప్రకారమే గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చాం.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు కదా?
ఈ డిమాండ్ 1955 నుంచి ఉంది. 1969లో తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది. 2004లో కనీస ఉమ్మడి కార్యక్రమం, రాష్ట్రపతి ప్రసంగం, మేనిఫెస్టోలో చేర్చాం. వైఎస్ అసెంబ్లీలో ప్రకటించారు. రోశయ్య ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో అధిక పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాయి. 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీ ఏడాదిపాటు చర్చలు జరిపింది. ఇరు ప్రాంత నేతల మధ్య పలు దఫాలు సంప్రదింపులు జరిగాయి. ఆ తర్వాతే 2013 జూలై 30న సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. కనక మేం ఉన్నట్లుండి నిర్ణయం తీసుకున్నామని ఎలా అంటారు? ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశామని వెంకయ్య కూడా అన్నారు, కానీ, అది నిజం కాదు.
సీఎం కూడా వ్యతిరేకించారు కదా?
నిజానికి కిరణ్ వల్ల కూడా ఎంతో ఆలస్యం జరిగింది. ఆయన భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. కోర్ కమిటీలో ఆయన వాదనలు విన్నాం. అయితే అధిష్ఠానం, ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత.. అందర్నీ కలిసికట్టుగా ఉంచే బాధ్యతను ఆయన తీసుకోవాలి. కానీ, ప్రజలను విడదీసే చర్యలకు పూనుకున్నారు. కేంద్రానికి సమస్యలు సృష్టించారు. అందుకే ఆలస్యమైంది. ఇప్పటికైనా ఆయన రాజీనామా చేశారు. అందుకు సంతోషిస్తున్నాను.
విభజనకు సీమాంధ్ర నేతల్ని ఎందుకు ఒప్పించలేకపోయారు?
సీమాంధ్రలో నాకు మంచి స్నేహితులున్నారు. వారెవరూ నాకు శత్రువులు కారు. వారు యూటీ అడిగారు. అది నా చేతుల్లో లేదు. అదెప్పుడో జరిగిన నిర్ణయం. దానికి నేను బాధ్యుడిని కాదు. అసలు సీమాంధ్ర నేతలెవరూ సమైక్యాంధ్ర లేదా యూటీ తప్ప మరో విషయాన్ని అంగీకరించేందుకు సిద్ధపడలేదు. అది తప్ప మిగతావన్నీ చేసినా వారికి సంతృప్తి లేదు. హైదరాబాద్‌లోని విద్యా సంస్థల్లో సీమాంధ్ర యువతకు పదేళ్లపాటు యథాతథంగా అవకాశాలను కొనసాగించడం అనేది పెద్ద విషయం.
యూటీకి ఇబ్బందులేమిటి? సన్ సెట్ క్లాజ్ పెట్టాలని కూడా కోరారు కదా?
తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం. భారత దేశంలో సన్ నెవర్ సెట్స్.
కానిస్టేబుల్ బదిలీకి కూడా గవర్నర్‌ను అడగాల్సి ఉంటుందని ఒవైసీ అన్నారు
అది నిజం కాదు. అంతర్గత భద్రత, శాంతి భద్రతలు, ఆస్తుల రక్షణకు సంబంధించి గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలుంటాయని చెప్పాం. రోజువారీ సాధారణ శాంతి భద్రతల బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే.
ఆంధ్రప్రదేశ్ కంటే ఉత్తరప్రదేశ్‌లోనే ఎక్కువ నియోజకవర్గాలున్నాయి. మరి యూపీని ఎందుకు చీల్చలేదు?
ఉత్తరప్రదేశ్‌ను ఐదు రాష్ట్రాలుగా విభజించాలని నేను 20 ఏళ్లుగా వ్యాసాలు రాస్తున్నా. దీనివల్ల పరిపాలన మెరుగుపడుతుంది. ఈ మేరకు మాయావతి చేసిన ప్రతిపాదన సరైన దిశలో ఉంది.
విభజనతో మీకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం లభిస్తుంది?
నేను రాజకీయ ప్రయోజనం గురించి ఆలోచించలేదు. జీవోఎం సభ్యుడిగా బిల్లు ఎలా పెట్టాలని మాత్రమే ఆలోచించాను. తెలంగాణ ఏర్పాటు చేస్తే సీమాంధ్రకు బాధను, నష్టాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించాలని మాత్రమే ఆలోచించాను. రాజకీయాల గురించి కానీ, కాంగ్రెస్ గురించి కానీ ఆలోచించలేదు. టీఆర్ఎస్ విలీనం అవుతుందో లేదో నాకు తెలియదు. నేను కేసీఆర్, హరీశ్‌రావులను కలిశాను. కానీ, రాజకీయం గురించి మాట్లాడలేదు. అంతకంటే పెద్ద విషయాల్ని చర్చించాం.
మరి మొదట్లోనే ఆయనను ఎందుకు తీసేయలేదు?
ఆయనను తీసేయడం, ఉంచడం అన్నది నా పరిధిలోని నిర్ణయం కాదు. మీరు తప్పుడు వ్యక్తిని అడుగుతున్నారు.
ఎంపీలు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా?
ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధాకరమే. చిరంజీవి రాజ్యసభలో మాట్లాడిన తీరు నాకెంతో అసంతృప్తి కలిగించింది. తన వ్యతిరేకతను చెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఉంటే బాగుండేది. నిజానికి ఆంధ్రప్రదేశ్ అంటే నాకెంతో ఇష్టం. మా నాన్న ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. మా మామ ఐఏఎస్ అధికారి హోదాలో ఒంగోలులో పనిచేశారు. నాకు కర్ణాటక సంగీతం, త్యాగరాజ కీర్తనలు అంటే ఎంతో ఇష్టం. ఎందరో మహానుభావులు, జగదానందకారక, దుడుకుగల మొదలైన కీర్తనలను ఇష్టపడతా. ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్కృతి గల రాష్టం. దురదృష్టవశాత్తూ చారిత్రక, రాజకీయ కారణాల రీత్యా విభజన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చరిత్రలో నేను చిన్న పాత్ర పోషించానంతే. నాకు సీమాంధ్ర నేతలంతా మిత్రులే. కావూరి, ఉండవల్లి, లగడపాటి నియోజకవర్గాల్లో పర్యటించాను. కానీ, ఈ విషయంలో వారు నా పట్ల సంతోషంగా లేకపోవడం బాధాకరం.
పోలవరంపై పలుసార్లు నిర్ణయాలు ఎందుకు మార్చుకున్నారు? గిరిజనుల కంటే ప్రాజెక్టుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లున్నారు.
పోలవరం విషయంలో వారడిగినవన్నీ చేశాం. దీని విషయంలో నా వ్యక్తిగత అభిప్రాయాల్ని పక్కన పెట్టి సీడబ్ల్యూసీ చెప్పినట్లు ముందుకెళ్లా. 30 వేల కుటుంబాలు నిర్వాసితులవుతున్నారని తెలుసు. అందుకే దాని బాధ్యత పూర్తిగా కేంద్రమే తీసుకుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాం. గిరిజనులు భూమి కోల్పోతే భూమి ఇవ్వాలనుకున్నాం. సహాయ పునరావాస కార్యక్రమాలు చేసిన తర్వాతే ప్రాజెక్టు ముందుకు కదులుతుంది.
తెలంగాణ లో కూడా విద్యుత్ కొరత లాంటి సమస్యలు, వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి కదా?
తెలంగాణకు విద్యుత్ కొరత ఉన్నమాట నిజమే. అందుకే 4 వేల మెగావాట్ల యూనిట్‌ను నిర్మించబోతున్నాం. గ్యాస్ సమస్య పరిష్కారమైతే కేజీ బేసిన్ నుంచి గ్యాస్ లభిస్తుంది. పోలవరం ద్వారా కూడా 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సింగరేణిలో 51 శాతం బొగ్గు పూర్తిగా తెలంగాణదే కదా. మహబూబ్‌నగర్ వంటి వెనకబడిన ప్రాంతాలున్న మాట నిజమే. వాటికి ప్రత్యేక సహాయం ప్రకటించాం.
- ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ
- See more at: http://www.andhrajyothy.com/node/68719#sthash.81GFAQSX.dpuf

No comments:

Post a Comment