Thursday 15 August 2013

Anthony కమిటీకి ఏం చెబుదాం!?

కమిటీకి ఏం చెబుదాం!?

August 16, 2013
హైదరాబాద్, ఆగస్టు 15: సీమాంధ్ర సమస్యలేమిటి!? ఆంటోనీ కమిటీకి ఏయే అంశాలను నివేదించాలి!? రాష్ట్ర విభజన ప్రకటన, సీమాంధ్రలో ఆందోళనలు, ఆంటోనీ కమిటీ ఏర్పాటు నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి!? తదితర అంశాలపై చర్చించేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో శనివారం సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. సీఎం కిరణ్ అధ్యక్షతన సీమాంధ్ర నేతలతో భేటీ కానున్నామని పీసీసీ చీఫ్ బొత్సతోపాటు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తెలిపారు.

సమావేశంలో ఆంటోనీ కమిటీకి నివేదించాల్సిన సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని సత్తిబాబు చెప్పారు. అయితే, సమావేశంలో కఠిన నిర్ణయాలేవీ ఉండకపోవచ్చని పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు వివరించారు. కాగా సమావేశ అజెండా తదితర అంశాలు శుక్రవారం నాటికి వెల్లడయ్యే అవకాశాలున్నాయని కొందరు సీనియర్ మంత్రులు చెబుతున్నారు. నిజానికి, గత నెల 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఇదే వేదికపై సీఎం, పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలోనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనంటూ ఏకవాక్య తీర్మానం చేశారు. దానిపై సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ సత్తిబాబు కూడా సంతకాలు చేశారు.

ఆ తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా అధిష్ఠానం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో ప్రజలు ఉద్యమ పథంలో సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ అధిష్ఠానం ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు సత్తిబాబు ఇటీవల ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. గురువారం రాత్రి కేంద్రమంత్రులు ఆంటోనీ కమిటీతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆంటోనీ కమిటీ మనసులోని భావాలను సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు సత్తిబాబు వివరించే అవకాశాలున్నాయి. అయితే, సీమాంధ్రకు చెందిన కొందరు సీనియర్ నేతలు హైదరాబాద్ విషయంలో మరింత పట్టుబడుతూనే విభజన అంశంపైనా దృష్టి సారించాలని భావిస్తుంటే.. మరికొందరు నేతలు మాత్రం రాష్ట్ర విభజన విషయంలో గట్టి పట్టు పట్టాలని, అధిష్ఠానం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేవరకు పోరాటం ఆపేందుకు వీల్లేదని స్పష్టం చేస్తున్నారు.

అవసరమైతే సీఎం, పీసీసీ చీఫ్ కూడా రాజీనామా చేసేలా ఒత్తిడి పెంచాలని అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రతిష్ఠ పాతాళానికి పోయిందని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతున్నట్లు ప్రకటిస్తే తప్ప పార్టీకి మనుగడ కష్టమని వివరిస్తున్నారు. శనివారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోవాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిని పట్టుబట్టడమే మంచిదని కొందరు భావిస్తున్నారు.

విభజన జరగదు.. సీఎం సన్నిహితుల అభిప్రాయం
రాష్ట్ర విభజన అంశం ఇంకా తుది అంకానికి చేరుకోలేదని ముఖ్యమంత్రి సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన జరగదని ఇప్పటికీ సీఎం కిరణ్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తన సన్నిహితులకు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వ్యక్తపరుస్తున్న విశ్వాసాన్ని ఆయన సన్నిహితులు నమ్ముతున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన తీర్మానం శాసనసభలో వీగిపోతుందని, ఫలితంగా ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.

పైగా, తీర్మానం సందర్భంగా జరిగే చర్చ స్వేచ్ఛాయుతంగా ఉంటుందని, పార్టీల తరపున విప్ జారీచేసే అవకాశమే ఉండదని చెబుతున్నారు. దీంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండుగా విడిపోతాయని, మెజారిటీ శాసనసభ్యులు కలిగిన సీమాంధ్ర ప్రాంతానిదే ఆధిక్యం కనిపిస్తోందని ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర విభజన అంత సులువైన విషయం కాదని ముఖ్యమంత్రి సన్నిహిత ప్రజా ప్రతినిధులు ఘంటాపథంగా చెబుతున్నారు. అందువల్ల శనివారంనాటి సమావేశంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరమే లేదని వారు కొట్టి పారేస్తున్నారు.

ఆదివారం తెలంగాణ ప్రాంత నేతల సమావేశం
సీమాంధ్ర నేతల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆదివారం గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్ నేతలు సమావేశమై కార్యాచరణను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి, ఆరోజు మండలస్థాయి నేతలతో సమావేశమై తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించినందుకు సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని భావించారు.

అలాగే, సోమవారం ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీని కలిసి తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీతోపాటు సీమాంధ్రలోని వనరులను కోరాలని భావించారు. అయితే, సీమాంధ్ర నేతలు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తమ రాజకీయ, ప్రత్యేక రాష్ట్రసాధన వ్యూహాలను రూపొందించుకోవాలని తాజాగా నిర్ణయించారు. సీమాంధ్ర నేతల తరహాలోనే అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.

No comments:

Post a Comment