Wednesday 28 May 2014

ఎన్టీఆర్‌కు భారతరత్న!

Published at: 29-05-2014 03:36 AM
మహానాడులో ఏకగ్రీవ తీర్మానం
జాతీయ పార్టీగా తెలుగుదేశం
భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
రాజకీయ, విదేశాంగ తీర్మానాలకు ఆమోదం
హైదరాబాద్, మే 28 : చరిత్ర ఉన్నంత వరకూ తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా గుర్తుండే వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయనకుభారత రత్న ప్రకటించాలని మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ విషయాన్ని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మహానాడు సందర్భంగా మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఇందులో టీడీపీని జాతీయ పార్టీగా ఆమోదిస్తూ రాజకీయ తీర్మానం కూడా చేశారు.
జాతీయ పార్టీగా తెలుగుదేశం
టీడీపీ ఇక జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనుంది. రాష్ట్ర స్థాయి సమస్యలతోపాటు జాతీయ సమస్యలపైనా పోరాటం చేయనుంది. ఇందులో భాగంగా, పార్టీని జాతీయ స్థాయికి తీసుకు పోవాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు మహానాడు ముగింపు సందర్భంగా టీడీపీని జాతీయ పార్టీగా ఆమోదిస్తూ బుధవారం తీర్మానం చేశారు. దీనిని పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఆవిర్భావమే జాతీయ సమగ్రత, పేదల సంక్షేమం అన్న ప్రధాన లక్ష్యాలతో జరిగిందని, మొదట్నుంచీ జాతీయ భావాలున్న ప్రాంతీయ పార్టీ టీడీపీ అని వివరించారు. ఎన్టీఆర్ అడుగు జాడల్లో పార్టీని నడిపి, దేశం పట్ల మరింత బాధ్యతాయుతంగా పార్టీని తీర్చిదిద్దుతామని చెప్పారు. జాతీయ భావాలున్న కారణంగానే అంతర్జాతీయ విధానాలు, విదేశాంగ విధానంలో ముందు నుంచి స్పష్టమైన అవగాహనతో పని చేస్తోందని తెలిపారు. జాతీయ పార్టీకి ఉండాల్సిన అన్ని రకాల సాధన సంపత్తి, బలం, బలగం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పారు. జాతీయ పార్టీగా గుర్తింపునకు కావాల్సిన ఓట్ల శాతాన్ని సాధించగల సామర్థ్యం టీడీపీకి ఉందన్నారు.
విదేశాంగ విధానం.. తెలుగుదేశం పాత్ర!
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ స్పష్టం చేసింది. దేశ సంక్షేమంతోపాటు రాష్ట్ర సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు మహానాడు 'విదేశాంగ విధానం - తెలుగుదేశం పాత్ర' అనే తీర్మానాన్ని ఆమోదించింది.
శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు!
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరు పెట్టిస్తామని మహానాడు వేదికగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలోనే శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసిందని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడు మార్పిస్తామని స్పష్టం చేశారు. వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు అంతకు ముందు మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేలా కేంద్ర మంత్రిగా నియమితులైన అశోక్ గజపతి రాజు చొరవ తీసుకోవాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరారు. ఆయన వినతికి ప్రతిస్పందనగా తప్పకుండా కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత శంషాబాద్ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్రం పరిధిలోకి వస్తున్న సంగతి తెలిసిందే. సీమాంధ్రలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం పేరును మార్పిస్తామని అనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No comments:

Post a Comment