Tuesday 22 July 2014

కుటుంబానికో లక్షన్నర మాఫీ

కుటుంబానికో లక్షన్నర మాఫీ

Published at: 22-07-2014 03:07 AM
చంద్రబాబు కేబినెట్‌ నిర్ణయం
పంట, బంగారం రుణాలకు వర్తింపు
మార్చి 31 వరకూ తీసుకున్న వారికి లబ్ధి
కౌలు రైతులకు ప్రాధాన్యం
బాకీలు చెల్లించిన వారికీ వర్తింపు
ప్రతి డ్వాక్రా సంఘానికి లక్ష వరకూ మాఫీ
ఆర్‌బీఐతో సంబంధం లేకుండా ప్రభుత్వమే రుణం తీసుకుని పథకాన్ని అమలు చేస్తుంది
ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్ర్కో ఖాతా
ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్‌
ఆదర్శ రైతులపై రేపోమాపో ఆర్డినెన్స్‌
పదోన్నతులు, నియామకాలపై నిషేధం ఎత్తివేత
26 కోట్లతో ధరల నియంత్రణ నిధి
కూరగాయల విక్రయానికి జిల్లాకు 2 వ్యాన్లు
నిర్ణయాలను స్వయంగా వెల్లడించిన బాబు
రుణ మాఫీ పథకానికి ఏపీ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రతి కుటుంబానికీ లక్షన్నర ఊరట కల్పించారు. రూ.లక్ష వరకు డ్వాక్రా రుణాలనూ మాఫీ చేశారు. ఆర్బీఐతో సంబంధం లేకుండా సొంతంగా అమలు చేస్తామన్నారు.
హైదరాబాద్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి రైతు కుటుంబానికీ లక్షన్నర వరకూ వ్యవసాయ రుణాలను, ప్రతి డ్వాక్రా సంఘానికీ లక్ష రూపాయల వరకు రుణాన్ని మాఫీ చేయాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. వ్యవసాయ రుణమాఫీ పథకాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయాలని, కౌలు రైతు బంగారు నగలపై వ్యవసాయ రుణాలు తీసుకుంటే, భూ యజమాని కంటే  కౌలు రైతుకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో జరిగిన కేబినెట్‌ భేటీ వివరాలను సీఎం చంద్రబాబు స్వయంగా విలేకరులకు వెల్లడించారు.  రైతు రుణాలమాఫీ ఈ ఏడాది మార్చి 31లోగా రుణాలు తీసుకున్నవారందరికీ వర్తిస్తుందన్నారు. మొత్తం వ్యవసాయ రుణాల మదింపునకు ఒక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. రుణమాఫీ పథకానికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నివేదికలు, వివిధ గణాంకాలు, ఆధార్‌ కార్డు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేబినెట్‌ తీర్మానించిందని తెలిపారు. చేనేత, షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన రుణాలనూ మాఫీ చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే రైతు, డ్వాక్రాసంఘాల రుణమాఫీపైనే దృష్టిసారించానని, అధ్యయనం కోసం కమిటీని నియమించే ఫైలుపైనే మొదటి సంతకం చేశానని చంద్రబాబు తెలిపారు. అనంతపురం జిల్లా పర్యటన సందర్భంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ, ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో వారిలో ఆత్మస్థయిర్యం పెంచేందుకు వీలుగా రుణమాఫీ పథకాన్ని ప్రకటించానని చంద్రబాబు వివరించారు.
రాష్ట్ర విభజనకు ముందే తాను ఈ హామీని ఇచ్చానని, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, రాష్ట్ర ఖజానా రూ.15,839 కోట్ల లోటులో ఉందన్నారు.  అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం, రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా భావించేలా చేసేందుకు రుణ మాఫీని అమలు చేయాలని నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి గత ఏడాది కరవు, వరదల కారణంగా 572 మండలాల్లో రిజర్వు బ్యాంకు వ్యవసాయ రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉందని చెప్పారు.  ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దెబ్బతిన్న మండలాల్లో రుణాలను రీస్ట్రక్చర్‌ చేస్తే  ఒక ఏడాది మారటోరియం, మరో ఏడేళ్లు రీ-షెడ్యూల్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని బాబు వివరించారు. అందువల్లే తాము ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగిన మండలాల్లో రుణాలు రీస్ట్రక్చర్‌ చేయాలని ఆర్‌బీఐని కోరామని, ఆర్‌బీఐ మాత్రం ఒక ఏడాది మారటోరియం, రెండేళ్లు రీషెడ్యూల్‌ చేసేందుకు సూచనప్రాయంగా సమ్మతించిందని బాబు వివరించారు. అయితే.. తాము మాత్రం ఒక ఏడాది మారటోరియం, ఏడేళ్లు రీషెడ్యూల్‌ చేస్తే, ఐదారేళ్లలో వ్యవసాయ రుణాలన్నిటిని చెల్లిస్తామని రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదించామని తెలిపారు. దీనిపై రిజర్వు బ్యాంకు నుంచి ఎలాంటి సమాచారం రాలేదన్నారు. దీంతో రిజర్వు బ్యాంకు స్పందన కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వమే రుణం తీసుకుని  ఒక ఎస్ర్కో అకౌంట్‌ను ప్రారంభించాలని యోచిస్తోందన్నారు. వ్యవసాయ రుణాల మాఫీపై నాబార్డు మాజీ చైర్మన్‌ కోటయ్య నేతృత్వంలో కమిటీని వేశామని, ఆయనకు ఇచ్చిన 45 రోజుల గడువుకు ఇంకో రెండు రోజులు మిగిలి ఉండగానే నివేదికను అందజేశారని చెప్పారు.
ఆయన తన సిఫారసుల్లో లక్ష రూపాయల వరకూ రుణాలు మాఫీ చేయవచ్చని పేర్కొన్నారని తెలిపారు. దీనివల్ల 67 శాతం మందికి లబ్ధి చేకూరుతుందని బాబు చెప్పారు. అయితే, కేబినెట్‌ మాత్రం ప్రతి కుటుంబానికీ లక్షన్నర వరకూ వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుందని, దీనివల్ల వ్యవసాయ రుణాలు తీసుకున్న వారిలో 96.27 శాతం మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో.. ిఫిస్కల్‌ రెస్పాన్స్‌బిలిటీ అండ్‌ బడ్జెటరీ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనల మేరకు రూ.25 వేల కోట్ల వరకూ రుణం లభిస్తుందని బాబు వివరించారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ కోసం 37,900 కోట్ల వరకూ అవసరం ఉన్నందున ఆ మొత్తాన్ని రుణంగా తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం వనరులు సమీకరించుకుంటామని చెప్పారు. ఆర్థిక వనరులు లభించే రవాణా, మైనింగ్‌, ఎక్సైజ్‌ వంటి శాఖల అదాయాన్ని చూపుతూ రుణం తీసుకుంటామని వివరించారు. రుణమాఫీ పథకం కోసం ప్రత్యేకంగా ఎస్ర్కో అకౌంట్‌ను తెరుస్తామని తెలిపారు. రవాణా,  ఎక్సైజ్‌, మైనిగ్‌ శాఖలలో ప్రత్యేకంగా రైతు సంక్షేమ సెస్‌ను వసూలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు కేవలం బకాయిదారులకు మాత్రమే వర్తించేలా నిర్ణయం తీసుకుందని, కాని.. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించిన వారికీ వ్యవసాయ రుణమాఫీని వర్తింపజేస్తామని చంద్రబాబు చెప్పారు. యూపీఏ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసినప్పుడు నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి దీనిని వ్యతిరేకించారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా తీసుకువెళతామని చంద్రబాబు చెప్పారు.
రుణ మాఫీ పరిమితిపై తర్జనభర్జన
రుణ మాఫీ పరిమితిపై మంత్రివర్గ సమావేశంలో తీవ్రంగా తర్జనభర్జన జరిగింది. రూ. లక్ష వరకూ మాఫీ చేస్తే 85 శాతం రైతులకు మాఫీ ప్రయోజనం అందుతుందని, ఇంతవరకూ చేస్తే సరిపోతుందని కోటయ్య కమిటీ సూచించింది. కాని కొందరు మంత్రులు దీనికి అంగీకరించలేదు. రూ. లక్షన్నర వరకూ చేస్తామని ఇప్పటికే సంకేతాలు పంపామని, దానికి తగ్గడానికి వీలు లేదని మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడు గట్టిగా వాదించారు. ముందు రూ. లక్ష వరకూ చేసి రైతులు సంతృప్తి పడకపోతే పెంచుదామని కొందరు మంత్రులు అన్నారు. మధ్యేమార్గంగా రూ. 1. 25 లక్షలు చేస్తే ఎలా ఉంటుందని నారాయణ అన్నారు. చివరకు చంద్రబాబు రూ. లక్షన్నర వరకూ మాఫీ పైనే మొగ్గు చూపించారు. ‘కొత్త రాష్ట్రం ఆర్థికంగా తీవ్రమైన లోటుతో పుట్టింది. జీతాలు ఇవ్వడానికే వెతుక్కోవాల్సిన పరిస్ధితి.
ఇలాంటి పరిస్ధితుల్లో కూడా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఎంత భారమైనా రుణ మాఫీకి ముందుకు వస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రం ఇంత భారం ఇంతవరకూ మోయలేదు.  దీనిని ప్రజలకు చెప్పండి’ అని చంద్రబాబు మంత్రులను కోరారు. డ్వాక్రా రుణాలపై జరిగిన చర్చలో రూ. లక్ష వరకూ ప్రతి సంఘానికి మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ మాఫీ మొత్తాన్ని విడిగా పక్కనపెట్టి కొత్తగా ఒక బ్యాంక్‌ ఏర్పాటు చేస్తే డ్వాక్రా సంఘాలకు చాలా పెద్ద ఎత్తున సాయం చేయవచ్చని, దాని గురించి ఆలోచించాలని కమిటీ సలహా ఇచ్చింది. లేదా ఈ మొత్తాన్ని ఏదైనా పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే లాభాన్ని ఏటా సంఘాలకు పంపిణీ చేయవచ్చని కూడా కమిటీ పేర్కొంది. కాని డ్వాక్రా సంఘాల అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోరాదని సమావేశం అభిప్రాయపడింది.
‘మనం రుణం మాఫీ చేస్తామని డ్వాక్రా సంఘాలకు చెప్పాం. ముందు అది అమలు చేద్దాం. తర్వాత వారితో మాట్లాడి వారు ఒప్పుకొంటే బ్యాంకు గురించి ఆలోచిద్దాం. లేకపోతే ఆ డబ్బు వారికే ఇచ్చేద్దాం’ అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఈ రెండింటితోపాటు చేనేత, మత్స్యకార తదితర వర్గాల వారి రుణాలు కూడా మాఫీ చేస్తూ సమావేశం నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వానికి కొంతైనా వెసులుబాటు కల్పించడానికి ఒక ఏడాదిపాటు తామంతా అన్ని శాఖల్లో కొత్త పనులు, పధకాలు పెద్దగా తీసుకోకుండా ఖర్చు తగ్గిస్తామని, ప్రజలకు ఈ పరిస్థితిని వివరిస్తామని మంత్రులు చెప్పారు. రైతు రుణ మాఫీ సాధ్యం కాదని వైసీపీ నేతలు జగన్‌ తదితరులు చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు తోసిపుచ్చారు. ‘బడికి పంపే ప్రతి ఆడపిల్లకు నెలకు రూ. వెయ్యి వంతున డిపాజిట్‌ చేస్తానని ఆయన చెప్పిన పధకం అమలు చేస్తే ప్రభుత్వంపై రూ. 40 వేల కోట్ల భారం పడుతుంది. ఆయన చెప్పినవి ఆచరణ సాధ్యం.. ఇతరులు చెబితే కాదా? ఓడిపోయిన బాధతో ఏదో మాట్లాడుతుంటారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment