Sunday 15 September 2013

సొంత ఎజెండా ఉండాలి (BC Issue)

సొంత ఎజెండా ఉండాలి

September 15, 2013
హన్మకొండ, సెప్టెంబర్ 14: బీసీల్లో ఎంతసేపు పార్టీల జెండాలను మోసే తత్వం మారాలనీ, సామాజికంగా, ఆర్థికంగా అభ్యున్నతిని సాధించేందుకు, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేందుకు తమదైనా సొంత ఎజెండాతో ముందుకుసాగాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ ఎంఎన్ రావు పిలుపు నిచ్చారు. శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలో 'బీసీల ఆత్మగౌరవసభ-బీసీ డిక్లరేషన్' పేరుతో ఏర్పాటుచేసిన రెండురోజుల జాతీయస్థాయి సమావేశం ప్రారంభమయింది. ముఖ్యఅతి«థిగా హాజరైన జస్టిస్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ 'బీసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసమానతలకు గురవుతున్నారు. వారికి అన్నింట్లో అన్యాయమే జరుగుతోంది. ఇవన్నీ తొలగిపోవాలంటే మౌలికంగా వారి మనస్తత్వంలోనే మార్పులు రావాలి. ఎప్పుడు ఇతరుల జెండాలు మోయడంకాదు. ఇక నుంచి వాటిని పక్కనబెట్టి తమదైన స్వంత ఎజెండాతో ముందుకుసాగాలి' అని అన్నారు. బీసీల సమస్యలు తీరాలంటే వారు రాజ్యాధికారం సాధించుకోవడం ఒక్కటేమార్గం అన్నారు. మొత్తం జనాభాలో నూటికి 75 శాతం మంది బీసీలే ఉన్నా రాజ్యాధికారం దక్కకపోవడం విచారకరం అన్నారు.

బీసీల్లో గొప్ప నాయకులు లేకపోవడమే ఇందుకు కారణం అని అభిప్రాయపడ్డారు. బీసీలకు ప్రత్యేక పార్టీ అంటూ లేకపోవడం కూడా పెద్దలోటు అన్నారు. భారత రాజ్యాంగ సవరణలకు సూచనలు చేయడానికి కమిటీ వేసినప్పుడు అసలు జనరల్ ఎన్నికలనే తీసివేయాలని సిఫార్సుచేస్తూ పేపర్ సర్క్యులేట్ చేయడం ఈ కుట్రలో భాగమేని గుర్తు చేశారు. అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ దీనిని సకాలంలో గుర్తించబట్టి సరిపోయింది. లేకుంటే పెద్దప్రమాదమే జరిగేదన్నారు. న్యాయవ్యవస్థలోనూ బీసీలకు అన్యాయమే జరుగుతోందన్నారు. జడ్జీల నియామకానికి పార్లమెంట్, అసెంబ్లీల ఆమోదం లేకపోవడం విచారకరం అని జస్టిస్ రావు అన్నారు. సామాజిక అధికార వేదిక అధ్యక్షుడు డాక్టర్ పి. వినయకుమార్ మాట్లాడుతూ మీడియా రంగంలోని కీలక హోదాల్లో 90 శాతం మంది బీసీలే ఉన్నా వారి ఉద్యమానికి ఆ స్థాయిలో ప్రచారం లేదని విచారం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతల అభివృద్ధి, సాధికారత సంస్థ (ఏబీసీడీ ఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. మురళీమనోహర్ సభకు అధ్యక్షత వహించారు.

దేశంలోని 54శాతం పైగా ఉన్న బీసీలకు స్వాతంత్ర ఫలితాలు, ప్రజాస్వామ్య ఫలాలు ఏ మేరకు అందాయి? రాజ్యాంగబద్ధంగా లభించిన హక్కులు ఎవరు అనుభవించగులుతున్నారు? ఇంత వరకు జరిగిన అభివృద్ధిలో అసలు లబ్ధిదారులెవరు? అందులో బీసీల వాటా ఎంత? అన్న అనేక విషయాలపై నిర్మొహమాటంగా చర్చించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ ప్రయత్నంలో భాగమే ఈ బీసీ డిక్లరేషన్ సభ అని తెలిపారు. తొలుత జోతిరావు పూలే విగ్రహానికి జస్టిస్ రావు పూలమాలవేసి నివాళులర్పించారు. సభకు వివిధ ప్రాంతాల నుంచి మేధావులు, విద్యావేత్తలు, వివిధ బీసీ సంఘాల నాయకులు, సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

No comments:

Post a Comment