Wednesday 2 April 2014

బీసీని సీఎంను చేస్తామన్న టీడీపీను గెలిపించాలి

చంద్రబాబు వల్ల సామాజిక న్యాయం, బీసీని సీఎంను చేస్తామన్న టీడీపీను గెలిపించాలి : ఆర్.కృష్ణయ్య

Published at: 02-04-2014 20:49 PM
వరంగల్, ఏప్రిల్ 2 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వల్లనే తెలంగాణకు సామాజిక న్యాయం జరుగుతుందని, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న టీడీపీను గెలిపించాలని రాష్ట్ర బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్‌లో జరిగిన టీడీపీ ప్రజా గర్జన సభలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ నీతివంతమైన, న్యాయబద్ధమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తప్పకుండా మీ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఒక పార్టీలో ఉండి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి పదవులను సైతం అనుభవించిన వ్యక్తులు ఇవాళ సొంత పార్టీని వదిలి వెళుతున్నారని కృష్ణయ్య విమర్శించారు. బీసీను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన తెలుగుదేశాన్ని పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఓటు వేసి గెలిపించాలని ప్రజాగర్జన వేదిక నుంచి ఆయన పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనం(బీసీలు) కలలు కన్న ముఖ్యమంతి పదవి మన ముందుకు వస్తుందన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పలేదని కృష్ణయ్య ఆరోపించారు. ముఖ్యంగా వరంగల్‌లో పత్తి రైతులు ఎక్కువమంది ఉన్నారని, గిట్టుబాటు ధరలు లభించక చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన వాపోయారు. అలాంటి వారందరికీ గిట్టుబాటు ధరలు వచ్చేలా చూసే భాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే కేవలం పత్తి రైతులకే కాకుండా, ప్రతి రైతుకు గిట్టుబాటు ధరలు రెట్టింపు అయ్యి అందరూ సుఖ సంతోషాలతో ఉండే పరిస్ధితులు ఏర్పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
టీడీపీ అధికారంలకి వస్తే వరంగల్ జిల్లాలో పత్తి ఉత్పతులు, మిల్లులు. ఫ్యాక్టరీలు ఏర్పడి రైతులకే కాకుండా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని కృష్ణయ్య అన్నారు. అనేక అమరవీరుల త్యాగఫలంగా తెలంగాణ వచ్చిందని, ఇప్పుడు మనకి కావాల్సింది సామాజిక తెలంగాణ అని ఆయన అన్నారు. మన పేద వర్గాలు అభివృద్ధి చెందే తెలంగాణ, ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే తెలంగాణ కావాలని, ఇది కేవలం టీడీపీతోనే సాధ్యమవుతుందని, సైకిల్ గుర్తుకే మనం ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment