Friday 30 May 2014

పోలవరంపై ఎందుకీ రచ్చ?

పోలవరంపై ఎందుకీ రచ్చ? -టి. లక్ష్మీనారాయణ

Published at: 30-05-2014 00:52 AM
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 'షాక్' ఇచ్చింది. పోలవరంపై నిప్పు పెట్టి, లబ్ధి పొందాలని కొన్ని రాజకీయ పార్టీలు తాపత్రయపడడం తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాలకు అత్యంత హానికరం. గోదావరి పరీవాహక ప్రాంతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. గోదావరి నదీ జలాల వివాద ట్రిబ్యునల్ మూడు వేల టీఎంసీల నికరజలాలు లభిస్తాయని అంచనా కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1480 టీఎంసీలను కేటాయిస్తూ 1980లో ప్రకటించింది. ఇప్పటి వరకు మనం దాదాపు 800 టీఎంసీలను మాత్రమే ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకున్నాం. ఇంకా 700 టీఎంసీల నికర జలాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఫలితంగా ప్రతి ఏడాదీ వరద నీటితో కలిపి సగటున 3వేల టీఎంసీల నీరు సముద్ర గర్భంలో వృధాగా కలిసిపోతున్నది. వరదలొచ్చినప్పుడు లక్షలాది ఎకరాలలో పంటలు నీటిపాలైపోతున్నాయి. ప్రాణనష్టం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వరదల వల్ల జరుగుతున్న నష్టాన్ని నివారించవచ్చు. సమృద్ధిగా ఉన్న నీటిని కరువు పీడిత ప్రాంతాలకు తరలించడం ద్వారా తెలుగు జాతి సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుంది. దేశ ఆహార భద్రతకు ఉపకరిస్తుంది.
ఈ లక్ష్యాలకు అనుగుణంగా నిర్మించ తలపెట్టిన ఇందిరాసాగర్ (పోలవరం) బహుళార్థ సాధక ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం అంటే జాతి ప్రయోజనాలకు విఘాతం కల్గించడమే. ప్రజల ఏడు దశాబ్దాల చిరకాల వాంఛ పోలవరం. ఈ ప్రాజెక్టు ద్వారా బహుళ ప్రయోజనాలు సమకూరుతాయి. ధాన్యాగారమైన కృష్ణ, గోదావరి డెల్టాకు సాగునీటి సరఫరాలో తరచూ ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి. వర్షా కాలంలో ఉధృతంగా ప్రవహించే గోదావరి నదిలో తరువాత కాలంలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ధవళేశ్వరం, విజ్ఞేశ్వరం ఆనకట్టలు 10.50 లక్షల ఎకరాలున్న గోదావరి ఆయకట్టుకు పంట కాలం మొత్తానికి నీరందించలేని దుస్థితి నెలకొన్నది. పోలవరం వంటి పెద్ద రిజర్వాయరు నిర్మాణం ద్వారా మాత్రమే ఆయకట్టుకు రక్షణ కల్పించవచ్చు. ప్రాజెక్టు నమూనాలో మార్పులు చేసి, జలాశయం ఎత్తును తగ్గించడం ద్వారా ముంపు ప్రాంతాలను తగ్గించాలని ప్రాజెక్టును వ్యతిరేకించే శక్తులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. నమూనాలో మార్పులు చేస్తే ప్రాజెక్టు మౌలిక లక్ష్యాలే దెబ్బతింటాయి. ప్రస్తుత ప్రాజెక్టు నమూనానే అత్యుత్తమమైనదని నిపుణుల కమిటీ, అలాగే కేంద్ర జల సంఘం వేరువేరుగా లోతైన అధ్యయనం చేసి నివేదికలిచ్చాయి. సుప్రీం కోర్టు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు అనుగుణంగానే ఉన్నదని చెప్పింది.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలలో 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ప్రస్తుతం కృష్ణా నదీ జలాల ఆధారంగా సాగులో ఉన్న కృష్ణా డెల్టా ఆయకట్టుకు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు 80 టీఎంసీల గోదావరి నీటిని సరఫరా చేసి, కర్ణాటక, మహారాష్ట్రల వాటా 35 టీఎంసీలు పోను మిగిలిన 45 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకొనే అవకాశం ఇచ్చింది. నీటి ఎద్దడితో సతమతమవుతున్న రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లా, తెలంగాణ ప్రాంతంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ (29), హంద్రీ-నీవా (40), గాలేరు-నగరి()38), వెలుగొండ (43.5), నెట్టెంపాడు (20 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు), యస్.యల్.బి.సి. (30 టీఎంసీలు) ప్రాజెక్టులకు కావలసిన మొత్తం 225.5 టీఎంసీల నీటి అవసరాలలో కొంతమేరకైనా నికర జలాలను కేటాయించి సద్వినియోగం చేసుకోవచ్చు. తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో చౌకగా 960 మెగావాట్ల జల విద్యుదుత్పాదన చేసుకోవచ్చు. విశాఖపట్నానికి మంచినీరు, ఉక్కు పరిశ్రమ అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయాలని కూడా నిర్దేశించుకోవడం జరిగింది. వీటన్నింటినీ ప్రాంతీయ కోణం నుంచి పాక్షిక దృష్టితో చూసి, వ్యతిరేకించడం ఏమాత్రం సమంజసం కాదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయి. జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డడం తెలుగు జాతి ప్రయోజనాలకు హాని కల్పించడమే అవుతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 38,186 హెక్టార్లు, ఛత్తీస్‌గఢ్‌లో 1,637 హెక్టార్లు, ఒడిశాలో 1,182 హెక్టార్ల భూములు, వాటిలో భాగంగా 3,267 హెక్టార్ల అటవీ ప్రాంతం ముంపునకు గురవుతుందని అంచనా వేశారు. ఖమ్మం జిల్లాలో 205 గ్రామాలు, 34,143 కుటుంబాలకు చెందిన 1,40,275 మంది జనాభా, పశ్చిమగోదావరి జిల్లాలో 42 గ్రామాలు, 6,959 కుటుంబాలు, 25,026 మంది జనాభా, తూర్పుగోదావరి జిల్లాలో 29 గ్రామాలు, 3,472 కుటుంబాలు, 11,874 మంది జనాభా నిర్వాసితులవుతారని అంచనా వేశారు. వీరిలో 45 శాతానికి పైగా గిరిజనులే కావడం గమనార్హం. అందువల్ల ప్రత్యేక దృష్టితో మెరుగైన సహాయ, పునరావాస పథకాన్ని రూపొందించి అమలు చేయాలి. ప్రాజెక్టు ద్వారా సమకూరే ప్రయోజనాలను అనుభవించడంలో నిర్వాసితులే మొదటి లబ్ధిదారులు కావాలి. ప్రాజెక్టు నిర్మాణం జరిగే ప్రాంతం పరిధిలోనే చట్టబద్ధంగా ముంపు ప్రాంతాలుంటే నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించడంలోను, మెరుగైన సహాయ, పునారావాస కార్యక్రమాలను చేపట్టడానికి సౌలభ్యంగా ఉంటుంది. అప్పుడే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవరోధాలు ఉండవు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఈ పూర్వరంగంలో తెలుగు నాట ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకాలు మోపాలనే దురుద్దేశాలున్న పేచీకోరులకు ఆ అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం స్వాగతించదగ్గ చర్య. అలాగే ప్రాజెక్టు నిర్మాణం మూలంగా నిర్వాసితులయ్యే ప్రజానీకానికి, ప్రత్యేకించి సామాజికంగా వెనుకబడ్డ గిరిజనులకు ముందుగానే మెరుగైన సహాయ, పునరావాస పథకాన్ని నిబద్ధతతో అమలుచేయడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించి, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు మార్గాన్ని సుగమం చేయాలి.
గిరిజనుల నామస్మరణ చేస్తూ పోలవరాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలను 2009, 2014 ఎన్నికల్లో ముంపు ప్రాంతాల ప్రజలు ఆదరించలేదనే విషయాన్ని కూడా గమనించాలి. దాన్ని బట్టి గిరిజనులు ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, పేదరికంలో మగ్గిపోతూ అనాగరికులుగా బ్రతుకువెళ్ళదీస్తున్న గిరిజనులు మెరుగైన జీవనాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో వారి నివాస ప్రాంతాలున్నాయి, ఎవరి పాలనలో ఉన్నామన్న దానికంటే వారి భవిష్యత్తుపైన ఆందోళన చెందుతున్నారు. ఆ మౌలిక సమస్యను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. భూములు కోల్పోయిన వారికి ప్రాజెక్టు ఆయకట్టు క్రిందనే భూములు సేకరించి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించడం ద్వారా వారి జీవనోపాధికి భంగం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. చేతి వృత్తుల వారికి, గ్రామీణ సేవారంగంలో ఉపాధి పొందుతున్న అసంఘటిత కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. విద్య, వైద్య, రహదారులు, రక్షిత మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. గిరిజనుల చరిత్ర, సాంప్రదాయాల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి న్యాయబద్ధమైన కోర్కెల సాధన కోసం ఎవరైనా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించి, ప్రజల విస్తృత ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడాలి.
-టి. లక్ష్మీనారాయణ

No comments:

Post a Comment