Tuesday 1 April 2014

TDP Telangana manifesto

ప్రాణహితకు జాతీయ హోదా

Published at: 01-04-2014 08:34 AM
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): 'తెలంగాణ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. ఆ కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం అందించి. ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని విజ్ఞానాధారిత అభివృద్ధి కేంద్రంగా తీర్దిదిద్దుతాం. సామాజిక తెలంగాణను సాధించే దిశగా బడుగు బలహీనవర్గాలకు అధికారాన్ని అందిస్తాం. బీసీని సీఎం పీఠంపై కూర్చోబెడతాం. సామాజిక స్వర్ణ తెలంగాణ సాధిస్తాం' అని తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం రాత్రి విడుదల చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో హైదరాబాద్ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిని అందుకొందని, దానిని సమర్థంగా మార్కెట్ చేయడం ద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలను, అంతర్జాతీయ పరిశోధనా సంస్థలను ఇక్కడకు తీసుకొస్తామని, తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ వ్యాపార అవకాశాలను సృష్టిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
సామాజిక తెలంగాణ దిశగా..
- తెలంగాణ సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్యోద్యోగం. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై ఉన్న కేసుల ఎత్తివేత.
- పదేళ్లలో 50 లక్షల ఉద్యోగ, ఉపాధి, అవకాశాలను కల్పించే దిశగా విశ్వవిద్యాలయాలు, సంస్థల స్థాపన.
- సిరిసిల్ల పట్టణాన్ని ప్రత్యేక యూనిట్‌గా పరిగణించి చేనేత కార్మికులకు చేయూత.
- సిరిసిల్ల, గద్వాల, బచ్చన్నపేట, పోచంపల్లి, కొత్తకోట, ఘన్‌పూర్, వావిలాల, రాజోలి, పుట్టపాక, నారాయణపేట, రఘుపతిపేట, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆస్పత్రులు, వృద్ధాశ్రమాల ఏర్పాటు.
- భద్రాచలం, వేములవాడ, మేడారం, యాదగిరిగుట్ట, ఏడుపాయలు, బాసర, అలంపూర్, ధర్మపురి, దేవరకొండ, వనపర్తి ప్యాలెస్, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి.
పరిశ్రమల స్థాపనకు పోత్సాహం
- పరిశ్రమలను స్థాపనకు అవసరమైన అనుమతులు సింగిల్ విండో విధానంలో వారం రోజల్లోనే అందే ఏర్పాటు.
- ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు.
- కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం. రైల్వే వ్యాగన్ మరమ్మతుల వర్క్‌షాప్.
- హైదరాబాద్ నుంచి నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానికి, తెలంగాణాలోని ఇతర పట్టణాలకు వేగవంతమైన రైల్, రోడ్డు అనుసంధాన వ్యవస్థ ఏర్పాటు. రామగుండం, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మంలలో మినీ ఎయిర్‌పోర్టుల నిర్మాణం.
- ఆరోగ్య, గిరిజన, హార్టికల్చరల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు.
-తెలంగాణ జిల్లాల్లోని వనరులను గుర్తించి, ఆయా ప్రాంతాలను అభివృద్ధిపరిచేలా పరిశ్రమల ఏర్పాటుకు కృషి.
- ఖమ్మంలో ఉక్కు పరిశ్రమ, హైదరాబాద్‌లో సెమీ కండక్టర్ల పరిశ్రమను అభివృద్ది.
- వ్యవసాయ రంగంలో కీలకంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో పత్తి ఆధారిత పరిశ్రమలు, మొక్కజొన్న, వరి, సోయా మొదలైన పంటల ప్రాసెసింగ్‌కు కావాల్సిన వ్యవసాయాధిత పరిశ్రమల ఏర్పాటు.
- వరంగల్‌ను విద్యా కేంద్రంగా అభివృద్ధి. ఐటీ పరిశ్రమకు ప్రోత్సాహం. మహబూబ్‌నగర్ జిల్లాలో వలసల నివారణకు పరిశ్రమల స్థాపన. కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమల అభివృద్ధి.
నీటిపారుదల రంగం...
- ప్రాణహిత-చేవెళ్ల పథకానికి జాతీయ హోదా సాధనకు కృషి. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తికి హామీ.
- దేవాదుల, ఎల్లంపల్లి సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి వచ్చేలా రాబోయే ఐదేళ్లలో కార్యాచరణ.

No comments:

Post a Comment