- టీఆర్ఎస్ విస్తరణకు సర్కారు సొమ్ము
- ద్రోహులకు ముందు వరుసలో స్థానమా ?
- సీఎంపై టీ-కాంగ్రెస్ నేతల ధ్వజం
- 3 లక్షల మంది పట్టే స్టేడియంలో 12
- లక్షల మంది ఎలా ఉంటారు: కుంతియా
- 8 మంది ద్రోహులకు మంత్రి పదవులు: షబ్బీర్
- ఏం సాధించారని సంబరాలు: జీవన్రెడ్డి
హైదరాబాద్/ఖమ్మం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్ పార్టీ లేకపోతే... టీఆర్ఎస్ లేదు.. తెలంగాణ లేదు.. ప్లీనరీ లేదు.. అసలు కేసీఆర్ జీవితమే లేద’’ని టీ కాంగ్రెస్ నేతలు దెప్పిపొడిచారు. పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్, డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ మంగళవారం గాంధీ భవన్లో విలేకర్లతో మాట్లాడారు. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న భ్రమలో కేసీఆర్ ఉన్నారని, అందుకే ప్రతి వేదికపై అది నరుక్కుంటా, ఇది నరుక్కుంటా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడని, కానీ దీనిపై ఇంతవరకు వివరణ ఇవ్వలేదని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
వాటర్గ్రిడ్, మిషన్ కాకతీయ కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని, నిజానికి మంత్రులు, ఎమ్మెల్యేల కమీషన్ల కోసమే వాటిని వెచ్చిస్తున్నారని విమర్శించారు. అది మిషన్ కాకతీయ కాదని ‘కమీషన్ కాకతీయ’ అని విమర్శించారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ది బహిరంగ సభ కాదని, బల నిరూపణ సభ అని, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే సభను నిర్వహించారని ఆరోపించారు. 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో నడిచిన కార్యకర్తలను కాదని... నిన్న మొన్న పార్టీలో చేరిన దొంగలు, దోపిడీదారులు, తెలంగాణ ద్రోహులను ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణను ఈనగాసి నక్కల పాలు చేయొద్దంటూ మాట్లాడుతున్నారని, వేదికపై నీ పక్కన ఉన్నది నక్కలే కదా అని దెప్పిపొడిచారు. భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకులను కొట్టించి, కేసులు పెట్టించిన తెలంగాణ ద్రోహులను పక్కన కూర్చోబెట్టుకుని బంగారు తెలంగాణను సాధించుకుంటామని చెబుతావా అంటూ దుయ్యబట్టారు.
కాగా, తెలంగాణ ముసుగులో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని, ఆయన కుటుంబమే వనరుల దోపిడీని యథేచ్ఛగా సాగిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియా, రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడారు. కేసీఆర్ రాషా్ట్రన్ని దోచుకునే ప్రయత్నంలో ఉన్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సభ సందర్భంగా మూడు లక్షల మంది జనం పట్టే స్టేడియంలో 12 లక్షల మంది ఎలా ఉంటారని ప్రశ్నించారు. కుటుంబానికి ఒకే పింఛన్ ఇచ్చేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేసీఆర్ ఆయన కుటుంబంలోని అందరికీ రాజకీయ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని నిలదీశారు. కొడుకు, అల్లుడు శాఖలకు తప్ప వేరే శాఖలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఓదార్చడానికి కూడా సీఎంకు మనస్సు రావడం లేదని విమర్శించారు. మండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ కేసీఆర్ కేబినేట్లో ఎనిమిది మంది తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులిచ్చారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారులు రోడ్డున పడితే ద్రోహులు మాత్రం పదవులు అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా, సీఎం కేసీఆర్ ప్రతి పథకాన్ని, కార్యక్రమాన్ని, ప్రాజెక్టును మారుస్తూ తన ‘లేబుల్’ ఉండేటట్లుగా జాగ్రత్త పడుతున్నారని ఽసీఎల్పీ ఉపనేత టి. జీవన్రెడ్డి మండిపడ్డారు. 11 నెలల పాలనలో ఏ ప్రగతి సాధించారని, ప్రజలు, నిరుద్యోగులు కోసం ఏం ఏశారని టీఆర్ఎస్ వార్షికోత్సవ సంబరాలు చేసుకున్నారని నిలదీశారు. ‘‘శిశుపాలుడి మాదిరిగా ప్రజలు నీకు 100 తప్పుల అవకాశాన్ని ఐదేళ్ల కాల పరిమితితో ఇచ్చారు. ఆలోపు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చు. లేకపోతే నిన్ను ప్రజలు క్షమించరు. నీ నియంతృత్వ ధోరణి రాష్ట్ర ప్రగతికి దోహదపడదు’’ అని కేసీఆర్పై ధ్వజమెత్తారు.
|
No comments:
Post a Comment