Wednesday 18 March 2015

పట్టిసీమ పాట్లు...!

పట్టిసీమ పాట్లు...!

21:34 - March 17, 2015
చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యమైందన్న ఆరోపణలున్నాయి.. బాబు రైతు వ్యతిరేకి అని విపక్షాలు విమర్శిస్తుంటాయి.. అందువల్లే పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారనే వాదనలూ వినిపించేవారున్నారు.. అయితే రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఆలోచనలో మార్పు వస్తోందా..? ఏపీ సీఎంగా రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారా..? అందుకే పట్టిసీమ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారా..? లేదంటే ఇందులో ఏమైనా రాజకీయ ప్రయోజనాలున్నాయా..? రాయలసీమకే మేలంటున్నా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎందుకు వ్యతిరేకిస్తోంది..? పట్టిసీమ పాట్లకు కారణాలేంటో స్పెషల్‌ ఫోకస్‌లో చూద్దాం....
పట్టిసీమ ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారు..?
పట్టిసీమ ప్రాజెక్టు.. 13 వందల కోట్ల వ్యయం.. టెండర్ల ప్రక్రియను పూర్తిచేసుకుంది.. పనులు మొదలు పెట్టే ప్రక్రియలో ఉంది.. ఇంతలో ఇటు రైతులు అటు ప్రధాన ప్రతిపక్ష నేతలు ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్నారు.. పట్టిసీమతో డబ్బులు వృధా తప్ప ప్రయోజనం లేదంటున్నారు.. సర్కార్‌ మాత్రం ప్రాజెక్టు కట్టితీరుతామంటోంది.. కావాలనే వైసీపీ రాజకీయం చేస్తోందని మండిపడుతోంది.. ఇంతకీ పట్టిసీమ ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారు..?
ఆదిలోనే పట్టిసీమ ప్రాజెక్టు వివాదాస్పదం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ఆదిలోనే వివాదాస్పదమవుతోంది. పోలవరం పూర్తి చేస్తామంటూనే పట్టిసీమ దేనికనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు దిగువన ఈ ఎత్తిపోతలను డిజైన్‌ చేసింది ఏపీ సర్కార్‌. ధవళేశ్వరం ప్రాజెక్టు ఎగువన పట్టిసీమను చేపడుతోంది.. సముద్రం పాలవుతున్న గోదావరి నీటిని లిఫ్ట్ ద్వారా ఉపయోగించుకోవాలనేది ప్రధాన ఉద్దేశ్యమంటోది.. దీనివల్ల కృష్ణా నీటిని రాయలసీమకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటికే రాయలసీమ తీవ్రమైన కరవుకోరల్లో ఉంది.. దాదాపు 15 వందల అడుగులకు నీటి మట్టాలు పడిపోయాయి.. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. హంద్రీనీవా ద్వారా అనంతపురం జిల్లా, కొంత మేర కర్నూలుకు నీరివ్వడం వల్ల ఉపయోగం కలుగుతోంది.. పట్టిసీమను పూర్తి చేస్తే కృష్ణా జలాల మళ్లింపుతో చిత్తూరు జిల్లాతో పాటు వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి అవకాశం ఏర్పడుతుందనేది ప్రభుత్వం వాదన.
పోలవరం నిర్మాణంపై సందేహాలు
పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టడంతో పోలవరం ఇప్పట్లో పూర్తిచేయరా అనే సందాహాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే సర్కార్ మాత్రం అలాంటి అనుమానాలు అక్కర్లేదంటోంది.. పోలవరం పూర్తయ్యే వరకు నీరు సముద్రం పాలు కాకుండా చూడాల్సిన అవసరం ఉందంటోంది.. పట్టిసీమ పూర్తి చేసేందుకు కేవలం ఏడాది సమయం మాత్రమే పడుతుందని చెబుతోంది.. ఇప్పటికే 13 వందల కోట్ల రూపాయలతో టెండర్ల ప్రక్రియ పూర్తయింది.. ప్రతియేటా దాదాపు 2 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి.. కనీసం 80 టీఎంసీల నీటిని మళ్లించినా ఉపయోగం ఉంటుంది.. ఎత్తిపోతల కోసం 30 వెర్టికల్‌ టర్బైన్‌ పంపులు వాడనున్నారు.. ఒక్కో పంపు 280 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని తోడుతుంది.. వరదల సమయంలోనే నీటిని మళ్లించడం వల్ల గోదావరి రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. పట్టిసీమ పూర్తిచేస్తే దాదాపు 7.2 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది.
పట్టిసీమ ముంపు ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరం
పట్టిసీమ ముంపు ప్రాంత రైతులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు...ఇంజనీర్లు సర్వే పనులు మొదలు పెట్టడంతో ఓ రైతు గుండె ఆగిపోయిందని అంటున్నారు.. ఇది చూసి మిగతా రైతులు కూడా ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని ఆవేదన చెందుతున్నారు.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఉన్నపలంగా పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టడం దేనికంటున్నారు.. ఉన్న భూములు పోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.. అరెకరం, ఎకరం పొలాలనే నమ్ముకుని జీవితం సాగిస్తున్నారు రైతులు.. కొందరు పూలతోటలు వేసుకుంటున్నారు. మరికొందరు కూరగాయలు సాగుచేస్తున్నారు.. ఇప్పుడు ఈ ఆధారం కూడా పోతే చావేదిక్కంటున్నారు రైతులు.. అలైన్‌ మెంట్‌ మార్పులపైనా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. గతంలో ఊర్లకు దూరంగా అలైన్‌మెంట్‌ను ఊర్లే తుడిచి పెట్టేలా మార్చేశారని మండిపడుతున్నారు అన్నాదతలు... ప్రభుత్వం తీరును నిరిస్తూ నిరసనలకు దిగుతున్నారు.. డెల్టా రైతులు సైతం పట్టిసీమను వ్యతిరేకిస్తున్నారు.. ఇప్పటికే రెండో పంటకు నీరు రావడం లేదంటున్నారు... ఇప్పుడు ఉన్ననీటిని కృష్ణాకు మళ్లిస్తే తాము రోడ్డున పడుతామంటున్నారు.
పట్టిసీమను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
ప్రభుత్వం మాత్రం పట్టిసీమను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.. భూసేకరణ ఇబ్బందులు కలగకుండా పైప్‌లైన్లు వేస్తామంటోంది.. ప్రాజెక్టును త్వరతిగతిన పూర్తి చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది... నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిని చైర్మన్‌గా నియమించింది.. ఇరిగేషన్‌ శాఖ ప్రధాన కార్యదర్శి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శులను సభ్యులుగా చేర్చింది.. భూసేకరణ ప్రక్రియ త్వరితగతని పూర్తిచేయడం.. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు సాధించడం.. ముంపు బాధితులకు పరిహారం అందించే బాధ్యతలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.. టెండర్ల కేటాయింపు సైతం పూర్తిచేసింది.. అయితే ఈ వ్యవహారంపైనా విమర్శలు వస్తున్నాయి.. 20 శాతం ఎక్కువ కోట్‌ చేసిన కంపెనీకి ఎలా పనులు అప్పగిస్తారని ప్రశ్నిస్తోంది ప్రధాన ప్రతిపక్షం.. పోలవరం పూర్తిచేశాక పట్టిసీమకు పెట్టిన 13 వందల కోట్లు వృధాగా పోతుందనే వాదన వినిపిస్తోంది.
అసంబ్లీని వేడెక్కించిన పట్టిసీమ
పట్టిసీమ ప్రాజెక్టు అంశం అసెంబ్లీని వేడెక్కించింది.. నదుల అనుసంధానంపై చేపట్టిన చర్చ దుమారానికి దారితీసింది.. పట్టిసీమతో రైతులకు మేలని ప్రభుత్వం చెబుతోంది.. 13 వందల కోట్లు ఖర్చు చేస్తే రైతులకు 13 వేల కోట్ల ఆదాయం వస్తుందంటోంది.. వైసీపీ మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయకుండా చేతులెత్తేసేలా ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తోంది.. జలయజ్ఞనం ధనయజ్ఞంగా మార్చే చరిత్ర తమది కాదని టీడీపీ సర్కార్‌ ఎదురుదాడికి దిగుతోంది.. ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తుండటంతో ఏపీ అసెంబ్లీ హాట్‌హాట్‌గా సాగింది.
పట్టిసీమ.. అసెంబ్లీలో పంతాలు-పట్టింపులు
పట్టిసీమ.. అసెంబ్లీలో పంతాలు పట్టింపులకు దారితీస్తోంది.. ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలిద్దరూ రాయలసీమకు చెందిన వాళ్లైనా భిన్నవాదనలు వినిపిస్తున్నారు.. ఒకరేమో ప్రాజెక్టుతో ఉపయోగం లేదంటే మరొకరేమో రాజకీయాలు సరికావంటూ చురకలంటిస్తున్నారు.. పట్టిసీమ అంశంతో సభను వేడెక్కిస్తున్నారు.. ప్రధాన ప్రతిపక్షం తీరు ప్రజలకు మేలు చేసేలా ఉండాలంటూ చురకలంటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..
పట్టిసీమ.. పోలవరం ఉనికికి ప్రమాదం
పట్టిసీమ ప్రాజెక్టు అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది.. ప్రభుత్వ చర్యలు పోలవరం ఉనికికే ప్రమాదమని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది.. పట్టిసీమతో నదుల ప్రాజెక్టు నిర్మాణం అనుసంధానికి విఘాతమని అభిప్రాయపడింది.. పోలవరం నిర్మాణంతోనే నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేసింది.. టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు వైసీపీ నేతలు.. కూర్చోవడానికి గదులు లేవంటున్న ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు లేవని చెబుతున్న ఏపీ సర్కార్‌..21 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన సంస్థకు టెండర్లు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది.. ఏడాదిలో ప్రాజెక్టు పూర్తిచేయడమూ సాధ్యం కాదన్నారు వైసీపీ ఎమ్మెల్యే.. ప్రభుత్వం మాట నిలుపుకుంటే సభలో అడుగుపెట్టబోమన్నారు ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి.. ఈ ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది ప్రాజెక్టు పూర్తిచేయడం వైసీపీకి ఇష్టం లేనట్లుందని మండిపడింది.
వైసీపీ అభ్యంతరాలకు గట్టిగా సమాధానమిచ్చిన ప్రభుత్వం
వైసీపీ అభ్యంతరాలకు ప్రభుత్వం గట్టిగా సమాధానమిచ్చింది.. కృష్ణా, గోదావరి మిగులు జలాలే రాయలసీమకు తీసుకెళ్తామని చెప్పింది.. డెల్టాకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేసింది...రాష్ట్రాభివృద్ధికి అడుగుడుగునా అడ్డుపడుతున్న వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మీగిలిపోతారని విమర్శించింది.. రాయలసీమ అభివృద్ధి చెందకపోవడానికి వైఎస్‌ రాజారెడ్డి కుటుంబమే కారణమని ఫైరయింది... తమ పునాదులు కదులుతాయనే వైసీపీ పట్టిసీమను వ్యతిరేకిస్తోందని ఆరోపించింది.. ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రాజెక్టు పూర్తి చేసి సీమకు తాగు, సాగునీరందిస్తామని తేల్చిచెప్పింది ఏపీ సర్కార్‌... కరవు పరస్థితుల్లోనూ కడప జిల్లా పులివెందులకు నీళ్లిస్తుండటంతో జగన్‌ బెంబేలెత్తిపోతున్నారని ఎదురుదాడి చేసింది.. పంటలు పండితే ఫ్యాక్షనిజం పోయి బలం తగ్గుతుందని జగన్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేసింది ప్రభుత్వం.. 120 రోజుల పాటు గోదావరి ఉప్పొంగుతుందని వివరించారు సీఎం చంద్రబాబు.. దీనికి జగన్‌ అడ్డుచెప్పారు.. 40 రోజులే గోదావరి పొంగుతుందని చెప్పారు.. అలాగే ఎత్తిపోతల నీటిని ఎక్కడ నిల్వచేస్తారని ప్రశ్నించారు జగన్‌.
వైఎస్‌పై చంద్రబాబు ఫైర్‌
పట్టిసీమ అంశంపై సభలో మటాల తూటాలు పేలాయి.. వైఎస్‌ నికర జలాలను కూడా సీమకు ఇవ్వలేదన్నారు చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తూ అవాస్తవాలు ప్రచారం చేసిన వాళ్లను ప్రజలు క్షమించరన్నారు.. పట్టిసీమ, పోలవరం ఆపాలనేది వైసీపీకి అవసరమన్నారు.. వైఎస్‌ను చూసే బాబు కాపీకొడుతున్నారని కౌంటర్‌ ఇచ్చారు వైసీపీ నేతలు.. పాదయాత్రలు, అధికారంలోకి రాగానే ఫైళ్లపై సంతకాలు చేయడం ఎవరిని చూసి అనుకరిస్తున్నారంటూ చురకలంటించారు. దీనికి బాబు గట్టిగా బదులిచ్చారు.. రౌడీయిజం చేయడం మీ తండ్రి వల్లే కాలేదు మీ వల్లేం అవుతుందంటూ అసెంబ్లీని హీటెక్కించారు.. సీఎం కామెంట్స్‌ను నిరసిస్తూ వైసీపీ సభ్యులు పోడియం దగ్గర బైఠాయించారు.
అధికార- విపక్షాల విమర్శలు
పట్టిసీమ ప్రాజెక్టు అంశంపై ఎవరి వాదనలు వాళ్లు వినిపించారు. ప్రభుత్వం అవునంటే ప్రతిపక్షం కాదంది.. కాంట్రాక్టరు ప్రయోజనం కోసం ప్రాజెక్టులు కడతారా అని విపక్షం నిలదీస్తే .. కావాలంటే టెండర్‌ జగన్‌కు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పిన అధికార పక్షం ఆరోపణలకు ఆదిలోనె చెక్‌పెట్టే ప్రయత్నం చేసింది.. ఇలా ఎవరికి వాళ్లు విమర్శలు చేసుకోవడంతో సభ గందరగోళంగా మారుతోంది.
తెలంగాణకు పాకుతోన్న పట్టిసీమ వ్యవహారం
పట్టిసీమ వ్యవహారం తెలంగాణకు పాకుతోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ అనుమతి తీసుకోవాలంటున్నారు సీఎం కేసీఆర్‌.. దీనికంతటికీ జగన్‌ తీరే కారణమని మండిపడుతున్నారు చంద్రబాబు.. ప్రజలకు మేలు జరగకూడదన్నదే జగన్‌ ఉద్ధేశ్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇందుకోసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.. ఈ కామెంట్స్ ను తిప్పికొట్టారు వైసీపీ అధినేత జగన్‌..
మిగులు జలాలపై హక్కెవరది..?
రాష్ట్ర విభజన జరిగినా ఇంకా పంపకాలు పూర్తికాలేదు.. ప్రధానంగా నీటి కేటాయింపులపై స్పష్టత రాలేదు.. ఇప్పటికే కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాలు వాదోపవాదాలకు దిగుతున్నాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వాడకంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గొడవలకు దిగుతున్నాయి.. అటు గోదావరి నీటి వినియోగం లెక్కలు తేలలేదు.. కృష్ణా నీటి కేటాయింపులపై స్పష్టత రాలేదు.. రెండు నదులకు బోర్డులు ఏర్పాటు చేసినా ఇంకా వాటికి అధికారాలు లేవు.. ట్రిబ్యునల్స్‌లో వాదనలు వినిపిస్తున్నాయి రాష్ట్రాలు.. మిగులు జలాలపైనా ఎవరి వాదన వాళ్లదే అన్నట్లుగా ఉంది.. మిగులు జలాలపై హక్కులు దిగువ రాష్ట్రాలకే ఉంటాయంటోంది ఏపీ.. తాజాగా పట్టిసీమతో గోదావరి నీళ్ల గొడవ మొదలౌతోంది.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు పోను ఏపీకి ఎంత వాటా వస్తుందనేది తేలాల్సి ఉంది.. పొరుగు రాష్ట్రాల అంగీకారం లేకుండా గోదావరిపై ఎలా ప్రాజెక్టులు నిర్మిస్తారని ప్రశ్నిస్తున్నారు సీఎం కేసీఆర్‌.
కేసీఆర్‌కు జగన్‌ సపోర్టా..? చంద్రబాబు
కేసీఆర్‌ అభ్యంతరాలను అసెంబ్లీలో ప్రస్తావించారు చంద్రబాబు.. ప్రతిపక్ష నేత తీరు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్ట్ చేసేలా ఉందన్నారు.. కేసీఆర్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకునే పట్టిసీమకు అడ్డుతగులుతున్నారని జగన్‌కు చురకలంటించారు.. గోదావరిపైన ప్రాణహిత-చేవెళ్లతో పాటు తాము దేనికీ అభ్యంతరం చెప్పడం లేదంటున్నారు బాబు.. అలాంటప్పుడు కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు సరికాదంటున్నారు.. జగన్‌కు రాజకీయంగా భవిష్యత్‌ ఉండదనే భయంపట్టుకుందని మండిపడుతున్నారు.. రైతులకు జరిగే మేలును అడ్డుకోవాలనే ప్రయత్నాలు మంచివి కావంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి.
చర్చ జరిగితే తెలుస్తుందన్న జగన్‌
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఫైరయ్యారు జగన్‌.. సభలో చర్చ జరగకుండా అడ్డుపడుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ జరిగితే బండారం బయటపడుతుందనే భయమని చురకలంటించారు.. కేసీఆర్‌తో కుమ్మక్కైంది బాబేనని కౌంటర్‌ ఇచ్చారు.. అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూడా ప్రతిపక్షానికి సమయం కేటాయించడం లేదన్నారు.. మైక్‌ ఇవ్వగానే కట్‌ చేయించి మంత్రులతో తిట్టించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు జగన్‌.. పట్టిసీమ ప్రాజెక్టు టెండర్లు కట్టబెట్టిన తీరు కూడా దారుణంగా ఉందన్నారు.. ఏడాదిలో పూర్తి చేస్తే 16.5 శాతం బోనస్‌గా ప్రకటించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.. ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రభుత్వమే చెబుతూ ఈ నజరానాల ఉద్ధేశ్యం ఏంటో చెప్పాలన్నారు జగన్‌.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పుకొస్తున్నారు జగన్‌.
టీడీపీ సర్కార్‌ దూరదృష్టి: విశ్లేషకులు
పట్టిసీమ ప్రాజెక్టు వెనుక టీడీపీ ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం పూర్తికాకపోయినా పట్టిసీమతో సీమ రైతులను ఆదుకునే ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు.. రాయలసీమలో వైసీపీకి బలం ఉన్న ప్రాంతాల్లో పాగా వేసేలా స్కెచ్‌ వేస్తోందంటున్నారు.. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడం.. కేంద్రం కేటాయింపులు చూస్తే సకాలంలో కంప్లీట్‌ కావడం కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి.. ఈలోపు పట్టిసీమ పూర్తి చేస్తే మైలేజ్‌ వస్తుందనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు అనలిస్టులు.. వైసీపీ సైతం పోలవరం అంశాన్ని హైలైట్‌ చేయడానికి కారణం ఇదేనంటున్నారు పరిశీలకులు.. ఎవరి అంచనాలు ఆలోచనలు వాళ్లకు ఉన్నా పట్టిసీమ విషయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..
ఉమ్మడి రాష్ట్రంలో ధనయజ్ఞంగా మారిన జలయజ్ఞం..
ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందనే ఆరోపణలున్నాయి.. ప్రాజెక్టులకు చేసిన వ్యయం దాని వల్ల కలిగిన ఫలితం శూన్యమనే వాదనలున్నాయి.. ఇప్పుడు తాజాగా పట్టిసీమ ప్రాజెక్టు వ్యవహారం దుమారం రేపుతోంది.. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఎలా చెక్‌పెడుతుందనేది తేలాల్సి ఉంది.. ముంపు రైతులతో పాటు అభ్యంతరాలు చెబుతున్న నేతలను ఎలా శాంతింపచేస్తుందో వేచి చూడాలి...

No comments:

Post a Comment