Wednesday 9 April 2014

చిరంజీవి : కాంగ్రెస్ కు కొత్త ఉత్తేజం

చిరంజీవి : కాంగ్రెస్ కు కొత్త ఉత్తేజం

       సీమాంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం రెండు రకాల అపోహలు బలంగా ప్రచారంలో వున్నాయి.  ఇందులో మొదటిది టీడిపి- బీజేపి కూటమి గాలి బలంగావుందనేది. రెండోది, కాంగ్రెస్ పునాది ఫూర్తిగా కూలిపోయిందనేది. ఇది చంద్రబాబు,  బీజేపి నాయకులు ఆడుతున్న ఎన్నికల వికృత కీడలో భాగం మాత్రమే! మరోవైపు, టీడీపి - బీజేపీ లని బలపరిచే మీడియా దీన్ని బలంగా ప్రచారంలో పెట్టింది. ఇలాంటి ప్రచారాలన్నీ చంద్రబాబు నుండి నరేంద్ర మోదీ నేర్చుకున్నారో, నరేంద్ర మోదీ నుండి చంద్ర బాబు నేర్చుకున్నారోగానీ ఒక అబధ్ధాన్ని నిజంమంటూ ప్రచారం చేయడడంలో వాళ్ళిద్దరూ ఘనాపాటీలు.

       ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టినందుకు కాంగ్రెస్ మీద సీమాంధ్రలో తీవ్ర వ్యతిరేకత వుందనేది ఒక ప్రచారం. దాని వల్ల కాంగ్రెస్  ఓటు బ్యాంకు కుప్పకూలిపోయిందనేది మరో ప్రచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఓటర్లు అందరూ మూకుమ్మడిగా తెలుగుదేశం, బీజేపి వైపుకు పోతున్నారనేది ఇంకో ప్రచారం. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని తెలియడానికి ఎవరూ ఎక్కడికీ వెళ్ళాల్సిన పనిలేదు. కొన్ని పాత వార్తా పత్రికలు తిరగేసినా చాలు. సీమాంధ్రలో టీడీపి, బీజేపి కలిసి సాగిస్తున్న దుష్ప్రచారం అసలు రూపం ఎవరికైనా తెలుస్తుంది.

       సీమాంధ్ర ఎన్నికల బరిలో ఇప్పుడున్న పార్టీలు అన్నింట్లో అందరికన్నా ముందుగా రాష్ట్ర విభజనను ప్రతిపాదించిన పార్టి బీజేపి. చిన్న రాష్ట్రాలు అనేది పార్టీ విధానంగా మార్చుకున్న బీజేపి 1998 లోక్ సభ ఎన్నికలకు ముందు, సీమాంధ్ర నడిగడ్ద కాకినాడలో  జరిగిన  ప్లీనరీలో  "ఒక ఓటు - రెండు రాష్ట్రాలు అనే తీర్మానం చేసింది. ఒకవేళ సీమాంధ్ర ప్రజలకు రాష్ట్ర విభజన మీద తీవ్ర వ్యతిరేకత వుంటే ఆ కోపం  ముందుగా బీజేపి మీద వుండాలి. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి బీజేపి నాయకులు,  వాళ్ళ కొత్త రాజకీయ ప్రియుడు చంద్రబాబు కలిసి ఆ నెపాన్ని కాంగ్రెస్ మీద పడేసేందుకు కుట్ర పూరిత పధ్ధతుల్లో ప్రయత్నిస్తున్నాయి. టిడిపి-బీజేపిల అనుయాయులుగా మారిపోయిన మీడియా సంస్థలు కూడా గతాన్నీ, వాస్తవాన్నీ కప్పిపుచ్చడానికి 24X7 చెమటోడ్చి పనిచేస్తున్నాయి.

       రాష్ట్రాన్నీ విభజించడానికి బీజేపి తరువాత గట్టిగా  నడుంబిగించిన పార్టి టిడిపి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో అవమానకరంగా  ఓడిపోయిన చంద్రబాబు 2009  ఎన్నికల్లో కేసిఆర్ తో జతకట్టడానికి తెలంగాణ భవన్ చూట్టూ ప్రదక్షిణలు చేశారు. సీమాంధ్ర ప్రజలే రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారు అనడం కోసం కే. ఎర్రన్నాయుడూ, యనమల రామకృష్ణుడు తదితరులతో ఒక కమిటీ వేశారు. ప్రజలు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆ కమిటీ నివేదికని ఇచ్చింది. చంద్రబాబే అలా నివేదికను  ఇప్పించుకున్నారని తెలియని తెలుగు తమ్ముళ్ళు ఎవరూ వుండరు. ఎర్రన్నాయుడూ, యనమల రామకృష్ణుడు నివేదికకు టీడిపి పాలిట్ బ్యూరో ఆమోదించగానే చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడింది కేసిఆర్ తోనే!. అంతిమంగా 2008 విజయదశమి రోజున మరీ మంచి ముహూర్తం చూసి  కేసిఆర్ తో ఎన్నికల  పొత్తుకుదుర్చుకున్నారు. ఆ వెంటనే అతి ఉత్సాహంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ అంగీకారాన్ని రాత పూర్వకంగా తెలుపుతూ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి  లేఖ రాశారు.

       2009 ఎన్నికల్లో తొలివిడతగా తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఆరోజు రాత్రి, అధికారంలోనికి  వచ్చేస్తున్నట్టు తెలుగు తమ్ముళ్ళు, గులాబీ దళం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో గులాల్ జల్లుకుని, కేకులు కట్ చేసుకుని పండగ జరుపుకున్నారు. ఆ రోజు అప్పటి కాంగ్రెస్  ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేస్తే, చంద్రబాబూ దర్శకత్వంలో కేసిఆర్ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ విధానాలను దుయ్యబట్టారు.

              రాష్ట్ర విభజన కోసం చంద్రబాబు సాగించిన పోరాటం అక్కడితో ఆగలేదు. గత ఐదేళ్ల కాలంలో వారు ఎప్పుడు తెలంగాణలో పర్యటించినా, తెలంగాణను ఏర్పాటు చేయాలని ఎప్పుడో లేఖను ఇచ్చామనీ,  కాంగ్రెస్సే కేంద్రంలో విభజనను అడ్డుకుంటున్నదని చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో తెలంగాణ ఇస్తారా? లేదా? అని కాంగ్రెస్ ను సవాలు చేసేవారు. కేంద్రప్రభుత్వం రాష్ట్ర విభజనను  ప్రకటించినపుడు "చంద్రబాబు లేఖ ఇవ్వడంవల్లే తెలంగాణ వచ్చింది" అని టీ-తమ్ముళ్లు మీడియా సమావేశాలు పెట్టి చెప్పిన మాటలు సీమాంధ్ర ప్రజలు వార్తా పత్రికల్లో చదివి వుండరనీ, టీవీల్లో చూసివుందరనీ పసుపుబాబు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఏమీవుండదు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచం తనను చూడడం లేదనుకుంటుంది. పిల్లిగడ్దం పెద్ద మనిషిదీ అదే వారసత్వం.

       వాస్తవం ఏమంటే, 2004 ఎన్నికల్లో  తెలంగాణ అంశాన్ని రెండవ ఎస్సార్సీ ద్వార పరిష్కరిస్తానని మాత్రమే కాంగ్రెస్ చెప్పింది. బీజేపి, టిడిపి, వైయస్సార్ సిపి, సిపిఐ పార్టీలు తెలంగాణకు అనుగుణంగా లేఖలు ఇచ్చిన నాలుగేళ్ల తరువాతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటి రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో "తెలంగాణ తెచ్చింది మేమే" అని టిడిపి-బీజేపి నాయకులు అంటున్నారు. సీమాంధ్రలో "తెలంగాణను  అడ్డుకున్నది మేమే" అనే అర్ధం వచ్చేలా తెలుగుతమ్ముళ్ళు వ్యవహరిస్తున్నారు. వెనకటికి ఓ అతితెలివైన గడుసుపిండం తన మిత్రుల్ని  "మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావూ? మా ఇంటికి వస్తే ఏమి తెస్తావూ?" అని అడిగేవాడట. చంద్రబాబు ఆ వంశంలో పుట్టివుంటారు. వారికి తెలంగాణలో విభజన ఓట్లు కావాలి. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఓట్లు కావాలి. అంతిమంగా తాను మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి. "తెలంగాణ కోసం బొంతపురుగునైనా ముద్దాడుతా" అన్న కేసిఅర్ మాటలు విననివాళ్ళు వుండరు. సియం కుర్చి కోసం చంద్రబాబు బొంతపురుగునేకాదు నరేంద్ర మోదీ నయినా  ముద్దు పెట్టుకుంటారు.


       ఏ పార్టీలో అయినా దాన్ని మోసేవాళ్ళు, మేసేవాళ్ళు వేరుగా వుంటారు. పదేళ్ళుగా కాంగ్రెస్ ను లొట్టలేసుకుని మేసేసినవాళ్ళు మాత్రమే ఇప్పుడు  ఇతర రాజకీయపార్టీలకు పోతున్నారు. కాంగ్రెస్ ను నమ్ముకున్నఅసంఖ్యాక ప్రజాశ్రేణులు మరీ ముఖ్యంగా దళిత బహుజనులు ఇప్పటికీ కాంగ్రెస్ తోనే వున్నారు.  సినీ హీరో పవన్ కళ్యాణ్ కొత్త పార్టి పెట్టినపుడు, "చిరంజీవికి రక్తంపంచుకు పుట్టిన తమ్ముడు బయటికి పోయినా నష్టంలేదు. కానీ, ఆశయాలు పంచుకునే దళిత, బహుజన సొదరులు చిరంజీవికి కోట్లమంది వున్నారు" అని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్న మాటలు అందరికీ గుర్తుండే వుంటాయి. అవును ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ కు కొత్త ఉత్తేజం చిరంజీవి!. 

No comments:

Post a Comment