Monday 26 May 2014

25 జిల్లాలతో నవ్యాంధ్ర!

25 జిల్లాలతో నవ్యాంధ్ర!

Published at: 26-05-2014 04:25 AM
ప్రతి లోక్‌సభ నియోజకవర్గం.. ఓ జిల్లా
పార్టీ ఎంపీలతో బాబు టాస్క్
టీడీపీపీ భేటీకి ఎస్పీవై రెడ్డి హాజరు..
న్యూఢిల్లీ, మే 25 : కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 25కు పెంచేందుకు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. దీనికోసం సీమాంధ్రలో గల 25 పార్లమెంటు స్థానాలను.. 25 జిల్లాలుగా మార్చాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఏపీ భవన్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశంపై ఎంపీలందరి అభి ప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొత్త రాష్ట్రానికి, కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు సాధించేందుకు, రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ ఎంపీలను ఆయన కార్యోన్ముఖుల్ని చేశారు. పార్టీకి చెందిన 22 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను నాలుగైదు బృందాలుగా ఏర్పాటు చేస్తానని, వీరికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గాను ఒక్కో అధికారుల టీమ్‌ను జత చేస్తానని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖల వారీగా ఈ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి కావల్సిన నిధులను రాబట్టాల్సి ఉంటుందని, సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు.
ప్రతి వారం తాను బృంద ప్రగతిని సమీక్షిస్తానని వెల్లడించారు. వారంలో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోను, రెండు రోజులు హైదరాబాద్‌లోను, మిగతా రెండు రోజులు ఢిల్లీలోనూ ఉంటానని ఆయన ఎంపీలకు చెప్పారు. అంతా ఐకమత్యంగా పని చేసి కొత్త రాష్ట్రానికి వీలైనన్ని నిధులు రాబట్టుకోవాలని హితవు పలికారు. ఆదివారం రాత్రి ఏపీ భవన్‌లోని గురజాడ హాలులో చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీపీపీ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. ఆదివారమే పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ అనంతరం చిత్తూరు ఎంపీ ఎన్ శివప్రసాద్ మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రస్తుతానికి ఒక్క కేబినెట్ పదవిని మాత్రమే టీడీపీకి ఇచ్చినందున దానిని అశోక్ గజపతిరాజుకు కేటాయిస్తున్నట్లు అధినేత చెప్పారన్నారు. రాబోయే కాలంలో మరిన్ని పదవులు వచ్చే అవ కాశముందని, అప్పుడు మళ్లీ ఎంపీలందరినీ సంప్రదించి వాటిని ఎవరికి కేటాయించాలో నిర్ణయిస్తానని తెలిపారన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని పార్టీని గెలిపించారని, కాబట్టి వారి ఆశలకు సరిసమానమైన రీతిలో అంతా కష్టపడి పని చేయాలని ఆదేశించారని చెప్పారు.
ప్రజల సంతృప్త స్థాయి 80 శాతం ఉండేలా ఎంపీలు పనిచేయాలని కోరారన్నారు. ఏఏ పథకాలకు ఏఏ రకంగా నిధులు తీసుకురావాలో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు సాధించాలని సూచించారని చెప్పారు. తాను కూడా ప్రతి వారం ఎంపీల పనితీరును సమీక్షిస్తానని వెల్లడించారన్నారు. టీడీపీపీ నాయకుడి ఎంపిక గురించి చర్చించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో తమలో చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ ఎంపీలుగా మాత్రం తొలిసారి ఎన్నికయ్యామని, ఈ నేపథ్యంలో తమకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఐటీ, ఫార్మా తదితర రంగాలకు చెందిన పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయని, వీటిని కూడా సీమాంధ్రకు తీసుకొచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కింది వచ్చిన పన్ను రాయితీలను ప్రచారం చేసి వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలు అ క్కడ ఏర్పడేలా చేయాలని చెప్పారన్నారు. 'బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలని పేర్కొన్నారని, దీనిపై మీరేమంటా'రని చంద్రబాబు తమను అడిగారని చెప్పారు. ఎక్కువ జిల్లాలు ఉంటే ఎక్కువ యంత్రాంగం ఉంటుందని, అభివృద్ధిపై దృష్టి కూడా ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ఈ ప్రతిపాదన మంచిదని ఎంపీలంతా చెప్పామన్నారు. ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్‌గా సతీశ్ చంద్రను నియమించినట్లు చంద్రబాబు చెప్పారన్నారు.
టీడీపీ విజయం తెలుగు జాతికి అంకితం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఈ నెల 27,28 తేదీల్లో నిర్వహించే మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ పార్టీ నేత టీడీ జనార్దన్ చెప్పారు. ' పేదరికం లేని సమాజం, అన్నగారి కల, బాబు ఆశయం ' నినాదంతో ఈ మహానాడును నిర్వహిస్తున్నామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పొందిన విజయాన్ని మహానాడులో తెలుగుజాతికి, కార్యకర్తలకు అంకితమిస్తామని తెలిపారు. అవినీతి రహిత భారతదేశ నిర్మాణం, పేదరికం లేని సమాజం, సంస్థాగత విషయాలు, విదేశాంగ విధానం తదితర అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడతామని చెప్పారు. టీడీపీని జాతీయ పార్టీగా మార్చడం.. రెండు ప్రాంతాలకు ప్రత్యేక కమిటీలు వేయడంపై చర్చిస్తామని చెప్పారు. మహానాడుకు దాదాపు 25 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని చెప్పారు. మహానాడుకు కార్లు, బస్సులు, వ్యాన్లలో వచ్చే వారికే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో, రైళ్లల్లో వచ్చే వారికి రవాణా, వసతి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతినిధులందరికీ ఒత్తిడి లేకుండా భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీడీపీ కార్యక్రమాలు, ముఖ్యంగా పాదయాత్ర ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహానాడు సందర్భంగా ఆరుగురు సాహితీవేత్తలకు పురస్కారాలు అందిస్తామన్నారు.

No comments:

Post a Comment