Monday 24 February 2014

రాజధాని కోసం రగడ


రాజధాని కోసం రగడ

Published at: 24-02-2014 08:58 AM
 New  0  0 
 
 

పెరుగుతున్న నేతల డిమాండ్లు.. తమ ప్రాంతమే అనుకూలమని వాదన
సీమాకు అన్యాయం జరిగితే రక్తపాతమే: టీజీ
విశాఖకు అన్ని అర్హతలూ ఉన్నాయి: కిశోర్
తూర్పు అయితే రాజధానికి బెస్ట్: తోట
గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని: శివాజీ
తిరుపతే రాజధానికి పూర్తి అనుకూలం: చింతా
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) ఊహించినట్లే.. సీమాంధ్రలో రాజధాని రగడ రాజుకుంటోంది! రాజధాని మాకు కావాలంటే మాకు కావాలంటూ నాయకులు వీరంగం వేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఒక్క రోజు కూడా కనిపించని నేతలు కూడా ఇప్పుడు రాజధాని కోసం ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తున్నారు. మరికొందరు అయితే.. రక్తపాతం జరుగుతుందని, సివిల్ వార్ వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సీమాంధ్రలోని దాదాపు ప్రతి జిల్లా నుంచి నేతలు రాజధానిని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్ర రాజధాని విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగితే రక్తపాతం జరిగి సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉందని మంత్రి టీజీ వెంకటేశ్ హెచ్చరించారు. కర్నూలులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు ఫ్యాక్షనిజాన్ని మరిచి ప్రశాంతంగా ఉన్నారని, రాజధాని విషయంలో రెచ్చగొడితే సీమ ఫ్యాక్షనిజం స్టైల్‌ను రుచి చూపించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయలసీమలో రాజ«ధాని పెట్టడం వీలుకాకపోతే కశ్మీర్ తరహలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో రెండు రాజధానులను ఏర్పాటు చేయాలని సూచించారు.
సీమాంధ్ర రాజధానిగా విశాఖను ప్రకటించాలని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ కోరారు. విశాఖ జిల్లా పాలకొండలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత అత్యంత అభివృద్ధి చెందిన నగరం విశాఖ మాత్రమేనని, రాజధానికి ఉండాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయని, ఇదే విషయాన్ని సోనియా, మన్మోహన్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. విశాఖను రాజధాని చేసేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయడం సరైన నిర్ణయం కాదని కిశోర్ చంద్రదేవ్ విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాజధానితో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, కేంద్రం పునరాలోచించి సీమాంధ్రకు తక్షణమే కొత్త రాజధానిని ప్రకటించాలని కోరారు. కాగా, సీమాంధ్ర రాజధానిని తూర్పు గోదావరి జిల్లాలోనే ఏర్పాటు చేయాలని మంత్రి తోట నరసింహం కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా, అన్ని వనరులు ఉన్న జిల్లాగా తూర్పుకు పేరుందని, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిందని, సహజ వాయువు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని, రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేస్తేనే బాగుంటుందని అధిష్ఠానాన్ని కోరుతున్నామని చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి పళ్లంరాజుతో కలిసి పోరాడతానన్నారు.
తిరుపతి కోసం కోటి సంతకాలు..
తిరుపతి నగరాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని ఎంపీ చింతా మోహన్ డిమాండు చేశారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో 'తిరుపతిని రాజధాని చేయండి' పేరుతో జరిగిన పౌర చర్చలో, అనంతరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధానికి అవసరమైన అన్ని హంగులూ తిరుపతికి ఉన్నాయన్నారు. తిరుపతిని రాజధాని చేయడానికి కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టాలని మహిళలకు పిలుపునిచ్చారు. తిరుపతి పౌరులే కాకుండా, దేశవ్యాప్తంగా శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల నుంచి సంతకాలను సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని వారం, పది రోజుల్లో పూర్తి చేసి మహిళలు, పౌర సభ్యుల ప్రతినిధులతో ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేద్దామని చెప్పారు.
"తిరుపతి తెలుగు వారి ముఖ్య పట్టణం అవుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు నిజం కాబోతోంది. సీమాం«ధ రాజధానికి ఐదు పట్టణాలను పరిశీలిస్తున్నా వాటిలో తిరుపతే అనుకూలమైనదిగా ఉంది. విశాఖ దేశానికి గౌహతిలాంటిది. కర్నూలు అహ్మదాబాదు వంటి అభివృద్ధి చెందిన పట్టణం. అవి ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు. విజయవాడలో స్థలం కరువు. ఒంగోలులో నీళ్లు లేవు. మిగిలిన తిరుపతే రాజధానికి అనుకూలమైనది'' అని వివరించారు. 1953లో మద్రాసు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు తిరుపతిని రాజధానిగా చేయాలని నెహ్రూ భావించారని, సంజీవరెడ్డి మోసం చేసి కర్నూలును రాజధానిగా చేయించుకున్నాడని విమర్శించారు. తిరుపతి కేంద్రంగా రాజధానికి ఏర్పేడు నుంచిరాపూరు వరకు లక్ష ఎకరాల స్థలం సిద్ధంగా ఉందని, సోమశిల నీటినే తిరుపతి రాజధానికి కూడా ఇవ్వవచ్చని చెప్పారు. తిరుపతిలో ఆరు జాతీయ రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం, వైద్య సౌకర్యాలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, ఇన్ని మౌలిక సదుపాయాలు కలిగిన తిరుపతి రాజధానికి అర్హమైనదని చెప్పారు.
గుంటూరు-విజయవాడ మధ్య..
సీమాంధ్ర రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్య ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి శివాజీ సూచించారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్‌సింగ్, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ తదితరులకు ఢిల్లీలో ఆయన వినతి పత్రం అందజేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వచ్చిన సందర్భంగా వివిధ అంశాలను ప్రధాని కార్యాలయానికి తెలియజేసిన శివాజీ ఆదివారం గుంటూరు చేరుకున్నారు. విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు విజయవాడ - గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని వాంఛూ కమిటీ సూచించిందని, కానీ, అప్పట్లో కొంత మంది దీనిని కర్నూలుకు తీసుకెళ్లి బళ్లారిని కర్ణాటకలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. "విజయవాడ - గుంటూరు మధ్య 5000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రోజుకు 340 రైళ్లు ఇతర ప్రాంతాలకు వెళతాయి. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చిదిద్దాలి. విజయవాడ, గుంటూరు, మంగళగరి, గన్నవరం, చినకోండ్రుపాడు ప్రాంతాల్లో వైద్య విద్యకు సంబంధించిన ఆరు టీచింగ్ కళాశాలలున్నాయి.
భూగర్భ జలాల కొరత లేదు. నాగార్జున యూనివర్సిటీలో సెక్రటేరియెట్‌ను ఏర్పాటు చేయాలి. ఈ యూనివర్సిటీని ఒంగోలుకు మార్చాలి. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు 40 ్రపైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసి సీమాంధ్రకు సంబంధించిన రాష్ట్ర స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయవచ్చు'' అని ప్రధానికి వివరించానని తెలిపారు. సీమాంధ్రకు వెయ్యి ఎకరాల సముద్ర తీర ప్రాంతం ఉందని, ఇక్కడ ఓడ రేవులను అభివృద్థి చేయాలని చెప్పారు. సీమాంధ్ర కొత్త రాజధానికి వెంటనే ఏర్పాట్లు చేయాలని, ఇందుకు పదేళ్లు అవసరం లేదని సూచించారు. కోస్తాలోని వనరులను ఉపయోగించుకుంటే ఐదారేళ్లలో అన్ని రకాల పరిశ్రమలు ఇక్కడే కేంద్రీకృతం అవుతాయని, ఇప్పటి వరకు రంగారెడ్డి, హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీమాంధ్రులు అప్పుడు తిరిగి గుంటూరు, విజయవాడలకు రావాల్సి ఉంటుందని తెలిపారు.
- See more at: http://www.andhrajyothy.com/node/69184#sthash.AOWs2POY.dpuf

No comments:

Post a Comment