Monday 30 September 2013

సమైక్య శంఖారావం - JAGAN

హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం

Published at: 01-10-2013 07:40 AM

 New  0  0 

 



ఓట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలే కుమ్మక్కు
లౌకిక పార్టీలకే మా మద్దతు
హిందూత్వ ముసుగు తొలగిచుకుంటే
మోదీతో పొత్తుకు ఆలోచిస్తాం: వైఎస్ జగన్
గవర్నర్‌తో భేటీ, వెంటనే అసెంబ్లీ సమావేశానికి వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 30: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో అక్టోబర్ 15, 20 తేదీల మధ్య హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం పేరిట భారీ సభ నిర్వహిస్తామని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తెలిపారు. తాను ఎక్కడకీ వెళ్లకుండా కట్టడి చేస్తున్నా ప్రజల హృదయాల్లోనుంచి మాత్రం తీసేయలేరని వ్యాఖ్యానించారు. సమైక్యం కోరే పార్టీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. టీడీపీసహా విభజనకు సహకరించిన పార్టీలను ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌తో డీల్‌పై..
కాంగ్రెస్‌తో కుమ్మక్కువల్లే తనకు బెయిల్ వచ్చిందన్న కథనాలను జగన్ కొట్టిపారేశారు. డీల్ జరిగితే మూడు నెలల్లో రావాల్సిన బెయిల్‌కు 16 నెలలు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. తనను ఎక్కువ కాలం జైల్లో ఉంచాలనే చార్జిషీట్లు వేయడానికి సీబీఐ 16 నెలలు తీసుకున్నదని ఆరోపించారు.
లౌకిక వాదానికే మద్దతు..
తాను లౌకిక వాదినని, తమ పార్టీ లౌకికవాద పార్టీలకే మద్దతిస్తుందని చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ హింతూత్వ ముసుగు తొలగిస్తే ఆలోచిస్తామన్నారు. పాలనాదక్షుడిగా మోదీకి మంచి పేరుందని ప్రశంసించారు. అయితే హిందూత్వ ముద్రనుంచి బయటపడాలన్నారు. లౌకికవాదిగా నిరూపించుకోవాలని, ఇతర మతవర్గాల్లో అభద్రత భావాన్ని తొలగించాలని సూచించారు. దేశంలో లౌకికపార్టీలైన కమ్యూనిస్టులు, జనతాదళ్‌లాంటివి కలసివస్తే ఆ దిశగా కూడా ఆలోచిస్తామని చెప్పారు.
అసెంబ్లీలో తీర్మానం చేద్దాం..
సమైక్యంపై తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సత్వరం సమావేశపరచాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ రూపొందక ముందే అసెంబ్లీని సమావేశపరచి సమైక్యంపై తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామన్నారు. దీంతో కేంద్రం కాస్త వెనకడుగు వేస్తుందని చెప్పారు. దీనివల్ల దేశంలోని ఇతర పార్టీలూ కేంద్రంపై ఒత్తిడి తెస్తాయని వివరించారు. కేబినెట్ నోట్ అసెంబ్లీకి వచ్చి న తర్వాత చర్చిస్తే ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమైక్యతపై వైసీపీ, సీపీఎం, ఎంఐఎం మినహా మిగతావి నిజాయతీ, నిబద్ధతతో పనిచేయడంలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయిస్తే.. టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ఓట్లు, సీట్ల కోసమే అన్నట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఓ తండ్రికి కూతురు, కొడుకు ఉంటే వారిలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని, భవిష్యత్‌లో వారెప్పుడూ ప్రశ్నించకుండా వ్యవహరించాలని సూచించారు. న్యాయం చేయలేకపోతే వదిలేయాలన్నారు.
విడిపోతే సమస్యలు..
రాష్ట్రం సమైక్యంగా ఉనప్పుడే నదీజలాల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉంటే.. మరో రాష్ట్రం ఏర్పడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని వ్యాఖ్యానించారు. విభజిస్తే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 8జిల్లాలు.. కృష్ణాజలాల కోసం కొట్టుకుంటాయని వివరించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ మంచి నీరు దొరికే పరిస్థితి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామంటున్నారని, దానికి నీళ్లెలా వస్తాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి 50 శాతం బడ్జెట్ వస్తుంటే.. దాన్ని వదిలిపెట్టి పోయి మరో నగరాన్ని కట్టుకోవాలని అడ్డగోలుగా చెప్పడం ఏమిటని మండిపడ్డారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణలోని ప్రతి సోదరుడికి తాను వివరించగలనన్నారు. ఇది చేసి చూపించిన సత్తా వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని చెప్పారు. తెలంగాణను అభివృద్ధిచేసే లక్ష్యంతోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వైఎస్ రూపకల్పన చేశారని చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం ప్రజలు రోడ్డెక్కి తమకు అన్యాయం జరిగిందంటూ 60 రోజులుగా ఉద్యమిస్తుంటే కేంద్రానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
అంతా ప్రజలకు తెలుసు..
కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని తనవైపు వేలు చూపిస్తున్నారని.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ప్రజలు గమనించాలని జగన్ కోరారు. తనపైనా, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపైనా కాంగ్రెస్‌కు చెందిన శంకర్రావు కేసు వేస్తే.. దానికి మద్దతుగా టీడీపీ నేతలు పిటిషన్లు దాఖలు చేశారని గుర్తు చేశారు. కాంగెస్ర్, టీడీపీ కుమ్మక్కై తనపై సీబీఐ దర్యాప్తు జరిగేందుకు కారణమైనట్లు జగన్ ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వాన్ని చంద్రబాబే కాపాడారని గుర్తు చేశారు. ఎఫ్‌డీఐలకు సంబంధించి రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడితే తన పార్టీ ఎంపీలను చంద్రబాబు హాజరు కానివ్వలేదన్నారు. రాష్ట్ర విభజన చేస్తుంటే లేఖ ఇచ్చి మౌనంగా కూర్చున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

- See more at: http://www.andhrajyothy.com/node/5748#sthash.o0GTjgU5.dpuf

No comments:

Post a Comment