Wednesday 29 April 2015

టీఆర్‌ఎస్‌కు దీటుగా సభ పెడదాం!

టీఆర్‌ఎస్‌కు దీటుగా సభ పెడదాం!

Sakshi | Updated: April 29, 2015 04:12 (IST)
టీఆర్‌ఎస్‌కు దీటుగా సభ పెడదాం!
     ఏపీ సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతలు
     జూన్‌లో పరేడ్ గ్రౌండ్స్‌లోనే
     నిర్వహిద్దామని ప్రతిపాదన
     అంగీకరించిన బాబు


హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు దీటుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. మే నెలాఖరులో నిర్వహించే మహానాడు తరువాత ఈ సభ జరపాలని భావిస్తున్నట్లు టీటీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు తెలిపారు. మంగళవారం ఏపీ సచివాలయంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, జి.సాయన్న, సండ్ర వెంకట వీరయ్య తదితరులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్ సభకు హాజరైన జనం, చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చర్చకు వచ్చాయి.


‘10 లక్షల మంది జనం వస్తారని గొప్పలు చెప్పుకొన్నారు. తీరా చూస్తే 2 లక్షలు కూడా దాటలేదు. మనం తలచుకుంటే అంతకన్నా ఎక్కువ మందిని తీసుకురావచ్చు. మహానాడు తరువాత పరేడ్ గ్రౌండ్స్‌లోనే టీడీపీ సభ పెట్టి తడాఖా చూపిస్తాం..’ అని రేవంత్, ఎర్రబెల్లి తదితర నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. ఇందుకు అంగీకరించిన బాబు.. పకడ్బందీగా సభ నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించినట్లు సమాచారం. అంతకన్నా ముందు మే నెలలో ఖమ్మంలో సభ నిర్వహించి ఆ జిల్లా టీడీపీ వెంటే ఉందన్న సందేశాన్ని పంపించాలని నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇక మహానాడును హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించినందున రెండు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారని, అందుకోసం సరైన వేదికను నిర్ణయించాలని నేతలు చంద్రబాబును కోరినట్లు సమాచారం.


ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలను డిసెంబర్‌లోపు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో... గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, పార్టీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరు 20 డివిజన్ల బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. ఎన్నికల సన్నద్ధతపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం, పథకాల్లో అవినీతి, హామీల  అమల్లో వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లాలని బాబు సూచించినట్లు తెలిసింది. కాగా.. టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ను కలిసేందుకు టీటీడీపీ నేతలు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.

చింతలను బీజేపీ సిఫారసు చేయలేదు: బాబు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో బీజేపీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని నియమించాలని భావించినా ఆ పార్టీ నేతలెవరూ ఆయన పేరు సిఫారసు చేయలేదని చంద్రబాబు వెల్లడించారు. టీటీడీలో తెలంగాణ నుంచి టీడీపీ తరుఫున ఎమ్మెల్యేలు జి.సాయన్న, సండ్ర వెంకట వీరయ్యతో పాటు బీజేపీ నుంచి చింతలను ఖరారు చేసినట్లు బాబు చైనా పర్యటనకు ముందు ప్రకటించారు. అయితే సోమవారం విడుదల చేసిన జీవోలో చింతల పేరు లేదు. ఈ నేపథ్యంలో టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం చంద్రబాబును కలిసినప్పుడు ఆరా తీయగా పైవిధంగా ఆయన స్పందించారు.


కానీ ముందే పేరు ప్రకటించి తరువాత వెనక్కు త గ్గడం వల్ల చింతలకు ఇబ్బందేమోనని ఎర్రబెల్లి పేర్కొనగా... ‘హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న టీటీడీకి చెందిన బాలాజీ భవన్ స్థాయిని పెంచుదాం. దానికి చింతలను చైర్మన్ చేసి, టీటీడీ పాలకమండలి ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదా కల్పిద్దాం’ అని బాబు చెప్పినట్లు సమాచారం

No comments:

Post a Comment