Saturday 31 May 2014

జయ జయహే తెలంగాణ..

జయ జయహే తెలంగాణ..

Published at: 31-05-2014 04:44 AM
తెలంగాణ తల్లికి మాలిక.. నాలుగు చరణాల గీతిక!
రాష్ట్ర గీతంగా అందెశ్రీ పాట.. కొన్ని మార్పులు చేసిన కేసీఆర్
జూన్ 2 నుంచి అమల్లోకి.. టీ-స్కూళ్లలో నిత్య పారాయణం
హైదరాబాద్, మే 30 : ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ రచించిన 'జయ జయహే' గీతం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపికయింది. తెలంగాణ స్కూళ్లలో ఉదయ గీతంలా ఇప్పటికే ప్రసిద్ధమయిన ఈ పాట.. జూన్ రెండు నుంచి తెలంగాణ ప్రభుత్వ అధికారిక గేయంగా ప్రతి గొంతులో పలకనుంది. తెలంగాణ చరిత్ర, వర్తమానాలను బొమ్మగట్టి.. భవిష్యత్తుపై అంతులేని ఆశ్వాసాన్ని ప్రకటించిన ఈ గీతం 11 చరణాలతో రూపొందింది. ఇందులోని నాలుగు చరణాలను ఎంచుకొని రాష్ట్ర గీతంగా పాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీ ఆర్ స్వతహాగా సాహిత్యాభిలాషి కావడంతో, ఆయన పర్యవేక్షణలోనే ఈ గీతానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. మారిన పరిస్థితుల్లో ఆయన కొన్ని సవరణలను చేశారు. అందెశ్రీ రాసిన నాటికి తెలంగాణ పది జిల్లాలతో ఉంది. అయితే, ఆ సంఖ్యను 24 జిల్లాలకు పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారు. దానికి అనుగుణంగా గేయంలో మార్పు చేశారు. ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ గీతంతోనే సంబురాలు మొదలు కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర గీతం
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది (24) జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
జానపద జ నజీవన జావళీలు జాలువార
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగ
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
పాట పలికిందిలా..
మలిదశ తెలంగాణ ఉద్యమానికి 14 ఏళ్లు నిండిన సందర్భంగా 2012లో తెలంగాణ అంతటా కళా జాతాలు సాగాయి. రసమయి బాలకిషన్ సారథ్యంలో పల్లెపల్లె ఉద్యమ గీతాలతో పరవశించింది. ఉద్యమ కేంద్రాలు, వేదికలు పాటలతో పదునెక్కాయి. ఈ క్రమంలోనే అందెశ్రీ 'జయ జయహే' గీతం రచించారు. రసమయి 'ధూంధాం' కార్యక్రమం కోసం ఆయన ఈ పాటనను 2012 సెప్టెంబర్ 30న పాడారు. తెలంగాణ రచయితల వేదిక సభల్లో ఇది పతాక గీతంగా మారింది. అప్పటినుంచీ అనధికారికంగా తెలంగాణలోని ప్రతి బడిలోనూ ఉదయంపూట ఈ పాటని ఆలపిస్తున్నారు.
ఆ గౌరవం ఉద్యమానికే : అందె శ్రీ
"తెలంగాణ రాష్ట్ర గీతంగా నా పాటకు గౌరవం దక్కడం సంతోషంగా ఉంది. నిజానికి, నా కన్నా ముందుగా తొలుత ఉద్యమానికి, ఆ తరువాత ఉద్యమ శక్తులకు, నా పాటను రోజూ పాడే బడి పిల్లలకు, ఉద్యమ పార్టీ టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు, జయశంకర్‌కు ఈ గౌరవం దక్కుతుంది. చివరిగా నాకు చెందుతుంది. ఈ పాట పూర్తి చేయడానికి నాకు ఏడేళ్లు పట్టింది. 10 వేల సంవత్సరాల చరిత్రని చెప్పే ప్రయత్నం చేశాను. ఇదొక చారిత్రక గీతం!''
'ఆం«ధ్రజ్యోతి'లో తొలి ముద్ర
తెలంగాణ గీతంగా 'జయ జయహే తెలంగాణ' చాలాకాలంగా ప్రజల నాలుకలపై నర్తిస్తోంది. 11 చరణాల ఈ గీతాన్ని మొట్టమొదటిసారిగా 'ఆంధ్రజ్యోతి' పత్రికే 2009 డిసెంబర్ 6న ప్రచురించింది.

No comments:

Post a Comment