Thursday 1 August 2013

సీతారాముడు సీమాంధ్రుడే!!!

సీతారాముడు సీమాంధ్ర వాడే?

August 02, 2013
ఖమ్మం, ఆగస్టు 1: భద్రాద్రి రాముడు సీమాంధ్రలో కొలువుదీరబోతున్నాడు! ఇన్నాళ్లూ తెలంగాణలో పూజలందుకున్న సీతారాముల పుణ్యక్షేత్రం ఆ ప్రాంతానికే దక్కబోతోంది. తమకు 1956లో ఆంధ్ర రాష్ట్రంలో కలిసిన తెలంగాణే కావాలని ఆ ప్రాంత నేతలు కోరుతున్న నేపథ్యంలో ఈ మార్పు జరిగే అవకాశముంది. మరోవైపు భద్రాచలం తమకే కావాలని సీమాంధ్ర నేతలు కోరుతుండటంతో కేంద్రం ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. గతంలో భద్రాచలం డివిజన్ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భాగంగా ఉండేది. అయితే రవాణా, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా దీన్ని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కలిపారు.

తాజాగా రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. బ్రిటీష్ పాలన అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం, నూగూరు తాలుకాలు కలిసి ఉండేవి. కాకినాడ కేంద్రంగా జిల్లా ఉండడంతో భద్రాచలం, వెంకటాపురం ప్రాంత ప్రజలు కాకినాడ వెళ్లి రావాలంటే వారం రోజులు పట్టేది. లాంచీలపైన వెళ్లి వచ్చే వారు. జిల్లా కేంద్రంలో పనులు చూసుకుని రావాలంటే తీవ్ర కష్టమయ్యేది. కాకినాడుకు సరైన రవాణా సౌలభ్యం లేక ఇక్కడి గిరిజనులు, రైతులు, ఉద్యోగులు, కోర్టుకు వెళ్లే కక్షిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దీంతో పరిపాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు పట్టుబట్టారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 17, 1959న నోటిఫికేషన్ నెంబర్ 533 ద్వారా భద్రాచలం రెవెన్యూ డివిజన్ ప్రాంతాన్ని ఖమ్మంకు బదిలీ చేసింది. నవంబర్ 30న భద్రాచలం డివిజన్ ఖమ్మం జిల్లాలో విలీనమైంది. దీనికితోడు 1965లో గోదావరిపై నిర్మించిన వారధి తర్వాత తెలంగాణ ప్రాంతంతో భద్రాచలం డివిజన్ పూర్తిగా అనుసంధానమైంది. వాజేడు మండలంలోని పేరూరు నుంచి వీఆర్ పురం మండలం కొల్లూరు పాపికొండల వరకు సుమారు 280 కి.మీ. వైశాల్యంతో ఈ డివిజన్ ఉంది.

ఇది ఛత్తీస్‌గఢ్, ఒడిసా రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. పుణ్యక్షేత్రంతో పాటు గోదావరి, శబరి, సీలేరు, తాలిపేరు జలసంపద, అటవీప్రాంతం, పలు ఖనిజ వనరులు, సారవంతమైన భూములు భద్రాచలం డివిజన్‌లో ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ డివిజన్‌ను తమకే ఇవ్వాలని సీమాంధ్ర నేతలు కోరుతున్నారు. అయితే ఏ ప్రాంతంతో కలవాలన్న దానిపై ఇక్కడి వారిలో గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీకృష్ణ కమిటీ విచారణ సమయంలో కొందరు తెలంగాణలోనే ఉంచాలని, మరికొందరు ఆంధ్రాలో కలపాలని సూచించారు. అయితే గిరిజన సంఘాల నాయకులు మాత్రం భద్రాచలం కేంద్రంగా మన్యసీమ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment