Wednesday 15 April 2015

సింహం, డేగ కలిస్తే ఎదురే ఉండదు

సింహం, డేగ కలిస్తే ఎదురే ఉండదు

Updated : 4/15/2015 2:29:39 AM
Views : 867
- భారత్, జర్మనీ మైత్రి మరింత బలపడాలి
- జర్మనీ పెట్టుబడుల కోసం భారత్‌లో ప్రత్యేక యంత్రాంగం
- ఐరాస భద్రతామండలిలో భారత్, జర్మనీలకు చోటివ్వాలి
- సంయుక్త ప్రకటనలో ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్

బెర్లిన్, ఏప్రిల్ 14: మానవ వనరులు పుష్కలంగా ఉన్న భారత్‌తో పారిశ్రామికాభివృద్ధిలో ఎంతో ముందున్న జర్మనీ చేయికలిపితే రెండుదేశాలు ప్రపంచంలోనే బలమైన శక్తిగా అవతరిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత పారిశ్రామికాభివృద్ధి కోసం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జర్మనీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. జర్మనీ పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల సౌకర్యం కోసం భారత్‌లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.

Modi-chancellete

భారత్‌లో సామాన్య పౌరుల జీవితాల్లో నాణ్యమైన మార్పు, ఆర్థిక పరిణామం కోసం తాము నిర్దేశించుకొన్న లక్ష్యాలకు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలు, పెట్టుబడులే అతి ముఖ్యమైనవని తెలిపారు. వీటిలో ఎంతో అభివృద్ధి సాధించిన జర్మనీ తమకు సహకారం అందించాలని కోరుకొంటున్నట్లు చెప్పారు. జర్మనీలో మూడురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నైపుణ్యం ఆధారంగా మా దేశంలో యువతకు ఉద్యోగాలు సృష్టించటమే మేక్ ఇన్ ఇండియా లక్ష్యం. ఈ విషయంలో జర్మనీ ప్రపంచానికే లీడర్. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భారత్ సొంతంగానే కృషిచేయాల్సి ఉంది. అదే సమయంలో జర్మనీ నుంచి మేం చాలా నేర్చుకోగలం. ఈ అంశంపై మేం (మెర్కెల్‌తో) కూలంకషంగా చర్చించాం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, విద్యారంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం. ప్రపంచ రాజు సింహం (మేక్ ఇన్ ఇండియా గుర్తు), ఆకాశ రాజు డేగ (జర్మనీ జాతీయ పక్షి) కలిస్తే బలమైన శక్తిగా అవతరిస్తాయి.

Modi-chancellete

నేను ఇక్కడికి వచ్చింది జర్మనీ పెట్టుబడిదారులను భారత్‌కు ఆహ్వానించటానికి మాత్రమే కాదు. భారత్‌లో స్థిరమైన పరిస్థితులున్నాయని హామీ ఇచ్చేందుకు వచ్చాను అని మోదీ తెలిపారు. శుద్ధ ఇంధన రంగంలో భారత్‌కు జర్మనీ బలమైన భాగస్వామి అని చెప్పారు. భారత్‌లో శుద్ధ, పునర్వినియోగ ఇంధనరంగ వస్తువుల తయారీకి సహకరించాలని కోరారు. తయారీరంగంలో భారత్ అభివృద్ధి చెందితే అందరికీ వాణిజ్యావకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్, జర్మనీకి శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని మోదీ డిమాండ్ చేశారు. భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి త్వరగా ఒక రూపునిచ్చేందుకు సహకరించాలని ఏంజెలా మెర్కెల్‌ను కోరారు. పర్యావరణ మార్పులపై పోరాటంలో భారత్, జర్మనీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

అణు విస్తరణకన్నా ఉగ్రవాదమే ప్రమాదం


అణ్వాయుధాల విస్తరణకన్నా ప్రపంచానికి ఉగ్రవాదమే అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. అది మానవత్వానికే పెనుముప్పుగా పరిణమిస్తున్నదని తెలిపారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశాలపై ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితిలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సుపై (సీసీఐటీ) ఈ ఏడాదైనా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆఫ్గనిస్థాన్‌లో శాంతి, ప్రజాస్వామ్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని తెలిపారు.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అందరూ రాజీకి రావాలి: మెర్కెల్


ఈయూ- భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అన్ని వర్గాలు రాజీకి రావాలని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ పిలుపునిచ్చారు. ఈ ఒప్పందంపై భారత్, ఈయూ మధ్య సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రధాని విమానంలో సమస్యలు


న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ వాడుతున్న ఎయిర్ ఇండియా వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ముంబైలో సిద్ధంగా ఉన్న ప్రత్యామ్నాయ విమానాన్ని హుటాహుటిన జర్మనీ రాజధాని బెర్లిన్‌కు పంపారు. బోయింగ్ 747-400 విమానంలో ప్రధాని బెర్లిన్ నుంచి కెనడాలోని ఒట్టావాకు వెళ్లాల్సి ఉండగా మంగళవారం ఉదయం విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే ప్రత్యామ్నాయ విమానాన్ని బెర్లిన్ పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ విమానంలో ప్రధానితోపాటు ఇతర భారతీయ ప్రతినిధులు కెనడా బయలుదేరి వెళ్లారు.

No comments:

Post a Comment