Monday 19 January 2015

ఇంకా కనండి! - చంద్రబాబు

ఇంకా కనండి! (19-Jan-2015)

ఒకరిద్దరు ఎక్కువైనా పర్లేదు
 రాను రాను జనాభా తగ్గిపోతోంది
 పెళ్లిళ్లకు దూరంగా విద్యావంతులు
 ఎంజాయ్‌ చేద్దామంటూ మరికొందరు
 అందుకే జపాన్‌లో అంతా ముసలాళ్లే
 ఇప్పుడు పిల్లలను కనాల్సిన టైమొచ్చింది
 ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు

ఏలూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పిల్లల్ని కనండి.. మరింత మంది పిల్లల్ని కనండి అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పుడు పిల్లలను కనకపోతే.. భవిష్యత్తులో సంపదను సృష్టించినా దానిని అనుభవించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పాదయాత్రకు వచ్చిన ఆయన శెట్టిపేట, తాళ్లపాలెంలలో ప్రజలనుద్దేశించి
మాట్లాడారు. ‘‘రాను రాను జనాభా సంఖ్య తగ్గిపోతోంది. నేను కూడా ఒక అబ్బాయితోనే సరిపెట్టుకున్నాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. జనాభా తగ్గిపోతోంది. చాలామంది ఇప్పుడు పిల్లల్ని కనడం లేదు. చదువుకున్నవాళ్లు అయితే మరీ పెళ్లిళ్లే చేసుకోవడం లేదు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నా.. ఎందుకొచ్చిన పిల్లలు.. వచ్చిన డబ్బులతో ఎంజాయ్‌ చేద్దామని అనుకొని కొంతమంది పిల్లల్ని కనకుండా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా తొమ్మిది లక్షల మంది మరణిస్తుంటే..మరో తొమ్మిది లక్షల మంది పుడుతున్నారు. ఇంకొన్ని రోజులుపోతే చనిపోయేవారి సంఖ్య పెరుగుతుంది. పుట్టే వారి సంఖ్య తగ్గుతుంది. అప్పుడు మన ఊళ్లో అంతా ముసలివాళ్లే కనిపిస్తారు. ఈరోజు జపాన్‌లో అదే జరిగింది. ఆ దేశం అంతా ముసలివాళ్లే. దేశం దేశం పూర్తిగా చిన్న పిల్లలు లేకుండాపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు మళ్లీ ఆలోచిస్తున్నాను. వీలయితే ఒకరిద్దరిని ఎక్కువగా పుట్టిస్తే నష్టం లేదు. కానీ, అసలు పిల్లలు లేకుండా ఉండడం మంచిది కాదు..’’ అని వ్యాఖ్యానించారు. పిల్లల్ని కనాలని, అలాంటి అవసరం ఇప్పుడు వచ్చిందని చెప్పారు. పిల్లలే లేకపోతే సమాజమే లేదని, అందరూ ముసలివాళ్లు అయిపోతారని, అప్పుడు కష్టపడలేరని వివరించారు. అదే జరిగితే, ‘‘ఇప్పుడున్న సంపదను రెట్టింపు చేయడం సాధ్యం కాదు. ఒకవేళ సంపద పెరిగినా, దానిని వినియోగించుకునే అవకాశం ఉండదు’’ అని హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థతో పోలిస్తే మన వ్యవస్థ అద్భుతంగా ఉంటుందని, ఇక్కడ పిల్లాపాపలతో అందరూ కళకళలాడడం వల్లే మెరుగైన సమాజానికి అవకాశం ఏర్పడిందని వివరించారు. చంద్రబాబు తన ప్రసంగంలో ‘పిల్లల్ని కనండి’ అంటూ వ్యాఖ్యానించినప్పుడు ప్రజలు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. వారి నవ్వులను గమనించిన చంద్రబాబు.. పిల్లల్ని కనాలని తాను ఎందుకంటున్నదీ వివరించారు. భవిష్యత్తు తరం పెరగాలంటే పిల్లల్ని కనడమే మార్గమని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో చంద్రబాబు వ్యాఖ్యలే హాట్‌ టాపిక్‌గా మారాయి.

No comments:

Post a Comment