Tuesday 25 February 2014

విశాఖే వెలుగు రేఖ!

విశాఖే వెలుగు రేఖ!

Published at: 26-02-2014 07:19 AM
 New  0  0 
 
 

రాజధానికి ఇదే అనుకూలం
ఇప్పటికే పారిశ్రామిక రాజధానిగా గుర్తింపు
ఐటీ పరంగానూ ముందడుగు
అయితే రాయలసీమకు బాగా దూరం
ఉత్తరాంధ్రవాసుల అభిప్రాయం

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి):హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద నగరం! అంతర్జాతీయ విమానాశ్రయం! అద్వితీయమైన రెండు పోర్టు లు! పారిశ్రామిక రాజధానిగా ఇప్పటికే గుర్తింపు! ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఐటీ! అడుగడుగునా ప్రకృతి అందాలతో పర్యాటకానికి అద్భుత అవకాశం! ఇప్పటికే సకల హంగులతో కూడిన మౌలిక సదుపాయాలు! వీటన్నిటికీ మించి అందుబాటులో అవసరమైనంత భూమి! అందుకే.. సీమాంధ్ర రాజధానిగా విశాఖపట్నమే అనుకూలం అంటున్నారు ఉత్తరాంధ్రవాసు లు! తిరుపతి, కర్నూలు, ఒంగోలు, విజయవాడ- గుం టూరు పేర్లు వినిపిస్తున్నా వీటన్నింటి కంటే విశాఖే బెటరంటున్నారు విశ్లేషకులు. మరే నగరాన్ని ఎంపిక చేసినా మౌలిక వసతుల కల్పనకే ఏళ్లూ పూళ్లూ పడుతుందంటున్నారు. విశాఖకు సకల హంగులు ఉన్నందున అభివృద్ధి త్వరితగతిన సాధ్యమంటున్నారు.
పారిశ్రామిక నగరం
విశాఖ జిల్లాలో అపార ఖనిజ సంపద ఉంది. కాల్సైట్, క్రిస్టలైన్, లైమ్‌స్టోన్, బాక్సైట్, క్వార్ట్జ్ పెద్దఎత్తున లభిస్తున్నాయి. ఎనిమిది భారీ, 60 ప్రైవే టు పరిశ్రమలు, 14 ఆర్థిక మండళ్లు, 15 పారిశ్రామిక, నాలుగు ఐటీ పార్కులు, ఫార్మా సిటీ, హెల్త్ సిటీలతోపాటు చిన్న తరహా పరిశ్రమలు అనేకం ఉన్నాయి. వీటి పెట్టుబడి రూ.20,042 కోట్లు కాగా 48,234 మంది ఉపాధి పొందుతున్నారు. విశాఖనుం చి కాకినాడ వరకు తీరం పొడవునా 603.58 చ.కి.మీ.ల లో (60,358 హెక్టార్లు) అతిపెద్ద పెట్రో కారిడార్ ఏర్పా టుకానుంది. ఇందులో ఆరు ఆర్థిక మండళ్లను నోటిఫై చేశారు. 300 లక్షల టన్నుల సామర్థ్యంగల రెండు ఆయి ల్ రిఫైనరీలు ఏర్పాటవుతాయి. ఇందులో 70 వేల మం దికి ఉపాధి లభించనుంది. రెండేళ్ల కిందటి పెట్టుబడుల సదస్సులో విశాఖలో 24 పరిశ్రమలను రూ.89,195 కోట్లతో ఏర్పాటుచేసి 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. హైదరాబాద్ తర్వాత అత్యధికం గా విశాఖ నుంచి ఏటా రూ.1,500 కోట్ల ఐటీ ఎగుమతులు చేస్తున్నారు. ఐబీఎం, మహేంద్ర సత్యం, విప్రో, ఇన్ఫోటెక్, సింబయోసిస్, మహతి, న్యూనెట్ తదితర కం పెనీలు 7,705 మందికి ఉపాధి కల్పించాయి. నోవిటాస్, సాఫ్ట్‌ప్రో వంటి మరో 21 సంస్థలు రానున్నాయి. వీటితో 13 వేల మంది ఉపాధి లభించనుంది. ఏపీఐఐసీ, ఎస్‌టీపీఐ రూ.100 కోట్లతో ఐటీ టవరు, ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తుండటంతో 2 వేలమందికి ఉపాధి లభిస్తుంది.
రాజధాని కోసం భారీగా భూమి అవసరం. విశాఖలోని అనకాపల్లి, సబ్బవరం తదితర ప్రాంతాల్లో అధికారులు 24 వేల ఎకరాలు సేకరించి పెట్టారు. అవసరమైతే జూ పార్కు ఎదురుగాగల అటవీ భూమిని డీనోటిఫై చేస్తే మరో 10వేల ఎకరాలు అందుబాటులోకి వస్తాయి.
చిత్ర పరిశ్రమకు జీవం
విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. రామానాయుడు స్టూడియో నిర్మించారు. మరికొందరు స్థలాలు సేకరించారు. అందమైన బీచ్, అరుదైన ఎర్రమట్టి దిబ్బలు, ప్రకృతి సోయగాల అరకులోయ, ఎండాడ, అప్పికొండ సాగర తీరాలు సినిమా షూటింగ్‌కు అనువైన ప్రాంతాలు. తెలుగు, ఒడిసా, బెం గాలీ చిత్రాల షూటింగ్ ఎప్పటినుంచో సాగుతోంది.
ఇవీ విశాఖ ప్రత్యేకతలు
- సీమాంధ్రలో 11,161 చ.కి.మీ.లలో విస్తరించిన అతి పెద్ద నగరం. ఇందులో 36% పట్టణ ప్రాంతం.. 40% అడవులు. శారద, తాండవ, వరాహ, గోస్తనీ నదుల వల్ల నీటి కొరతలేదు. ఉష్ణోగ్రతలు కూడా కనిష్ఠం 18 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠం 38డిగ్రీలు. జిల్లా జనాభా 43 లక్షలు. కిలోమీటరుకుజనసాంద్రత 384.
-విశాఖ ప్రశాంత నగరం. నేర సంస్కృతి, క్రైమ్‌రేట్ అతి తక్కువ. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు అనుకూలం. ఎలాంటి భయాల్లేని నగరం.
- అంతర్జాతీయ విమానాశ్రయం. రాత్రీపగలూ విమానాల రాకపోకలు. సింగపూర్, దుబాయ్‌సహా కనెక్టివిటీ. రైలు, రోడ్డు మార్గాలూ పుష్కలం.
-దేశంలో 70కిపైగా రైల్వే డివిజన్లుండగా ఆదాయం లో నాలుగో స్థానం ఈ ప్రాంతానిదే. ప్రత్యేక జోన్‌కు అర్హతలు, భూములు కూడా ఇక్కడ ఉన్నాయి.
- దేశంలోనే అద్వితీయమైన విశాఖపట్నం పోర్టుతోపాటు ప్రైవేటు రంగంలో మరో అధునాతన గంగవరం పోర్టు ఇక్కడ ఉంది. కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే కాకినాడ పోర్టు ఉంది. మరికొన్ని మైనర్ పోర్టులు కూడా రానున్నాయి.
- అద్భుతమైన అందాలతో కూడిన బీచ్‌లతో విశాఖ ఇప్పటికే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. బౌద్ధారామాలు, అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన బొర్రా గుహలు, అరకులోయ వంటి అందాలు కొలువుదీరాయి.
-విశాఖ చదువుల సరస్వతి. మూడు విశ్వవిద్యాలయాలు, మూడు వైద్య, ఆరు ఫార్మసీ, 30 ఇంజనీరింగ్, రెండు పాలిటెక్నిక్ కాలేజీలు, 40 పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు న్యాయ, మేనేజ్‌మెంట్ కళాశాలలు ఉన్నాయి.
-హైదరాబాద్‌లాగే విశాఖ కూడా భిన్న సంస్కృతుల సమ్మేళనం. తూర్పు తీరాన పెట్టనికోటలా నౌకా దళం, ప్రభుత్వరంగ సంస్థలైన ఉక్కు కర్మాగారం, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్, బ్రాండిక్స్, ఇసాయ్ ఫార్మా తదితర కంపెనీల్లో పని చేయడానికి వచ్చిన దేశ, విదేశీయులతో విభిన్న సంస్కృతి ప్రతిబింబిస్తుంది.
ఇవీ ప్రతికూల వాదనలు
-విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు దూరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఓ మూలకు విసిరేసినట్టు ఉంటుంది. తిరుపతి నుంచి విశాఖకు 759 కిలోమీటర్లు (తిరుపతి నుంచి హైదరాబాద్ 540 కి.మీ.). కడప, కర్నూలు నుంచి విశాఖ 600 కి.మీ. ప్రకాశం నుంచి 530 కిలోమీటర్లు.
- విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది. విశాఖను రాజధాని చేస్తే అభివృద్ధి మొత్తం మళ్లీ ఒకేచోట కేంద్రీకృతమైపోతుంది. కేవలం ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి అయితే విశాఖను రాజధానిని చేయాల్సిన అవసరం లేదు.
ప్రజల కోసం రాజధానిగా చేయాలి: నరేశ్‌కుమార్, వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సెల్
విశాఖను ఎవరూ పనికట్టుకుని అభివృద్ధి చేయలేదు. సహజసిద్ధ వనరులతో తనకు తానుగా ఈ స్థితికి చేరింది. ఇక్కడి ప్రజలే పోరాడి విశాఖ ఉక్కును సాధించుకున్నారు. కొత్తగా విశాఖను ప్రమోట్ చేయడానికి రాజధానిని ఇక్కడ పెట్టనక్కర్లేదు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన ఆర్థిక సంపదను సృష్టించి, ఉపాధి కల్పించే నగరం కావాలనుకుంటే మాత్రం అది విశాఖ వల్లే సాధ్యం. ఇంకో నగరాన్ని ఎంపిక చేస్తే.. సీమాంధ్ర అభివృద్ధి ఇంకో పదేళ్లు వెనకబడుతుంది.
- See more at: http://www.andhrajyothy.com/node/69850#sthash.45QiB87U.dpuf

No comments:

Post a Comment