Friday 30 January 2015

బానిసత్వం నుండి బయటపడండి..

బానిసత్వం నుండి బయటపడండి..
నిజమైన సంస్కరణలు చేపట్టిన భారతీయ తత్వవేత్తలందరిని పొట్టనబెట్టుకున్న గొప్ప సంస్కృతి ఈ మనువాదులది కాదా? కబీర్‌, రవిదాస్‌, తులసీదాస్‌, పోతులూరి వీరబ్రహ్మం, వేమన చివరికి బుద్ధున్ని కూడా హత్యచేసి బుద్ధిని పోగొట్టుకోలేదు వీళ్లు. బృహద్రధుని హత్య, దయానందునికి అవమానం, వివేకానందుని తృణీకరించడం, శివాజీని పరాభవించడం, మహాత్మ జ్యోతిరావు పూలేను హత్య చేసేందుకు కుట్ర పన్నడం, డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ను హింసించడం ఇంకా ఈ చరిత్ర మరిచిపోలేదు.
ఆంధ్రజ్యోతిలో ‘నవ్య’ దినపత్రికలో మాజీ డీజీపీ డాక్టర్‌.కె.అరవిందరావు ‘అస్పృశ్యత - బ్రాహ్మణిజం’ పేరుతో వ్యాసం రాశారు. ఇదే పేజీలో ఆయన రాస్తున్న కాలమ్‌లోని కథనాలను పరిశీలించిన తరువాత.. ఈ స్పందన రాస్తున్నాను. ఆయన వ్యాసాలన్నిటినీ పరిశీలిస్తే - హిందూమతాన్ని ఉద్దరించడానికి నడుం బిగించినట్లు ఓ పెద్ద సంస్కర్తలాగ దర్శనమిచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతున్నది. నిజానికి ఆయన వ్యాసాల్లో హిందూమతంపై సమగ్ర అవగాహన, అధ్యయన లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏ వ్యవస్థనైనా, మతాన్నైనా, సంస్కృతినైనా వ్యాఖ్యానించాలంటే ఆ విషయం పట్ల అధ్యయనంతోపాటు అవగాహన అవశ్యం. హిందూమతం అనేది అసలు లేదు. ఉన్నదల్లా బ్రాహ్మణమతం లేదా ఆర్యమతం, ఇక ఈ దేశంలో ఉన్న మరో మతం భారతీయ మతం. అది ఈ దేశం మూలవాసులది అనగా నేడు చెప్పబడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలది. సింధూ నాగరికత విధ్వంసానికి ముందటి ప్రజలు ఆచరించినది ఈ మతమే. సప్తమాత్రుకల ఆరాధన, ప్రకృతి శక్తులు, పితృదేవతారాధన ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి. హిందూ అనే పదం ఈ దేశానిది కాదని ఇప్పటికే తేలిపోయిది. పండిత గోపదేవ్‌ ‘విగ్రహ పూజ సుగుణోపాసనన యగునా?’ అనే వ్యాసంలో ‘ఆర్యపదముచే వ్యవహరింపబడు భారతీయుడే మహమ్మదీయ పరిపాలనా కాలములో ప్రభువులైన ముస్లిములను అంగీకరింపనందులకు దానిని పాపముగానెంచి యార్యులను హిందువులని వ్యవహరింపదొడగిరి. హిందూ పదము పారసీకపదము. ఆ భాషలో హిందూపదమునకు డాకూ, చోర్‌, బద్మాష్‌, కాలా ఆద్మీ, కాఫెర్‌ అను అర్థములున్నవి. కొంత కాలమునకు పూర్వము తమపై బలవంతముగా రుద్దబడిన దుస్టార్థము గల హిందువను నామమునకు తమకు తోచిన యర్థములను కల్పించి దానినే వ్యవహరించుకొనుచున్నారు, ఇది బానిసత్వమునకు చిహ్మము’ అంటారు. పండిత గోపదేవ్‌ ప్రకారం డా.అరవిందరావు మొదట ఈ హిందూ బానిసత్వము నుండి బయటపడాలి.
అస్పృశ్యత అనే పేరు మన స్మృతిలో కాని భారతం, రామాయణంలలో కాని మరే ఇతర స్మృతిలో కాని కనిపించడం లేదు అంటూ ఈ వ్యాసంలో ఒక సూత్రీకరణ చేశారు అరవిందరావు. అస్పృశ్యత అనే పేరు లేకపోవచ్చు, కాని పాటించింది అస్పృశ్యతే కదా! ఏ రాయైుతేనేమి తలబాదుకోవడానికి! వేదాలలో ఈ ప్రస్తావనే లేదని ఇంకొందరు అరవిందరావులా అభిప్రాయం. గమనించండి ఈ వేద మంత్రం : ‘‘ఓహ్‌ యధేమాం వాచం కళ్యాణి మావదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాగ్‌ (శూద్రాయ చార్యాయచ స్వాయ చారణాయ’’ యజుర్వేదం 26-2). ఇక్కడ శూద్రులే కాదు అతి శూద్రులు కూడా ప్రస్తావించబడ్డారు, ఇలా వేదాలలోను జాతి వివక్షత కనిపిస్తుందనేది సందేహములేని మాట. అస్పృశ్యులైనా, శూద్రులైనా, అతి శూద్రులైనా, చండాలురైనా, దశ్యులైనా ఈ దేశ మూలవాసులైన నేటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పర్యాయపదాలుగా వాడబడినవే. స్మృతులు, పురాణాలు, వేదాలు ఇవేవి ఎరుగని ప్రజలూ ఈ దేశంలో కులాంటరానితనాన్ని, కులాంతరాలను పాటిస్తున్నారు. దీనికి కారణమెవ్వరు? ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించినవారు, ఉన్నత విద్యార్జన చేసినవారు కేవలం కులం కారణంగా నిర్వీర్యము చేయబడి దేశాభివృద్ధి కుంటుబడటానికి కారణమైనవారు, ఈ పాపం బ్రాహ్మణవాదానిది కాదా?.
ఆ పాపం మీది కాదా?
అరవిందరావు లాంటి సూడో మేధావులు చరిత్ర పొడవునా మోసం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాని నిజం నిప్పులాంటిది. సింహాలు తమ చరిత్ర చెప్పేవరకు వేటగాడు చెప్పిందే చరిత్ర కదా! అరవిందరావు ఈ వ్యాసంలోనే చరిత్రలో ఏ శతాబ్దంలో గమనించినా సంఘంలో సంస్కరణలని ప్రవేశపెట్టినవారు, సమర్థించినవారు బ్రాహ్మణవర్గాలే అని సెలవిచ్చారు, అంతేకాదు. సుమా! ప్రస్తుత వ్యవస్థలో ఎస్సీ అధికారులను ఎలాంటి అభ్యంతరం లేకుండా పూర్ణకుంభాలతో స్వాగతం చెప్పేది బ్రాహ్మణవర్గాలేనట! ఇన్ని శతాబ్ధాలలో బ్రాహ్మణ సంస్కర్తలు చేపట్టిందే బ్రాహ్మణీయ వ్యవస్థలోని అపసవ్యతలపైననే. వారు ఎన్ని సంస్కరణలు చేపట్టినా బ్రాహ్మణమత ధర్మాన్ని కాపాడటానికేనని చరిత్ర చెబుతుంది. పురాణాలు రాసినా, పూజలు చేసినా చెమటచుక్క నేల రాలకుండా పొట్ట గడుపుకోవడానికి, మూలవాసులను బానిసలుగా మార్చేందుకే ఈ తతంగమంతా అని చెప్పక తప్పదు. నిజమైన సంస్కరణలు చేపట్టిన భారతీయ తత్వవేత్తలందరిని పొట్టనబెట్టుకున్న గొప్ప సంస్కృతి ఈ మనువాదులది కాదా? కబీర్‌, రవిదాస్‌, తులసీదాస్‌, పోతులూరి వీరబ్రహ్మం, వేమన చివరికి బుద్ధున్ని కూడా హత్యచేసి బుద్ధిని పోగొట్టుకోలేదు వీళ్లు. బృహద్రధుని హత్య, దయానందునికి అవమానం, వివేకానందుని తృణీకరించడం, శివాజీని పరాభవించడం, మహాత్మ జ్యోతిరావు పూలేను హత్య చేసేందుకు కుట్ర పన్నడం, డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ను హింసించడం ఇంకా ఈ చరిత్ర మరిచిపోలేదు. ఇదంతా అరవిందరావుకు తెలియదు అనుకోవాలా? తెలిసి నీటిమీద రాతలకు ఒడిగట్టారని భావించాలా?
(గమనిక : స్థలాభావం వల్ల ‘స్పందన’ పూర్తి వ్యాసాన్ని ప్రచురించలేకపోతున్నాము..)
- డా.కదిరె కృష్ణ

No comments:

Post a Comment