Friday 17 April 2015

దుర్గగుడి ఫ్లైఓవర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

దుర్గగుడి ఫ్లైఓవర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

డీపీఆర్‌ సమర్పించమని ప్రభుత్వానికి ఆదేశం
విజయవాడ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ ప్రాంతానికి అనుసంధానంగా ఉన్న 67వ నెంబర్‌ జాతీయరహదారిపై విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ దిగువున బాటిల్‌నెక్‌ను నాలుగులేన్ల రహదారి, నాలుగేలేన్ల ఫ్లై ఓవర్‌గా విస్తరించటానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మార్గం సుగమం చేసింది. ఏపీ ప్రభుత్వం సూచించి న విధంగా ఆప్షన్‌-2 (రోడ్డు+ఫ్లైఓవర్‌)కు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)కు రూపకల్పన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆప్షన్‌-2కు సంబంధించి కేంద్రరోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఎస్‌ఈ ఆర్‌పీసింగ్‌ స్వల్ప సవరణలుచేస్తూ పలు అం శాలు నిర్దేశించారు. గతంలో జాతీయ రహదారిపై మిస్సింగ్‌ లింక్‌ 5 కిలోమీటర్ల మేర ఉండటం వల్ల దీనిపై నిర్ణయం తీసుకోకుండా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మిస్సింగ్‌ లింక్‌ జాతీయ రహదారుల శాఖ తమకు సంబంధించింది కాదని తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవటంతో ఇటీవలే దీనిని స్టేట్‌ హైవే్‌సగా ప్రకటించారు. ఈ మిస్సింగ్‌ లింక్‌ను కూడా కేంద్ర మంత్రిత్వశాఖ ధృవీకరిస్తూ అనుమతులు ఇచ్చింది. ఇంతకుముందు డిజైన్స్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణం రెండు లేన్లకే పరిమితమైంది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ కోరినవిధంగా రెండులేన్ల ఫ్లై ఓవర్‌ స్థానంలో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఫ్లై ఓవర్‌ను నాలుగు లేన్లు చేయటం వల్ల ఇంద్రకీలాద్రి కొం డపై ఉన్న నివాసాలకు కొంతమేర డ్యామేజీ వాటి ల్లే అవకాశం ఉంది. ఈ వివరాలతోపాటు ప్రాజెక్టు వ్యయం తదితర అంచనాలతో కూడిన డీ పీఆర్‌ను సమర్పించవలసిందిగా మంత్రిత్వశాఖ కోరింది. రాష్ట్ర రోడ్డు - భవనాల నిర్మాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఈ మేరకు ఆర్‌పీ సింగ్‌ లేఖ కూడా రాశారు. ఎన్‌హెచ్‌ - 67 (1.4 కి.మీ), ఎన్‌హెచ్‌- 5 పాతది (3.6 కి.మీ)లను కలుపుతూ భవానీపురం లారీ స్టాండ్‌ నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు 2.3 కి.మీల నాలుగులైన్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఫ్లైఓవర్‌ నుంచి వారధి వరకు 2.7 కి.మీ మేర నాలుగు లైన్ల రహదారి నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి సుమారు 500 కోట్ల రూపాయలదాకా ఖర్చు అవుతుందని అంచనా.

No comments:

Post a Comment